ఎన్నికల వేళ సీఎం జగన్ మరో అస్త్రం - టార్గెట్ ఫిక్స్..!!
ముఖ్యమంత్రి జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తన పాలన నచ్చి..మంచి జరిగిందని నమ్మితే ఆయనకు అండగా నిలవాలని జగన్ కోరుతున్నారు. ఇందులో భాగంగా ప్రజలతో కనెక్ట్ అయ్యే కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పటికే మెగా పల్స్ సర్వే ద్వారా కోటీ 16 లక్షల కుటుంబాల మద్దతు పొందిన ముఖ్యమంత్రి ఎన్నికల దిశగా మరిన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా ప్రజా సమస్య ల పరిష్కారం కోసం సీఎం నేరుగా ప్రజలతో కనెక్ట్ కానున్నారు.
ముఖ్యమంత్రి నేరుగా ప్రజలతో : సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయని ముఖ్యమంత్రి జగన్ నమ్మకంతో ఉన్నారు. హామీ ఇచ్చిన పథకాలతో పాటుగా కొత్తవి కూడా అమలు చేస్తుండటంతో లబ్దిదారులు ప్రభుత్వం పైన సానుకూలంగా ఉన్నట్లు తాజాగా నిర్వహించిన మెగా పల్స్ సర్వేలో స్పష్టం అయింది. మొత్తంగా కోటి 45 లక్షల కుటుంబాలను సర్వే చేస్తే కోటి 16 లక్షల కుటుంబాలు జగన్ కు మద్దతు ప్రకటించాయి.

దీంతో, ఇప్పుడు ప్రజా సమస్యల పరిష్కారం కోసం నేరుగా ముఖ్యమంత్రికి చెప్పుకొనే అవకాశం కల్పించాలని నిర్ణయించారు. వీటిని వెంటనే పరిష్కరించటం ద్వారా ముఖ్యమంత్రి - సామాన్యుల దూరం లేదనే సంకేతాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. జగనన్నకు చెప్పుకుంటే సమస్య పరిష్కారం అవుతుందనే భరోసా కల్పించేందుకు కొత్త కార్యక్రమం ఖరారు చేసారు.
జగనన్నకు చెబుదాం : ఇందు కోసం ఈ నెల 9వ తేదీ నుంచి జగనన్నకు చెబుదాం కార్యక్రమం ప్రారంభించాలని సీఎం జగన్ నిర్ణయించారు. ఇందుకోసం ప్రత్యేకంగా హెల్ప్ లైన్ ఏర్పాటు చేసారు. 1902 నెంబర్ ఖరారు చేసారు. ఇప్పటి వరకు సాధారణ ప్రజలకు స్పందన ద్వారా తమ సమస్యలను చెప్పుకొనే అవకాశం ఉంది. దీనిని స్థానిక అధికారులు పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పుడు నేరుగా ముఖ్యమంత్రి కే తమ సమస్యలు చెప్పుకొనేందుకు ఈ కొత్త కార్యక్రమం రూపకల్పన చేసారు.
వ్యక్తిగత సమస్యలను పరిష్కరించటం ద్వారా సీఎంఓ కూడా సామాన్యుల కోసమే ఉందనే అభిప్రాయం కలిగేలా ఈ వేదిక నిర్వహణ కు అధికారుల టీంను ఏర్పాటు చేసారు. హెల్ప్లైన్కు కాల్ చేసి గ్రీవెన్స్ రిజిస్టర్ చేస్తే.. దాని అత్యంత నాణ్యతతో పరిష్కరించాలని నిర్దేశించారు. నేరుగా సీఎంకు చెప్పుకుంటున్నామనే అభిప్రాయంతో ప్రజలు ముందుకొస్తున్న వేళ..అదే స్థాయిలో వారి సమస్యలు పరిష్కరించేలా అధికార యంత్రాంగం సిద్దం అవుతోంది.

నేరుగా సీఎంఓ పర్యవేక్షణ : జగనన్నకు చెబుదాం ను నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయం పర్యవేక్షించనుంది. జిల్లా స్థాయిలో ఈ కార్యక్రమ నిర్వహణ కోసం రూ 3 కోట్ల చొప్పున నిధులు విడుదల చేసారు. ఈ గ్రీవెన్స్ పైన తాను స్వయంగా మానిటర్ చేస్తానని.. తన కార్యాలయ అధికారులు నిర్దేశిత సమయంలోగా వీటి పరిష్కారానికి చొరవ తీసుకుంటుందని చెప్పుకొచ్చారు. సీఎం కార్యాలయం నుంచి మండల కార్యాలయాల వరకూ ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్లు ఉంటాయి.
ప్రతి జిల్లాకు సీనియర్ ఐఏఎస్ అధికారులుప్రత్యేకాధికారులుగా ఉంటారు. సామాన్యుల సమస్యలు ఈ వేదిక ద్వారా పరిష్కారం చేయటంతో ప్రభుత్వానికి..వ్యక్తిగతం సీఎంకు మరింత ఇమేజ్ పెరగనుంది. దీంతో, ప్రజా సమస్యల పరిష్కారం..వారి కోసమే తాను ఉన్నాననే భరోసా ఇచ్చేందుకు సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల వేళ ఈ కార్యక్రమం మరింతగా ప్రజలకు దగ్గర చేస్తుందని అంచనా వేస్తున్నారు.












Click it and Unblock the Notifications