ఎన్నికల వేళ సీఎం జగన్ మరో విజయం - టీడీపీకి చెక్, ఇదీ లెక్క..!!
ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల వేళ వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు. సంక్షేమంతో పాటుగా అభివృద్ది దిశగా అడుగులు వేస్తున్నారు. అభివృద్ది తమకే సాధ్యం అంటూ ప్రచారం చేసుకుంటున్న టీడీపీకి వరుసగా నిర్ణయాలతో చెక్ పెడుతున్నారు. విభజనతో నష్టపోయిన ఏపీకి చంద్రబాబు హయాంలో పూర్తిస్థాయిలో అభివృద్ది జరగలేదు. సీఎంగా జగన్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి సంక్షేమం తన ప్రధాన అజెండాగా ముందుకు తీసుకెళ్లారు. ప్రతిపక్షాలు రాష్ట్రంలో అభివృద్ది లేదని.. పారిశ్రామిక రంగం కుంటుపడిందని అనేక విమర్శలు గుప్పించాయి. కానీ, ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. గణాంకాలతో సహా ఏపీలో ఏ రకంగా పారిశ్రామిక రంగం ఏ విధంగా అభివృద్ది చెందుతోంది స్పష్టం అవుతోంది.
ఏపీ నెంబర్ వన్:ఏపీలో పెట్టుబడుల కోసం సీఎం జగన్ అమలు చేస్తున్న ప్రణాళికలు సత్ఫలితాలిస్తున్నాయి. పారిశ్రామిక వేత్తలను ఆకర్షించడంలో తాను ఏంటో సీఎం జగన్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్ ద్వారా రుజువు చేసారు. పారిశ్రామిక పాలసీలను సులభతరం చేస్తూ, పారిశ్రామిక చట్టాలను పారిశ్రామిక అభివృధికి అనుగుణంగా మారుస్తూ పారిశ్రామిక రంగాన్ని అభివృధి బాటలో పరుగులు పెట్టిస్తున్నారు.

అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలోనే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఆంధ్రప్రదేశ్ వరుసగా మూడుసార్లు తొలి స్థానంలో నిలిచింది. కేంద్ర ప్రభుత్వం టాప్ ఎచీవర్స్ పేరుతో ఏడు రాష్ట్రాలను ప్రకటించగా.. అందులో ఆంధ్రప్రదేశ్ 100కి 97.89 శాతం స్కోర్ సాధించి మొదటి స్థానంలో నిలిచింది. సీఎం జగన్ దావోస్ పర్యటన సందర్భంగా రూ.1.25 లక్షల కోట్ల పెట్టుబడులపై అదానీ, గ్రీన్కో, అరబిందోలతో ఆంధ్రప్రదేశ్ ఒప్పందం కుదుర్చుకుంది.
విశాఖ సమ్మిట్తో .. :విశాఖలో జరిగిన జీఐఎస్ సదస్సులో ఏపీ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా రూ. 13.5 లక్షల కోట్ల ఎంవోయూలను ఏపీ ప్రభుత్వం కుదుర్చుకుంది. ఇటీవల ముఖ్యమంత్రి జగన్ విశాఖ సదస్సు ఒప్పందాలపై సమీక్ష నిర్వహించారు. పరిశ్రమలు, వాణిజ్య శాఖకు సంబంధించి 100 ఒప్పందాలు చేసుకోగా ఇప్పటికే రూ.2,739 కోట్ల విలువైన 13 ఒప్పందాలు వాస్తవ రూపం దాల్చాయి.
వీటి ద్వారా దాదాపు 6,858 మందికి ఉద్యోగ ఉపాధి లభించనుంది. జీఐఎస్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు కొచ్చిన కంపెనీల్లో 38 కంపెనీలు జనవరి 2024లోపు పనిని ప్రారంభించాలని, అదనంగా మరో 30 కంపెనీలు ఫిబ్రవరి 2024 నాటికి కార్యకలాపాలు ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నాయి. వీటన్నింటి వెనుక రాష్ట్ర ప్రభుత్వం వారికి ఎన్నో రకాలుగా అండగా ఉంటూ.. వారికి కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పిస్తోంది.
ప్రభుత్వ చర్యలతో..:పెద్దఎత్తున పెట్టుబడులను రప్పించేందుకు సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసకుంటున్నారు.ప్రపంచ బ్యాంక్, భారత ప్రభుత్వం రూపొందించిన వ్యాపార సంస్కరణల కార్యాచరణ ప్రణాళిక ప్లాన్ ను పకడ్బందీగా అమలు చేయడం ఏపీ అన్ని రాష్ట్రాలకంటే ముందు వరుసలో ఉంది. సింగల్ విండో సిస్టమ్ తీసుకురావడం వల్ల ఆయా కంపెనీలు అనుమతులు పొందే ప్రక్రియ సులభతరం అయింది. లైసెన్స్లు తీసుకోవడం, వ్యాపారాలను స్థాపించడానికి సమయం, వ్యయం కూడా భాగా తగ్గాయి.

"YSR AP One" వంటి టెక్నికల్ పోర్టల్తో, వెబ్సైట్ లతో 21 రోజులలోనే పరిశ్రమలకు అనుమతులు ఇవ్వడంతోపాటు, మూడు వారాల్లోనే పరిశ్రమలకు భూములు కూడా కేటాయిస్తున్నారు. అనవసరమైన చట్టాలను రద్దు చేయడంతో ఏపీలో పెట్టుబడులకు మార్గం సుగమం అయింది. సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత, పారిశ్రామిక సేవలపై స్పాట్ అప్రూవల్ అందించడానికి ప్రభుత్వం కార్మిక చట్టాల ప్రకారం 5 చట్టాలను రీ-ఇంజనీరింగ్ చేసింది.
నిరుపయోగ చట్టాల రద్దు:ప్రభుత్వం రెవిన్యూ, జలవనరుల శాఖల పరిధిలో ఉండే.. 26 వాడుకలో లేని..నిరుపయోగమైన చట్టాలను కూడా రద్దు చేయడం విశేషం. సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత, మొదటి రెండు సంవత్సరాలలో 488 సంస్కరణలను చేపట్టారు. ఫలితంగా వ్యాపార నిర్వహణ సౌలభ్యం మెరుగుపడింది.
భూ వినియోగానికి అనుమతి, నిర్మాణ అనుమతులు, వివిధ లైసెన్సులు , అనుమతులు, కార్మిక చట్ట నిబంధనలు, సమ్మతి వ్యయాలను తగ్గించడానికి సరళీకృత పన్ను విధానం, భూమి రికార్డుల డిజిటలైజేషన్ మొదలైన ప్రక్రియలను సంస్కరణలతో క్రమబద్ధీకరించారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లోని 18 సేవలకు సర్వీస్ డెలివరీ సమయాన్ని సగానికి తగ్గించారు. త్వరితగతిన వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించడానికి మౌలిక సదుపాయాలు, ఇతర సౌకర్యాలను సులభంగా యాక్సెస్ చేయడం వంటి రెడీ-బిల్ట్ ఫెసిలిటీస్ (RBF) అందించడం ద్వారా సంస్థలకు సహాయం చేస్తోంది.
పెట్టుబడుల ఆకర్షణ:పరిశ్రమల స్థాపనకు అయ్యే ముందస్తు ఖర్చును తగ్గించేందుకు ప్రభుత్వ ప్రయత్నాలు దోహదపడుతున్నాయి. పారిశ్రామిక భూముల కేటాయింపు కోసం లీజు-కమ్-బై మోడల్ను తీసుకురావడం ద్వారా మూలధన వ్యయాలను తగ్గించాలని వైఎస్సార్సీపీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
అలాగే, YSR ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్లోని పరిశ్రమల కోసం ప్రభుత్వం యూనిట్కు రూ.4.50 చొప్పున విద్యుత్ సరఫరాను ప్రారంభించింది. 2021లో వివిధ రాష్ట్రాల ఇండెక్స్లో ఏపీ అగ్రస్థానంలో ఉన్న లాజిస్టిక్స్ సౌలభ్యం, మెరుగైన వ్యాపార వాతావరణం, తగ్గిన లాజిస్టిక్స్ ఖర్చుల వల్ల ఉద్యోగాల కల్పన కూడా పెరిగే అవకాశం ఏర్పడింది. ఇలాంటి చర్యలు ప్రభుత్వం తీసుకోవడం వల్ల మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక రంగంలో మరిన్ని పెట్టుబడులను రాష్ట్రం ఆకర్షించగలుగుతోంది.

ప్రతిపక్షాలక్ చెక్:ముఖ్యమంత్రి జగన్ తన సంక్షేమం - అభివృద్ది నిర్ణయాలతో ప్రతిపక్షాలకు చెక్ పెడుతున్నారు. జీఐఎస్ సమ్మిట్లో జరిగిన ఒప్పందాలు కాకుండా.. సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత 28 సెజ్లు, 293 పారిశ్రామిక పార్కులు, 31 ఎంఎస్ఎంఈ క్లస్టర్లు, మూడు పారిశ్రామిక కారిడార్లు, నాలుగు పోర్టులు నిర్మాణ దశలో ఉన్నాయి.
అంతే కాకుండా ప్రపంచంలోనే తొలిసారిగా గ్రీన్ ఎనర్జీపై రూ.4500 కోట్లతో ఏపీలో పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రసిద్ధ కంపెనీ ఆర్సిలర్ మిట్టల్ ప్రకటించడం గమనార్హం. కరోనా మహమ్మారి వంటి భయంకర విపత్తులు రాష్ట్రంలో ప్రబలి.. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా.. సీఎం జగన్ మాత్రం మొక్కవోని దీక్షతో నాడు సంక్షేమ పథకాలపై దృష్టి, నేడు పారిశ్రామిక రంగం, అభివృద్దిపై దృష్టి సారించి.. రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు.












Click it and Unblock the Notifications