హోదా చిచ్చు: ఏం మాటలని వెంకయ్యపై పార్థసారథి, మాకా లెక్కలొద్దు: రామ్మోహన్
హైదరాబాద్/న్యూఢిల్లీ: ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేమని చెప్పిన కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ వ్యాఖ్యల పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పార్థసారథి శుక్రవారం స్పందించారు. కేంద్రం, చంద్రబాబు, కేంద్రమంత్రి వెంకయ్య పైన ఆయన మండిపడ్డారు.
విభజన సమయంలో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభలో హామీ ఇచ్చారన్నారు. నాడు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బిజెపి.. ఐదేళ్లు ప్రత్యేక హోదా సరిపోదని, పదేళ్లు ఇవ్వాలని డిమాండ్ చేసిందని గుర్తు చేశారు. ఇప్పుడు ప్రత్యేక హోదా సాధ్యం కాదని చెప్పడం విడ్డూరమన్నారు.
ప్రత్యేక హాదా పైన బిజెపి స్పందనకు టిడిపి ఏం చెబుతుందన్నారు. ఏపీ ప్రయోజనాలు ముఖ్యమైతే టిడిపి ఇప్పటికే బిజెపికి అల్టిమేటం జారీ చేయాలన్నారు. అలాగే, కేబినెట్లో ఉన్న తమ కేంద్రమంత్రులను విత్ డ్రా చేసుకోవాల్సి ఉండెనని చెప్పారు.
దీర్ఘకాలిక ప్రయోజనాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టించుకోవడం లేదన్నారు. ప్రత్యేక హోదాపై బిజెపి, టిడిపి నేతలు సమాధానం చెప్పాలన్నారు. ఏపీకి చంద్రగ్రహణం పట్టిందని ఎద్దేవా చేశారు. చీకట్లో విభజన చేశారన్నారు. ఏపీని ఇంకా చీకట్లోకి నెడుతున్నారన్నారు.
ఏ పార్టీలు ఈ రాష్ట్రాన్ని రెండు ముక్కలుగా నరికాయో.. ఆ పార్టీలకు చెందిన మంత్రులను పక్కన పెట్టుకొని చంద్రబాబు కేబినెట్ మీటింగ్ పెట్టడం విడ్డూరమన్నారు. ప్రత్యేక హోదా పైన రాష్ట్రాన్ని విభజించిన పాత్ర ఉన్న బిజెపిని వదిలి, పొత్తు పెట్టుకున్న టిడిపిని కాదని, మమ్మల్ని ఎలా ప్రశ్నిస్తారన్నారు.
టిడిపికి చెందిన కేంద్రమంత్రులను చంద్రబాబు వెంటనే వెనక్కి పిలవాలన్నారు. చంద్రబాబు కేంద్ర ప్రభుత్వం ముందు మోకరిల్లుతున్నారన్నారు. ప్రత్యేక హోదా కోసం మేం అనేకసార్లు కేంద్ర పెద్దలను కలిశామని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అర్హత లేదని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు చెబుతున్నారని, ప్రత్యేక హోదా ఇవ్వకుండా తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. హోదా ఇవ్వకుంటే బిజెపి తగిన మూల్యం చెల్లించుకుంటుందన్నారు. ప్రత్యేక హోదా విభజన సమయంలో ఇచ్చిన హామీ అన్నారు.
ప్రత్యేక హోదా కావాల్సిందే: రామ్మోహన్ నాయుడు
కేవలం 14వ ఫైనాన్స్ కమిషన్ చేసిన సిఫార్సుల ప్రకారమే ఆర్థిక శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వలేమని చెప్పారని టీడీపీ ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడు ఢిల్లీలో అన్నారు. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా పెంపు లెక్కలు తమకొద్దని, హామీ మేరకు ప్రత్యేక హోదా ఇవ్వాలన్నారు.
హోదా కోసం టిడిపి ఎంపీల పోరాటం కొనసాగుతుందన్నారు. తమకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమన్నారు. రాష్ట్రం విడిపోయిన తరువాత ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్ నష్టపోయిందని, రాబడి కూడా తగ్గిందన్నారు.ప్రత్యేక హోదా ఇస్తే తప్ప మరే ఇతర మార్గాల ద్వారా కూడా జరిగిన నష్టం పూడదన్నారు.