'ఓటుకు నోటు కేసుతో ఏం చేసినా ఇబ్బంది లేదు, రేవంత్ రెడ్డిని హింసిస్తున్నారు'
అమరావతి: ఓటుకు నోటు కేసులో ఏం చేసినా తమకు వచ్చే ఇబ్బంది ఏమీ లేదని ఆంధ్రప్రదేశ్ మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి బుధవారం అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నేత జగ్గారెడ్డిని జైలుకు పంపించారని, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని హింసిస్తున్నారని మండిపడ్డారు.
తిరుమల విషయం తేల్చేందుకు హైదరాబాద్కు సుబ్రహ్మణ్యస్వామి, హైకోర్టులో పిటిషన్
12 కేసులున్న జగన్ అధికారంలోకి రావాలా?
కర్ణాటకలో డీకే శివకుమార్ ఇంటిపై ఐటీ దాడులు చేశారని గుర్తు చేశారు. ఎమర్జెన్సీలోను ఇంతలా అధికార దుర్వినియోగం జరగలేదని అన్నారు. చంద్రబాబు నాయుడును అధికారంలోకి రానివ్వమని చెబుతున్న బీజేపీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 12 కేసులు ఉన్న జగన్ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారా అని నిలదీశారు.
కన్నా ఓ చేతిలో బీజేపీ జెండా, మరో చేతిలో వైసీపీ జెండా
బీజేపీ ఏపీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ తన అక్రమాస్తులు కాపాడుకోవడానికే బీజేపీలో చేరారని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న వేరుగా ఆరోపించారు. కన్నా లక్ష్మీనారాయణ ఓ జేబులో బీజేపీ జెండాను మరో జేబులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండాను పెట్టుకున్నారని విమర్శించారు. ఆయన పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఎకరం భూమి రూపాయికే కేటాయించారన్నారు.
పొలిటికల్ డిప్రెషన్లో జగన్, పవన్ కళ్యాణ్
సైకిల్ పైన తిరిగిన కన్నా లక్ష్మీనారాయణకు విదేశాలలో కంపెనీలు ఎక్కడివో చెప్పాలని బుద్ధా వెంకన్న ప్రశ్నించారు. 2014లో తప్పించుకున్నా 2019లో కన్నా జైలుకెళ్లడం ఖాయమని జోస్యం చెప్పారు. రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నర్సింహా రావు ఏపీకి పట్టిన శని అన్నారు. వెకిలి చేష్టలతో ఆయన రాజకీయాలు చేస్తున్నారన్నారు. జగన్, పవన్ కళ్యాణ్ ఇద్దరూ పొలిటికల్ డిప్రెషన్లో ఉన్నారన్నారు.
కేంద్రం పార్లమెంటులో బిల్లు పెట్టింది
కేసీఆర్ నిజామాబాద్ సభలో వాడిన భాష అభ్యంతరకరమని ఏపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద రావు వేరుగా అన్నారు. ఎన్నికలు వస్తే కేసీఆర్ ఎలా మాట్లాడతారో అందరికీ తెలిసిందే అన్నారు. ఇది ఊహించిందే అన్నారు. కేసీఆర్ ఏదో విధంగా ప్రజలను రెచ్చగొట్టి సెంటిమెంట్తో లబ్దిపొందేందుకు చూస్తున్నారన్నారు. 7 మండలాలను చంద్రబాబు గుంజుకున్నారని కేసీఆర్ తిట్టడం సరికాదని, 7 మండలాలు ఏపీలో కలపాలని కేంద్రం పార్లమెంట్లో బిల్లు పెట్టి చేసిందన్నారు.