'బిల్డింగ్ టెంపరరీ కాదు', ఏంటిది... మంత్రులకు సచివాలయం షాక్
విజయవాడ: వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయం, ఏపీకి ప్రత్యేక హోదా అంశాలపై ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు బుధవారం నాడు స్పందించారు. వెలగపూడిలో నిర్మితమైన సచివాలయం మాత్రమే తాత్కాలికమని, భవనాలు కాదన్నారు.
భవనాలు శాశ్వతమే అని చెప్పారు. పూర్తిస్థాయి సచివాలయం నిర్మితమయ్యాక వెలగపూడిలోని భవనాలను వేరేవాటికి ఉపయోగిస్తామని చెప్పారు. ఏపీ రాజధాని అమరావతిని నెంబర్ వన్గా తీర్చిదిద్దాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పం అన్నారు. గతంతో పోలిస్తే వృద్ధి రేటు రెండు శాతం పెరిగిందన్నారు. గత ఏడాదితో పోలీస్తే వ్యవసాయ రంగంలో 22 శాతం వృద్ధి సాధించామన్నారు.
వెలగపూడిలో ఉద్యోగుల కష్టాలు: చంద్రబాబు తొందపడ్డారా?
ఏపీకి ప్రత్యేక హోదా, ప్యాకేజీ రెండు కావాలన్నారు. చట్ట ప్రకారం రావాల్సినవి అన్నీ రావాలన్నారు. ఏపీకి కేంద్రం సహకరిస్తుందనే తాను భావిస్తున్నానని చెప్పారు. జిఎస్టీతో కలిగిన నష్టాన్ని భర్తీ చేస్తానని కేంద్రం హామీ ఇచ్చిందని చెప్పారు.
కొత్త సచివాలయం సరిపోవడం లేదు: మంత్రులు
ఏపీలో కొత్తగా నిర్మించిన సచివాలయంలో సౌకర్యాల కొరత ఉందని సాక్షాత్తు మంత్రులే ఆవేదన చెందుతున్నారు. కొత్త సచివాలయం వారికి విసుగు తెప్పిస్తోందని తెలుస్తోంది. మంత్రులు చినరాజప్ప, గంటా శ్రీనివాస రావు, పత్తిపాటి పుల్లారావులు తమ చాంబర్లకు కొబ్బరికాయ కొట్టకపోవడానికి అదే కారణమంటున్నారు.
అంతేకాదు, ఇరుకు గదులలో ఉండలేమని మంత్రులు ఖరాఖండిగా చెప్పారని తెలుస్తోంది. ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, గంటా, పత్తిపాటి, కొల్లు రవీంద్రలకు కేటాయించిన చాంబర్లలో కనీసం ఐదుగురు కూర్చునేందుకు కూడా స్థలం లేదని, అందుకే వాటిని రీమోడల్ చేయమని సూచించారు. మంత్రి నారాయణ కూడా.. గదులు చిన్నగా ఉన్నది నిజమేనని, పెద్దగా సమకూర్చేందుకు మరికొంత సమయం పడుతుందని మంత్రులకు చెప్పినట్లుగా తెలుస్తోంది.