నిన్న ఢిల్లీ..నేడు ఒడిశా: ఏపీ సీఎంకు ప్రశంసలు: దిశ బిల్లు యదాతధంగా అమలు చేస్తాం..!
ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించిన ప్రతిష్ఠాత్మక దిశ బిల్లు -2019 పైన ప్రశంసలు అందుతున్నాయి. ఇప్పటికే పలువురు సినీ ..రాజకీయ ప్రముఖులు సైతం ప్రశంసించారు. సభలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ సైతం బిల్లుకు మద్దతు ప్రకటించింది. ఇక, ఇదే అంశం పైన ఢిల్లీ ప్రభుత్వం స్పందించగా..తాజాగా..ఒడిశా ప్రభుత్వం ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈ బిల్లును ప్రతిపాదించటం..ఆమోదించటం పైన ఏపీ ప్రభుత్వాన్ని ప్రశంసిస్తూ ఈ లేఖ రాసింది. దీనిని సభలో స్పీకర్ తమ్మినేని సీతారాం చదివి వినిపించారు. బిల్లును ఆమోదించినందుకు సభలోని ప్రతీ సభ్యుడిని అభినందిస్తూ..బిల్లు కాపీ..పూర్తి వివరాలు తమకు ఇవ్వాలని కోరుతూ ఏపీ అసెంబ్లీ స్పీకర్ కు రాసిన లేఖలో అభ్యర్ధించింది.
నిన్న ఢిల్లీ..నేడు ఒడిశా..
ఏపీ ప్రభుత్వ ఈ నెల 11న కేబినెట్ లో ప్రతిపాదించిన దిశ చట్టం - 2019 బిల్లును.. ఈ నెల 13న శాసనసభలో ఏకగ్రీవంగా ఆమోదించింది. దీని పైన ఇప్పటికే పలువురు ప్రముఖులు ఏపీ ప్రభుత్వాన్ని అభినందించారు. రెండు రోజుల క్రితం ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఏపీ ముఖ్యమంత్రికి లేఖ రాయగా..తాజాగా..ఒడిశా ప్రభుత్వం లేఖ రాసింది. ఏపీ ప్రభుత్వం ఆమోదించిన దిశ బిల్లు పైన ఢిల్లీ ప్రభుత్వం ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను ప్రశంసించింది.

తాజాగా అదే తరహాలో ఒడిశా నుండి అభినందనలు అందాయి. బిల్లు కాపీనీ ..పూర్తి వివరాలతో తమకూ పంపాలని ఢిల్లీ తరహాలో ఒడిశా ప్రభుత్వం కోరింది. ముఖ్య మంత్రితో పాటుగా బిల్లు ఆమోదించిన ప్రతీ సభ్యుడికి అభినందనలు తెలుపుతూ శాసనసభా స్పీకర్ కు లేఖ రాసారు. ఈ విషయాన్ని సభలో స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. వారి అభ్యర్ధన మేరకు ప్రభుత్వం ఆమోదించిన దిశ బిల్లు కాపీ..శిక్ష అమలు తీరు అంశాలను వివరిస్తూ ఏపీ ప్రభుత్వంలోని హోం శాఖ నుండి ఢిల్లీ తో పాటుగా ఒడిశా ప్రభుత్వాలకు సమాచారం పంపాలని నిర్ణయించారు.
మండలి ఆమోదం..గవర్నర్ వద్దకు
ఏపీ కేబినెట్..అసెంబ్లీ ఆమోదించిన దిశ చట్టం -2019 బిల్లులో ఒక భాగానికి రాష్ట్రపతి ఆమోదం తెలపాల్సి ఉంది. ఏపీలో ఎవరైనా మహిళపై అత్యాచారం చేస్తే..నిర్ధారించే ఆధారాలు ఉంటే వారికి 21 రోజుల్లోనే శిక్ష పడేలా ఏపీ ప్రభుత్వం కొత్తగా బిల్లును ఆమోదించింది. తొలి వారం రోజుల్లోనే పోలీసులు పూర్తి సమాచారం ..ఆధారాలు సేకరించాలి. అదే విధంగా రెండు వారాల్లోనే ఈ కేసుకు సంబంధించి విచారణ పూర్తి చేసి..శిక్ష విధించే విధంగా బిల్లులో ప్రతిపాదించారు. దీని కోసం మొత్తం 13 జిల్లాల్లోనూ ప్రత్యేకంగా పాస్ట్ ట్రాక్ కోర్టులు..పబ్లిక్ ప్రాసిక్యూటర్లతో పాటుగా డీఎస్పీ ర్యాంకు అధికారులతో ప్రత్యేక పోలీసు టీంలను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే ఈ బిల్లు అసెంబ్లీతో పాటుగా శాసన మండలిలోనూ ఆమోదం పొందింది. ప్రస్తుతం ఈ బిల్లు గవర్నర్ వద్దకు వెళ్లినట్లు సమాచారం. తాజాగా ఢిల్లీ..ఒడిశా ప్రభుత్వాలు ఈ బిల్లు ఆమోదించటాన్ని ప్రశంసిస్తూ..బిల్లు వివరాలను పంపాలని కోరటంతో..దీని పైన దేశ వ్యాప్తంగా మరింత చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications