"ఆ 23" మంది ఖాతాలో ఈ నలుగురు -హిస్టరీ రిపీట్ అవుతుందా..!?
23. 2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచిన సమయం నుంచి చర్చకు వస్తున్న నెంబర్. వైసీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో టీడీపీ 23 మంది ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకొచ్చింది. 2019 ఎన్నికల్లో టీడీపీ 23 స్థానాలు గెలిచింది. ఈ నెల 23న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. అదే రోజున వైసీపీ ఎమ్మెల్యేల క్రాస్ ఓటింగ్ తో టీడీపీ అభ్యర్ధి 23 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. దీంతో..టీడీపీ 23 నెంబర్ ఇప్పుడు దేవుడి స్క్రిప్టుగా సెటైర్లు మొదలు పెట్టింది. ఇదే సమయంలో నలుగురిని వైసీపీ సస్పెండ్ చేసింది. వారి రాజకీయ భవిష్యత్ పైన వైసీపీ నేతలు జోస్యం చెప్పటం మొదలు పెట్టారు. అక్కడా 23 అంకెతో లింకు ఉంది.
నలుగురు అటు-ఇటు..
వైసీపీ 2019 ఎన్నికల్లో 151 సీట్లతో అధికారం దక్కించుకుంది. ఆ తరువాతి కాలంలో టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేల్లో నలుగురు..జనసేన నుంచి ఒకరు వైసీపీకి దగ్గరయ్యారు. కానీ, నాడు టీడీపీ హయాంలో జరిగిన విధంగా పార్టీ కండువా కప్పుకోలేదు. పదవులు ఇవ్వలేదు. ఇదే సమయంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చాయి. అప్పటికే వైసీపీ నాయకత్వంతో విభేదించిన ఇద్దరు తమ ఆత్మప్రభోదానుసారం ఓటు వేస్తామని చెబుతూ వచ్చారు. ఇక..ఎన్నికలు జరిగాయి. వైసీపీ నుంచి నలుగురు క్రాస్ ఓటింగ్ చేసారు. టీడీపీ అభ్యర్ధి గెలిచారు. వైసీపీ నుంచి ఆరుగురు గెలిచి..ఒకరు ఓడిపోయారు. దీంతో, నలుగురు క్రాస్ ఓటింగ్ చేసారంటూ ఆ ఎమ్మెల్యేలను వైసీపీ సస్పెండ్ చేసింది. కానీ, ఆ ఎమ్మెల్యేలు మాత్రం క్రాస్ ఓటింగ్ చేసామని ఎలా చెబుతారంటూ ఇప్పటికీ ప్రశ్నిస్తున్నారు.

ఆ నలుగురికి సీట్లు దక్కేనా..
ఈ నలుగురికి టీడీపీ అధినేత ప్రలోభాలకు గురి చేసారని వైసీపీ నేతలు చెబుతున్నారు. కోట్లాది రూపాయాలు ఆఫర్ ఇచ్చారనేది వైసీపీ నేతల వాదన. దీనికి ఆనం, శ్రీదేవి ఖండించారు. వచ్చే ఎన్నికల్లో సీట్లు ఇస్తామనే ఆఫర్ కూడా వీరికి వచ్చిందని వైసీపీ చెబుతోంది. ఇప్పటికే ఆనం- కోటంరెడ్డి నియోజకవర్గాల్లో కొత్త ఇంఛార్జ్ లను నియమించిన వైసీపీ..ఇప్పుడు మేకపాటి - శ్రీదేవి నియోజకవర్గాల్లోనూ బాధ్యతలను కేటాయిస్తోంది. తాడికొండ - ఉదయగిరిలో ఇప్పటికే సమన్వయకర్తలు ఉన్నారు. అయితే, వచ్చే ఎన్నికల్లో ఇందులో ఇద్దరికి టీడీపీ నుంచి సీటు ఖాయమని చెబుతున్నారు. మరో ఇద్దరి గురించి మాత్రం పార్టీలో భిన్నమైన చర్చ వినిపిస్తోంది. టీడీపీ నుంచి ఆ రెండు నియోజకవర్గాల్లో ఆశావాహుల సంఖ్య ఎక్కువగా ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా వారి పైన వ్యతిరేక కారణంగానే వైసీపీలో పక్కన పెట్టారని చెబుతున్న సమయంలో..టీడీపీ తమ పార్టీ నుంచి సీట్లు ఇచ్చేందుకు సిద్దపడుతుందా అనేది మరో చర్చకు కారణమవుతోంది.
23 మందిని గుర్తు చేస్తున్న వైసీపీ
ఇదే సమయంలో మంత్రి రోజా లాంటి వారు గతంలో పార్టీ నుంచి ఫిరాయించిన 23 మంది అంశాన్ని తెర మీదకు తీసుకొస్తున్నారు. ఆ 23 మందిలో పలువురికి 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి సీట్లు దక్కలేదు. దక్కిన వారిలో ఒకరు (గొట్టిపాటి రవి) మినహా ఎవరూ గెలవలేదు. ఇప్పుడు వైసీపీ నుంచి క్రాస్ ఓటింగ్ చేసిన నలుగురి విషయంలో హిస్టరీ అదే రిపీట్ అవుతుందని వ్యాఖ్యానిస్తున్నారు. టీడీపీ నేతలకే ఈ సారి పూర్తి స్థాయిలో సీట్లు దక్కవనేది వైసీపీ నేతల విశ్లేషణ. జనసేనతో పాటుగా కలిసి వస్తే బీజేపీ లేకుంటే వామపక్షాలతో వెళ్లాలనేది చంద్రబాబు ఆలోచనగా అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో వైసీపీ నుంచి క్రాస్ ఓటింగ్ చేసి టీడీపీ టికెట్ ఆశిస్తున్న వారికి సీటు కష్టమని..ఇచ్చినా గెలుపు అసాధ్యమని చెబుతున్నారు. దీంతో..ఈ నలుగురి కేంద్రంగా రానున్న రోజుల్లో ఎటువంటి రాజకీయం చోటు చేసుకుంటుందో చూడాలి.












Click it and Unblock the Notifications