లోకేశ్ - పవన్ రాజీ ఫార్ములా : యాత్రల వేళ - ఒకరి కోసం మరొకరు..!!
పవన్ వారాహి యాత్రకు మద్దతుగా లోకేష్ వ్యాఖ్యలు చేయటం రాజకీయంగా కొత్త చర్చకు కారణమైంది.
ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. టీడీపీ -వైసీపీ పొత్తు ముందు ఇప్పుడు యాత్రల సీజన్ కొనసాగుతోంది. ఎలాగైనా వైసీపీని ఓడించి అధికారంలోకి రావాలనేది ఇప్పుడు టీడీపీ - జనసేన లక్ష్యంగా స్పష్టం అవుతోంది. ఇప్పటికే లోకేష్ రాష్ట్ర వ్యాప్త పాదయాత్ర కుప్పం నుంచి ప్రారంభం అయింది. త్వరలో వారాహి తో రాష్ట్ర వ్యాప్త యాత్రకు పవన్ కల్యాణ్ సిద్దం అవుతున్నారు. ఇప్పటి వరకు జనసేన తో పొత్తు వ్యవహారం పై లోకేష్ ఎక్కడా స్పందించలేదు. చంద్రబాబు - పవన్ భేటీలు జరిగినా లోకేష్ జోక్యం ఎక్కడా కనిపించ లేదు. కానీ, ఆకస్మికంగా ఇప్పుడు పవన్ వారాహి యాత్రకు మద్దతుగా లోకేష్ వ్యాఖ్యలు చేయటం రాజకీయంగా చర్చకు కారణమైంది.

కుప్పం సభలో పవన్ గురించి లోకేష్..
కుప్పం సభలో ప్రసంగించిన లోకేష్ వైసీపీ ప్రభుత్వం పైన ఫైర్ అయ్యారు. తాను సైకోల పాలిట మూర్ఖుడినని..వడ్డీ చక్రవడ్డీలతో సహా చెల్లిస్తానని హెచ్చరించారు. 2024 ఎన్నికల్లో రా్ట్రానికి చంద్రబాబును సీఎం చేయాలని పార్టీ కార్యకర్తలను..ప్రజలను కోరారు. అదే సమయంలో జీవో నెంబర్ 1 గురించి ప్రస్తావించారు. పవన్ కల్యాణ్ కూడా బయట అడుగు పెట్టకూడదంటున్నారని ఫైర్ అయ్యారు. వారాహి వాహనానికి ఏపీలో అనుమతి ఇవ్వమంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. వారాహి ఆగదు..యువగళమూ ఆగదు అని లోకేష్ స్పష్టం చేసారు. తన యాత్రతో పాటుగా పవన్ వారాహి యాత్రకు మద్దతుగా లోకేష్ మాట్లాడటం ఇప్పుడు రాజకీయంగా చర్చకు కారణమైంది. ఇప్పటి వరకు ఇంత ఓపెన్ గా లోకేష్ ఏ కార్యక్రమంలోనూ పవన్ కు మద్దతుగా మాట్లాడ లేదు. చంద్రబాబు పలు సందర్భాల్లో పవన్ అంశాన్ని ప్రస్తావిస్తూ.. మద్దతుగా వ్యాక్యలు చేసారు.
టీడీపీతో విభేదించిన వేళ..లోకేష్ టార్గెట్ గా
2018లో టీడీపీతో విభేదించిన సమయంలో పవన్ కల్యాణ్ నాడు పార్టీ ఆవిర్భావ సభలో లోకేష్ పైన తీవ్ర ఆరోపణలు చేసారు. చెన్నైకు చెందిన ఒక ప్రముఖ వ్యాపారి పేరు ప్రస్తావించి లోకేష్ కు బినామీగా పేర్కొన్నారు. కానీ, లోకేష్ మాత్రం వాటికి కౌంటర్ ఇవ్వలేదు. పవన్ పైన ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. అదే సమయంలో ఎన్నికల తరువాత కూడా జనసేన - పవన్ కల్యాణ్ గురించి లోకేష్ ప్రస్తావన తీసుకురాలేదు. విజయవాడలో చంద్రబాబు నేరుగా పవన్ కల్యాణ్ బస చేసిన హోటల్ వద్దకు వెళ్లి మంతనాలు చేసారు. అప్పటి నుంచి టీడీపీ - జనసేన పొత్తు ఖాయమనే సంకేతాలు బలపడ్డాయి. తాజాగా.. హైదరాబాద్ లో పవన్ స్వయంగా చంద్రబాబు ఇంటికి వచ్చిన సమయంలోనూ సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. దీంతో పాటుగా వైసీపీ రెండు పార్టీల మధ్య పొత్తు ఖాయంటూ రెండు పార్టీల అధినేతలను టార్గెట్ చేస్తోంది. ఈ సమయంలో లోకేష్ పాదయాత్ర ప్రారంభమైంది.

లోకేష్ యాత్ర వేళ- పవన్ ఏం చేయబోతున్నారు..
లోకేష్ గురించి నాడు ఆరోపణలు చేసిన పవన్..ఆ తరువాత లోకేష్ ప్రస్తావన చేయలేదు. ఇప్పుడు పవన్ యాత్రకు లోకేష్ తన పాదయాత్ర వేళ మద్దతుగా మాట్లాడారు. తామిద్దరి యాత్రలు ప్రభుత్వం అపలేదని హెచ్చరించారు. లోకేష్ యాత్ర సాగుతున్న వేళ పవన్ వారాహి యాత్ర ఎప్పుడు మొదలవుతుందనే చర్చ ఆరంభమైంది. వారాహితో యాత్రకు సిద్దమని ప్రకటించిన పవన్.. ఎప్పటి నుంచి అనేది మాత్రం స్పష్టత ఇవ్వలేదు. ఇప్పుడు లోకేష్ తన వ్యాఖ్యల ద్వారా పవన్ కు మైత్రి సంకేతాలు పంపారు. పవన్ నుంచి అదే రకమైన స్పందన లోకేష్ వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఎన్నికలకు కలిసి పని చేయాల్సిన అవసరం కనిపిస్తున్న పరిస్థితుల్లో లోకేష్ వ్యూహాత్మకంగానే పవన్ కు మద్దతుగా ఈ వ్యాఖ్యలు చేసినట్లు కనిపిస్తోంది. మరి, పవన్ ఏ రకంగా స్పందిస్తారో చూడాలి.












Click it and Unblock the Notifications