ఎట్టి పరిస్థితుల్లో హోదా ఇవ్వం, పరిశ్రమలకూ: తేల్చేసిన కేంద్రం, లెక్క చెప్పలేదని బాబుకు షాక్
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం మరోసారి మొండిచేయి చూపింది. ఎట్టి పరిస్థితుల్లోను ఏపీకి ప్రత్యేక హోదా సాధ్యం కాదని కేంద్ర ఆర్థిక శాఖ తేల్చి చెప్పింది. రాష్ట్రానికి ఇచ్చిన నిధుల విషయమై ఒక్క రూపాయికి రాష్ట్రం లెక్క చెప్పలేదని అన్నారు.
Recommended Video
ఏపీకి హోదాపై ఏపీకి చెందిన టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంటు లోపల ఆందోళన వ్యక్తం చేయడంతో పాటు ఢిల్లీలో పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతున్నారు. అయితే ఏపీకి హోదా సాధ్యం కాదని కేంద్రం మరోసారి తేల్చేసింది.
బీజేపీ ఆహ్వానం
ప్రత్యేక హోదా, విభజన హామీల కోసం ఏపీ ఎంపీలు నిరసనలు తెలుపుతున్న నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీలు ఏపీ సీఎం చంద్రబాబును, టీడీపీ ఎంపీలను చర్చలకు పిలిచారు.
చర్చలు విఫలం
కేంద్రం నుంచి పిలుపు నేపథ్యంలో ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు నేతృత్వంలో సోమవారం సాయంత్రం అరుణ్ జైట్లీతో భేటీ అయ్యారు. అయితే ఈ భేటీ టీడీపీ నేతలకు సంతృప్తి నివ్వలేదు. ఇదే విషయాన్ని చంద్రబాబుకు మంగళవారం ఉదయం ఎంపీలు టెలి కాన్ఫరెన్స్ సందర్భంగా చెప్పారు.
హోదా ఇవ్వలేం
ఏపీ ఎంపీలు ఆందోళనలు చేసినా ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్రం తేల్చి చెప్పిందని తెలుస్తోంది. సెంటిమెంట్ ఆధారంగా నిర్ణయాలు తీసుకోమని చెప్పింది. ప్రత్యేక హోదా సాధ్యం కాదని చెప్పేసింది.
ఒక్క రూపాయికి లెక్క చెప్పలేదు, పరిశ్రమలకు రాయితీ నో
ఏపీకి కేంద్రం ఇచ్చిన నిధులలో ఒక్క రూపాయికి లెక్క చెప్పలేదని ఆర్థిక శాఖ ఏపీ ప్రభుత్వానికి షాకిచ్చింది. అంతేకాదు హోదానే కాకుండా పరిశ్రమలకు రాయితీలు కూడా సాధ్యం కాదని తేల్చి చెప్పింది.
ఈశాన్య రాష్ట్రాల్లా ఇస్తే ఇతర రాష్ట్రాల నుంచి డిమాండ్
ఈశాన్య రాష్ట్రాలకు ఇచ్చినట్లుగా ప్రత్యేక హోదా ఏపీకి ఇస్తే దేశంలోని పలు రాష్ట్రాల నుంచి ఈ డిమాండ్ వస్తుందని కేంద్ర ఆర్థిక శాఖ తేల్చి చెప్పిందని తెలుస్తోంది. నరేంద్ర మోడీపై తనకు నమ్మకం ఉందని జగన్ చెప్పారు. కానీ కేంద్రం మాత్రం ఇవ్వలేమని తేల్చి చెప్పింది.
ప్యాకేజీయే.. మళ్లీ మొదటికి వచ్చినట్లేనా
గతంలో ప్రకటించినట్లుగా ప్యాకేజీ మాత్రమే ఇస్తామని, హోదా మాత్రం సాధ్యం కాదని కేంద్రం తేల్చి చెప్పడంతో సమస్య మళ్లీ మొదటికి వచ్చినట్లుగా భావిస్తున్నారు. చంద్రబాబు తాజాగా మంగళవారం మాట్లాడుతూ.. బీజేపీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. మరోవైపు రాహుల్ గాంధీ ప్రత్యేక హోదాకు మద్దతు తెలిపారు.