pv sindhu : జగన్ ను కలిసిన సింధు-మీ ఆశీర్వాదమే- వైజాగ్ అకాడమీ ప్రారంభించాలని సూచన
టోక్యో ఒలింపిక్స్ లో కాంస్య పతాకంతో వరుసగా రెండు ఒలింపిక్స్ లో పతకాలు సాధించిన ఏకైక మహిళా క్రీడాకారిణిగా గుర్తింపు తెచ్చుకున్న షట్లర్ పీవీ సింధు ఇవాళ ఏపీ సీఎం వైఎస్ జగన్ తో సమావేశమయ్యారు. ఒలింపిక్స్ లో పతకం సాధించాక స్వదేశానికి తిరిగి వచ్చిన సింధు.. సచివాలయంలోని సీఎం ఛాంబర్ లో జగన్ ను కలిశారు.
ఇవాళ ఉదయం కేబినెట్ సమావేశానికి ముందు సచివాలయానికి వచ్చిన పీవీ సింధు.. సీఎం ఛాంబర్ లో జగన్ తో సమావేశమైంది. ముందుగా టోక్యో ఒలింపిక్స్ లో సాధించిన పతకాన్ని ఆమె సీఎం జగన్ కు చూపించింది. సంతోషం వ్యక్తం చేసిన సీఎం జగన్... సింధును సత్కరించారు. అనంతరం మీ ఆశీర్వాదం వల్లే ఒలింపిక్స్ లో పతకం నెగ్గినట్లు పీవీ సింధు సీఎం జగన్ కు తెలిపారు. దేవుడి దయతో మంచి ప్రతిభ చూపారంటూ సింధుపై సీఎం జగన్ ప్రశంసలు కురిపించారు.
ఒలింపిక్స్ లో సింధు పతక సాధనపై సంతోషం వ్యక్తం చేసిన సీఎం జగన్... రాష్ట్రంలో మరింత మంది సింధులు తయారు రావాలని ఆకాంక్షించారు. ఇందుకోసం వైజాగ్ లో వెంటనే బ్యాడ్మింటన్ అకాడమీ ప్రారంభించాలని సింధును సీఎం జగన్ కోరారు. ప్రభుత్వం తరపున సింధుకు రూ.30 లక్షల నగదు బహుమానాన్ని అధికారులు అందజేశారు. ఒలింపిక్స్ లో పతక సాధనకు ముందే ఏపీ ప్రభుత్వం సింధుకు వైజాగ్ లో బ్యాడ్మింటన్ అకాడమీ నిర్మాణం కోసం రెండెకరాల స్ధలం కేటాయించింది. ఒలింపిక్స్ కు వెళ్తున్న సింధుకు ఇది కూడా ప్రోత్సాహకంగా ఉంటుందని ప్రభుత్వం భావించింది. అనుకున్నట్లుగానే సింధు ఒలింపిక్స్ పతకంతో తిరిగి రావడంతో ప్రభుత్వ వర్గాల్లో సంతోషం వ్యక్తమవుతోంది.
మరోవైపు ప్రభుత్వం వెంటనే వైజాగ్ లో బ్యాడ్మింటన్ అకాడమీ ప్రారంభించాలని కోరుతున్నా పీవీ సింధు మాత్రం మరికొన్నాళ్లు వేచి చూసే ఉద్దేశంలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బ్యాడ్మింటన్ లో కెరీర్ పీక్ లో ఉన్న సింధు.. ఇప్పుడు దాన్ని వదిలేసి అకాడమీపై దృష్టిసారిస్తే ఆటపై ప్రభావం వడుతుందని ఆమె తండ్రి, పద్మశ్రీ అవార్డు గ్రహీత పీవీ రమణ భావిస్తున్నారు. దీంతో ఆమెను ప్రస్తుతానికి ఆటపై దృష్టిపెట్టాలని సూచిస్తున్నారు. బ్యాడ్మింటన్ నుంచి రిటైరయ్యాక అకాడమీ దిశగా సింధు అడుగులు పడే అవకాశముంది.