రఘురామ..కుల బహిష్కరణా?: రాజుల పరువు తీస్తోన్నాడు: అండగా ఉండలేం: క్షత్రియ సమితి
ఏలూరు: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన తిరుగుబాటు లోక్సభ సభ్యుడు రఘురామ కృష్ణంరాజు ఉదంతం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. రఘురామ అరెస్టు విషయంపై ప్రతిపక్షాలన్నీ ఏకమయ్యాయి. వైఎస్సార్సీపీ రాజకీయ ప్రత్యర్థి పార్టీలన్నీ ఒకేచోటికి చేరాయి. రఘురామకు వైసీపీయేత పార్టీలన్నీ నైతిక మద్దతును ప్రకటించాయి. ఆయన అరెస్ట్ను తప్పుపడుతున్నాయి. అదే సమయంలో రఘురామ కృష్ణంరాజు సామాజిక వర్గానికి చెందిన క్షత్రయ కులస్తులు మాత్రం ఆయనను దూరం పెట్టారు. ఆయనకు ఏ మాత్రం అండగా ఉండలేమని తేల్చి చెప్పారు.

అది ఆయన సొంతంగా సృష్టించుకున్న సమస్య..
పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం లోక్సభ నియోజకవర్గానికి చెందిన క్షత్రియ సేవా సమితి నాయకులు భీమవరంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు కొన్ని కీలక తీర్మానాలు చేశారు. రఘురామ కృష్ణంరాజు అరెస్టు వ్యవహారంలో జోక్యం చేసుకోకూడదని నిర్ణయించుకున్నారు. దీన్ని వారు రఘురామ స్వయంగా సృష్టించుకున్నసమస్యగా వారు అభివర్ణించారు. ఇందులో కులం ప్రస్తావన గానీ, కుల సమితి జోక్యం గానీ ఉండకూడదని తీర్మానించుకున్నారు.

క్షత్రియ కులానికి తలవంపులు..
14 నెలలుగా రఘురామ కృష్ణంరాజు నియోజకవర్గం ముఖం చూడలేదని, కరోనా సమయంలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారనే విషయంపై కనీసం దృష్టి సారించలేదని క్షత్రియ సేవా సమితి నాయకులు పేర్కొన్నారు. ఆయన మాటలు, ప్రవర్తను క్షత్రియ సమాజం అసహ్యించుకుంటోందని అన్నారు. రఘురామకు కొందరు క్షత్రియ సోదరులు మద్దతుగా ఉంటున్నట్లు వస్తోన్న వార్తలు అవాస్తవమని క్షత్రియ సేవా సమితి తేల్చి చెప్పారు. నరసాపురం లోక్సభ నియోజకవర్గం పరిధిలోని క్షత్రియ సామాజిక వర్గీయులెవరూ ఆయనకు మద్దతు ఇవ్వట్లేదని స్పష్టం చేశారు.

ఏకగ్రీవ నిర్ణయం..
రఘురామకు అండగా ఉండకూడదంటూ తాము ఏకగ్రీవ నిర్ణయాన్ని తీసుకున్నామని అన్నారు. ఒక లోక్సభ సభ్యుడిగా ఉంటూ.. ఏడాది కాలంగా నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారని, ప్రజా సమస్యలను ఏమాత్రం పట్టించుకోవట్లేదని అన్నారు.
ఎలాంటి కారణాలు లేకుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద, తనను ఎంపీగా గెలిపించి లోక్సభకు పంపించిన వైసీపీ మీద, ఆ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేల మీద రోజూ విమర్శలు చేస్తున్నారని అన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో తన లోక్సభ నియోజకవర్గాన్ని గాలికి వదిలేసిన ఎంపీకి తాము ఏ మాత్రం మద్దతుగా ఉండదలచుకోలేదని స్పష్టం చేశారు.

స్వలాభం, ఆస్తుల కోసమే..
స్వలాభం, సొంత ఆస్తులను కాపాడుకోవడానికే రఘురామ తన ఎంపీ హోదాను వినియోగించుకుంటోన్నారని క్షత్రియ సేవా సమితి నాయకులు విమర్శించారు. ఇది కేవలం రఘురామ ఒక్కడికే సంబంధించిన విషయమని, దీనికి క్షత్రియ సామాజిక వర్గంతో సంబంధం లేదని తేల్చేశారు. ఈ వివాదంలోకి క్షత్రియ సామాజిక వర్గాన్ని లాగొద్దని వారు మీడియాకు విజ్ఞప్తి చేశారు. రఘురామకు సొంత పార్టీకి చెందిన స్థానిక ఎమ్మెల్యేలతో ఏ మాత్రం సఖ్యత లేదని, టికెట్ ఇచ్చి గెలిపించిన పార్టీ మీదే లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని, ఈ రకంగా ఆయన రాజులకు ఉన్న మంచిపేరును చెడగొడుతున్నారని ధ్వజమెత్తారు.

బంధువులు తప్ప..
రఘురామ వెంట ఆయన బంధువులు తప్ప మరెవరూ లేరని క్షత్రియ సేవా సమితి నాయకులు స్పష్టం చేశారు. వైసీపీ టికెట్ మీద గెలిచి, ఆ పార్టీ మీద, ముఖ్యమంత్రి మీద విమర్శలు చేయడం క్షత్రియ సామాజిక వర్గానికి తలవంపులుగా భావిస్తున్నామని అన్నారు. క్షత్రియులకు వైఎస్ జగన్ రాజకీయాల్లో సముచిత స్థానం కల్పించారని, తమ కులస్తులపై ఉన్న గౌరవంతోనే జగన్.. నర్సాపురంలో ఆ సామాజిక వర్గానికి మూడు అసెంబ్లీ స్థానాలు, ఒక ఎంపీ టికెట్ ఇచ్చారని గుర్తు చేశారు.
నియోజకవర్గానికి, సొంత రాష్ట్రానికి దూరంగా ఢిల్లీ, హైదరాబాద్లో ఉంటూ.. కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టేలా రోజుకో ప్రకటన చేస్తున్నారని మండిపడ్డారు. అలాంటి విలువల్లేని నాయకుడికి తాము ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతు ఇవ్వబోమని, అండగా నిల్చుబోమని తేల్చి చెప్పారు.












Click it and Unblock the Notifications