తెలుగు రాష్ట్రాలకు షాక్ : నియోజకవర్గాల పెంపు ఇప్పట్లో లేనట్టే
నియోజకవర్గాల పెంపు ఇప్పటికిప్పుడు సాధ్యమయ్యే ప్రక్రియ కాదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్సరాజ్ తేల్చి చెప్పారు.
న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ-ఆంధ్రప్రదేశ్లో నియోజకవర్గాల పెంపు ఉంటుందన్న వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే నియోజకవర్గాల పెంపు ఇప్పటికిప్పుడు సాధ్యమయ్యే ప్రక్రియ కాదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్సరాజ్ తేల్చి చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పెంపు ఇప్పట్లో ఉండబోదని ఆయన స్పష్టం చేశారు.
రాజ్యసభ్యలో నియోజకవర్గాల పెంపుపై టీడీపీ ఎంపీ టీజీ వెంకటేష్ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. ఈ సమాధానం వ్యక్తపరిచారు హన్సరాజ్. నియోజకవర్గాలను పెంచాలంటే ఆర్టికల్ 371ను సవరించాలని, ఇప్పట్లో అది సాధ్యమయ్యే పని కాదని కేంద్ర మంత్రి తెలిపారు. కాగా, ఏపీ విభజన చట్టంలో.. ఏపీలోని అసెంబ్లీ 175 నియోజకవర్గాలను 225కి, తెలంగాణలోని 119 నియోజకవర్గాలను 175కి పెంచుకునే వెసులుబాటును పొందుపర్చారు.

ఈ నేపథ్యంలోనే నియోజకవర్గాల పెంపు విషయమై.. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తున్నాయి. వాస్తవానికి డీలిమిటేషన్ ను 2026 వరకు చేపట్టకూడదంటూ గతంలో పార్లమెంటులో చట్టాన్ని చేశారు. కాబట్టి ఇప్పుడు నియోజకవర్గాల పెంపు చేపట్టాలంటే ఆ చట్టాన్ని సవరించాల్సి ఉంటుంది.
దీంతో రాజ్యాంగ పరమైన ఇబ్బందులు తలెత్తకుండా నియోజకర్గాల పెంపు సాధ్యమా? అంటూ అటార్నీ జనరల్ ను కేంద్రం అడిగింది. నియోజకవర్గాల పెంపుకు నిబంధనలు అంగీకరించవని అటార్నీ జనరల్ నివేదిక ఇవ్వడంతో.. ఇక ఇప్పట్లో పెంపు అసాధ్యమనే విషయం స్పష్టమైంది.












Click it and Unblock the Notifications