మరోసారి మానవత్వం చాటుకున్న ఏపీ సీఎం వైఎస్ జగన్!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి తన పర్యటనలలో ఎంతో మంది చిన్నారులను ఆదుకుంటున్నారు. గత కొంతకాలం నుంచి ఆయన ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఎవరో ఒకరు ముఖ్యమంత్రి సహాయం చేస్తారని ఆశగా వస్తున్నారు. వారందరిని నిరాశ పరచకుండా జగన్మోహన్ రెడ్డి వారి సమస్యను తెలుసుకుని వారికి కావలసిన సహాయాన్ని, భరోసాను అందించి పంపుతున్నారు.
ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న బాలుడికి వైద్య సహాయం చేయడానికి పెద్ద మనసు చేసుకున్నారు. మంగళవారం విశాఖ జిల్లాలో ఆంధ్ర యూనివర్సిటీకి చేరుకున్న ముఖ్యమంత్రి ప్రారంభోత్సవ కార్యక్రమం అనంతరం అక్కడ అనారోగ్యంతో బాధపడుతూ ముఖ్యమంత్రిని కలవడానికి వేచి ఉన్న పెద్ద వాల్తేరుకు చెందిన 11 సంవత్సరాల కె రమేష్ ని పలకరించారు.

అతని తల్లి తన కుమారుని పరిస్థితిని జగన్మోహన్ రెడ్డికి వివరించారు. తన కుమారుడు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడని, వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయం చేయాలని తల్లి కోరింది. దీంతో స్పందించిన ముఖ్యమంత్రి వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయం చేయవలసిందిగా జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. రమేష్ వైద్య ఖర్చుల నిమిత్తం లక్ష రూపాయల చెక్కును అందించారు జిల్లా కలెక్టర్.
విశాఖ జిల్లా పర్యటనలో భాగంగా ఇనార్బిట్ మాల్ కు చేరుకున్న ముఖ్యమంత్రి అక్కడ కూడా తన ఉదారతను చూపించారు. ఆర్థోపెడిక్ సమస్యతో బాధపడుతూ అక్కడికి వచ్చిన 9 సంవత్సరాల వయసున్న గవిడి ఢిల్లీశ్వరరావును ముఖ్యమంత్రి పరామర్శించారు. కంచరపాలెం బాపూజీ నగర్ కు చెందిన ఢిల్లీశ్వరరావు తల్లి గవిడి సంతోషి తన కుమారుడు పుట్టుకతో ఆర్థోపెడిక్ సమస్యతో బాధపడుతున్నాడని ముఖ్యమంత్రికి తెలిపారు.
వారి సమస్యను విన్న ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గవిడి ఢిల్లీ శ్వరరావు కి వైద్య సేవలు అందించడానికి కావలసిన ఆర్థిక సహాయాన్ని చేయాలని జిల్లా కలెక్టర్ ఏ. మల్లికార్జున ను ఆదేశించారు. దీంతో జిల్లా కలెక్టర్ వైద్య సేవల నిమిత్తం ఆ బాలుడికి లక్ష రూపాయల చెక్కును అందజేశారు.












Click it and Unblock the Notifications