వైసీపీలో మరో వికెట్ డౌన్! పావులు కదిపిన టీడీపీ, ‘సముచిత స్థానం’ గాలంతో...
వైసీపీ రాష్ట్ర కార్యదర్శి గుత్తుల వెంకటసాయి శ్రీనివాసరావు టీడీపీలోకి చేరేందుకు రంగం సిద్ధమైంది.
తూర్పుగోదావరి: వైసీపీ రాష్ట్ర కార్యదర్శి గుత్తుల వెంకటసాయి శ్రీనివాసరావు టీడీపీలోకి చేరేందుకు రంగం సిద్ధమైంది. ముమ్మిడివరం నియోజకవర్గంలో టీడీపీకి శెట్టిబలిజ సామాజికవర్గం నుంచి సరైన నాయకుడు లేకపోవడం, ఆ సామాజిక వర్గం ఓటు బ్యాంకును కూడగట్టేందుకు గుత్తుల సాయిని పార్టీలోకి చేర్చేందుకు టీడీపీ పావులు కదిపింది.
ఇప్పటికే ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు, ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు, హోంమంత్రి చినరాజప్ప సమక్షంలో మంతనాలు జరిపి పార్టీలో గుత్తుల సాయికి సముచిత స్థానం కల్పించి ఆయనను పార్టీలో చేర్చుకునేందుకు ఒప్పందం కుదిరినట్టు సమాచారం.

చంద్రబాబు సమక్షంలో టీడీపీలోకి...
అమరావతిలో ఈనెల 14వ తేదీన ఒంటిగంటకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమక్షంలో గుత్తుల వెంకటసాయి శ్రీనివాసరావు టీడీపీలో చేర్చేందుకు ముహూర్తం కూడా నిర్ణయించుకున్నారు. 12వ తేదీన వైసీపీకి ఆయన రాజీనామా చేయనున్నారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుంచి పలువురు బీసీ సామాజికవర్గం నాయకులు కూడా గుత్తుల సాయి వెంట టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది.
Recommended Video


14న ముహూర్తం...
ఈ నెల 14వ తేదీ ఉదయం 7 గంటలకు ముమ్మిడివరం నుంచి బీసీ సామాజికవర్గానికి చెందిన నాయకులు 8 బస్సులు, 60 కార్లలో భారీఎత్తున సాయి వెంట అమరావతి వెళ్లనున్నారు. గుత్తుల సాయి 1987లో గాడిలంక సర్పంచ్గా రాజకీయ ఆరంగ్రేటం చేశారు. 1989లో అసెంబ్లీ ఎన్నికల్లో బత్తెన సుబ్బారావు విజయానికి కృషి చేశారు. డీసీసీ సభ్యుడిగా రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషిస్తూ వచ్చారు. 1996లో మరోసారి గాడిలంక సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఇదీ ‘గుత్తుల' ప్రస్థానం...
2001లో టీడీపీ గాలికి ఎదురొడ్డి కాంగ్రెస్ పార్టీ తరపున ముమ్మిడివరం ఎంపీపీగా బాధ్యతలు నిర్వహించారు. 2006లో గన్నవరం జడ్పీటీసీగా కాంగ్రెస్ తరపున విజయం సాధించారు. 2009లో కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ ఆశించి భంగపడిన సాయి ముమ్మిడివరం నుంచి అసెంబ్లీకి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి పరాజయం పొందారు. రాజశేఖరరెడ్డి మరణానంతరం మాజీమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ ముఖ్యఅనుచరుడిగా జగన్మోహన రెడ్డి వెనక ఉంటూ 2014లో ముమ్మిడివరం అసెంబ్లీ నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి చవిచూశారు.

పితాని వర్సెస్ గుత్తుల...
2016 వరకు వైసీపీలో నియోజకవర్గ కో ఆర్డినేటర్గా పనిచేశారు. అయితే ఆ తర్వాత అదనపు కో ఆర్డినేటర్గా పితాని బాలకృష్ణను నియమించడంతో గుత్తుల సాయి, పితాని వర్గీయుల మధ్య మనస్పర్థలు తలెత్తాయి. పితాని బాలకృష్ణ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా దూసుకుపోవడం, సాయి వర్గీయులకు అంతగా ప్రాధాన్యమివ్వకపోవడంతో మనస్థాపానికి గురైన సాయి, అతడి అనుచర వర్గం తటస్థంగా ఉంటూ వచ్చారు.

‘సముచిత స్థానం' గాలమేసిన టీడీపీ...
గుత్తుల సాయి, అతని సామాజికవర్గాన్ని తమ పార్టీ వైపు మలుచుకునేందుకు టీడీపీ చేసిన ప్రయత్నాలు సఫలమయ్యాయి. ఇప్పటికే రెండు, మూడుసార్లు జిల్లా మంత్రుల సమక్షంలో సాయిని పార్టీలో చేర్చే విషయంపై చర్చించి భవిష్యత్లో పార్టీలో తగిన గుర్తింపు ఇచ్చేలా హామీను కూడా ఇచ్చినట్టు సమాచారం. రానున్న అసెంబ్లీ ఎన్నికనాటికి గుత్తుల సాయి సామాజికవర్గాన్ని టీడీపీవైపు మలుచుకుని పార్టీని నియోజకవర్గంలో మరింత బలిష్టం చేసే ప్రయత్నాలు వ్యూహరచనలో భాగమే ఇదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications