భయపెట్టినందుకే?: రౌడీషీటర్ను కత్తులతో పొడిచి చంపారు
అమరావతి: విశాఖలో రౌడీషీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన సోమవారం రాత్రి జిల్లాపరిషత్తు ఆవరణంలో న్యాక్ ప్రాంతీయ శిక్షణ కేంద్రం సమీపంలో జరిగింది. మృతుడు స్థానిక రాందేవ్పేటకు చెందిన బట్ట నర్సింహమూర్తి(28)గా పోలీసులు గుర్తించారు.
ఏసీపీ రమణ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. రౌడీ షీటర్గా ఉన్న నర్సింహమూర్తి సోమవారం సాయంత్రం 7.30 గంటలకు ఇంటి నుంచి బయటకు వచ్చాడు. 10 గంటల వరకు ఫోన్లో కుటుంబసభ్యులకు అందుబాటులో ఉన్నాడు. అరగంట తరువాత వారు ఫోన్ చేస్తే స్విచ్చాఫ్ అని వచ్చింది.
దీంతో 10.30 నుంచి 11 గంటల మధ్యలో నర్సింహమూర్తి హత్య జరిగి ఉండవచ్చని ఏసీపీ అభిప్రాయం వ్యక్తం చేశారు. మద్యం తాగిన తరువాత స్నేహితులే ఈ హత్యకు పాల్పడి ఉండవచ్చని అనుమానం కూడా వ్యక్తం చేశారు. మృతుడు నర్సింహమూర్తిపై గతంలో పలు దొంగతనాలు, కేసుల్లో అభియోగాలు ఉన్నాయన్నారు.
హత్యకు పాత కక్షలు కారణమై ఉండవచ్చన్నారు. ఆయా కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని నిందితులను తొందరలోనే పట్టుకుంటామని పేర్కొన్నారు. మృతుడు నరసింహమూర్తికి భార్య ధనలక్ష్మితో పాటు 11 నెలల కుమారుడు దుర్గాప్రసాద్ ఉన్నారు.
సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకొని రక్తపు మడుగులో ఉన్న నర్సింహమూర్తి మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
నర్సింహమూర్తి హత్య కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కేసు దర్యాప్తునకు డీసీపీ త్రివిక్రమవర్మ పలువురు పోలీసుల్ని రంగంలోకి దించి హత్యకు గల కారణాలను లోతుగా అధ్యయనం చేయించడంతో నర్సింహమూర్తికి సంబంధించిన పలు విషయాలు తెలిశాయి.
మూడో పట్టణ పిఎస్లో సస్పెక్ట్ షీటు, రెండో పట్టణ పిఎస్లో రౌడీ షీటు కూడా ఉండడంతో పాటు ఆరు దొంగతనం కేసులు, రెండు హత్యల్లో అతను నిందితుడిగా ఉన్నారు. అనిత్ అనే వ్యక్తి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న పొడుగు కిరణ్కు ఇతను అత్యంత సన్నిహితుడు. అంతేకాదు అనిల్ హత్య కేసులో ఎ8 నిందితుడిగా ఉన్నాడ
2006లో జరిగిన ఎన్.రాజు అనే వ్యక్తి కేసులో ఎ2గా కొనసాగుతున్నాడు. ఇటీవల కాలంలో మద్యం మత్తులో పలువురిపై దౌర్జన్యాలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కొద్దిరోజుల కిందట అతను మద్యం మత్తులో సంతోష్ అనే వ్యక్తితో గొడవపడి హత్యే చేస్తానని బెదిరించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
దీంతోపాటు ఒకసారి అతన్ని నర్సింహమూర్తి వెంటాడినట్లు కూడా కొందరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలో నర్సింహమూర్తిని ఎలాగైనా అంతమొందించాలని నిర్ణయించుకున్నట్లు భావిస్తున్నారు. మద్యం అలవాటుండడంతో జిల్లా పరిషత్ వద్దకు మద్యం తాగడానికి నర్సింహమూర్తికి తెలిసిన వ్యక్తితోనే కబురు పంపారు.
న్యాక్ భవనం సమీపంలో వారు కూర్చొని మద్యం తాగారు. తర్వాత సంతోష్ వర్గం అక్కడికి వచ్చి నర్సింహమూర్తి కిరాతకంగా హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సంతోష్ గతంలో ఏమైనా నేరాలు చేశాడా? అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.