వై నాట్ 175- 30 ఏళ్లు అధికారం : సీఎం జగన్ విన్నింగ్ ఫార్ములా - ధైర్యం ఇదే..!!
CM Jagan: ముఖ్యమంత్రి జగన్ వచ్చే ఎన్నికలకు సిద్దం అవుతున్నారు. 2019 ఎన్నికల్లో గెలిచిన నాటి నుంచే టార్గెట్ 2024 లక్ష్యంతో అడుగులు వేస్తున్నారు. ఎక్కడా ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకూడదనేది జగన్ లక్ష్యం. అందు కోసం స్థానిక సంస్థల ఎన్నికలు - ఉప ఎన్నికల్లోనూ ఎక్కడా ఉదాసీనంగా వ్యవహరించలేదు. వై నాట్ 175 - 30 ఏళ్ల అధికారం ధీమా వెనుక జగన్ లెక్క పక్కాగా ఉంది. అందు కోసం ఇప్పటికే విన్నింగ్ ఫార్ములా అమలు చేయటం ప్రారంభించారు. ప్రతిపక్షాలన్నీ కలిసి వచ్చినా గెలుస్తాననే జగన్ ధైర్యం వెనుక పక్కా ప్రణాళిక ఉంది. అది సక్సెస్ అవుతుందనే నమ్మకం కనిపిస్తోంది.

2024 లో గెలిస్తే 30 ఏళ్లు తిరుగులేదంటూ..
ముఖ్యమంత్రి జగన్ 2024 ఎన్నికలే చంద్రబాబుకు చివరివిగా పేర్కొంటున్నారు. చంద్రబాబు సైతం కర్నూలు జిల్లాలో పర్యటన సమయంలో ఇదే అంశాన్ని వెల్లడించారు. ఈ సారి ఎన్నికల్లో తిరిగి గెలిస్తే ఇక ఏపీలో 30 ఏళ్ల పాటు వైసీపీకి ఎదురు ఉండదనేది సీఎం జగన్ లెక్క. అందులో భాగంగా ఈ సారి టీడీపీతో ఏ పార్టీ పొత్తు పెట్టుకున్నా అవకాశం ఇవ్వకూడదనేది జగన్ పట్టుదల. అందులో భాగంగా ఇప్పటికే పార్టీ పరంగా మార్పులు చేర్పులు ప్రారంభించారు. ఎమ్మెల్యేలకు హెచ్చరికలు చేస్తున్నారు. రేటింగ్ పెరగకపోతే తాను అభ్యర్ధిని మార్చటం తప్పదని స్పష్టం చేస్తన్నారు. అందులో భాగంగా ఈ నెల 16న మంత్రులు - ఎమ్మెల్యేలతో కీలక సమావేశం ఏర్పాటు చేసారు. ఈ భేటీలో ఎమ్మెల్యేలకు సీట్ల విషయంలోనూ క్లారిటీ ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నారు. చంద్రబాబు ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు తిరిగి సీట్లు ఇస్తున్నట్లు ప్రకటించినా.. సీఎం జగన్ టీడీపీ సిట్టింగ్ సీట్లలో మాత్రమే అభ్యర్ధులను ఖరారు చేస్తున్నారు.

2024 ఎన్నికల నినాదం తో కొత్త గేమ్..
ముఖ్యమంత్రి జగన్ ప్రతిపక్ష నేత చంద్రబాబు పైన కొత్త అస్త్రం ఎక్కుపెట్టారు. జగన్ కాంగ్రెస్ వీడి సొంతంగా పార్టీని స్థాపించిన సమయంలో కడప ఎంపీగా పోటీ చేసారు. ఆ సమయంలో ఢిల్లీ అహంకారానికి - కడప పౌరుషానికి మధ్య జరుగుతున్న పోరుగా ఆ ఎన్నిక సమయంలో నినాదం తీసుకొచ్చారు. అది పూర్తి స్థాయిలో వర్కవుట్ అయింది. ఏకంగా దేశ చరిత్రలో నిలిచేలా 5 లక్షల 45 వేల మెజార్టీతో జగన్ కడప నుంచి రెండో సారి ఎంపీగా గెలిచారు. ఇక, ఇప్పుడు జరగబోయే ఎన్నికలు చంద్రబాబు పెత్తందార్లు.. తాను నమ్ముకున్న..తనను నమ్ముకున్న పేదల మధ్య యుద్దంగా పేర్కొన్నారు. సామాజిక సమీకరణాలు రాజకీయంగా గెలుపు ఓటమలును ప్రభావితం చేసే సామాజిక సమీకరణాల నడుమ ఈ నినాదం ప్రభావితం చేస్తుందనే విశ్లేషణలు మొదలయ్యాయి. 2019 ఎన్నికల సమయంలో అమలు చేసిన సోషల్ ఇంజనీరింగ్ ను కొనసాగిస్తూ..టీడీపీ తమ ఓట్ బ్యాంక్ గా చెప్పుకొనే వర్గాలను పూర్తిగా తన వైపు తిప్పుకున్నారు. తన వెనుక ఉన్నది నలుగురేనని.. నా బీసీలు ..నా ఎస్సీలు..నా ఎస్టీలే..నా మైనార్టీలు.. నా పేదలు అంటూ జగన్ ఆ వర్గాలను ఓన్ చేసుకొనే ప్రయత్నం కొనసాగిస్తున్నారు.

కోటిన్నార మంది సంక్షేమ లబ్దిదారులు.. ఓట్ బ్యాంకు
ముఖ్యమంత్రి జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల లబ్దిదారుల సంఖ్య అన్ని పథకాలతో కలిపితే దాదాపుగా కోటిన్నార మంది వరకు ఉన్నట్లు అంచనా. 87 శాతం మందికి సంక్షేమ పథకాలు అమలు అందుతున్నాయని స్వయంగా సీఎం జగన్ చెప్పుకొచ్చారు. ఇక వీరితో పార్టీకి ప్రత్యక్ష సంబంధాలు కొనసాగే విధంగా ఇప్పటికే ఉన్న వార్డు వాలంటీర్లుతో పాటుగా పార్టీ నుంచి కొత్తగా వారధులను నియమించాలని నిర్ణయించారు. అదే విధంగా బూత్ కమిటీల్లో అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. దీంతో పాటుగా డాదిన్నర ముందే రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలకు ఎన్నికల పరిశీలకుల నియామకం పూర్తి చేసారు. ప్రతీ 50 ఇళ్లు అటు సచివాలయ వాలంటీర్..ఇటు పార్టీ వాలంటీర్ కలిసి ప్రతీ ఇంటితోనూ అటాచ్ మెంట్ పెంచుకోవటం ద్వారా సైకలాజికల్ గా వారంతా వైసీపీకి మద్దతుదారులుగా కొనసాగే అవకాశం ఉందని వైసీపీ అంచనా వేస్తోంది. మరో వైపు చంద్రబాబు విశ్వసనీయతను దెబ్బ తీయటంలో జగన్ సక్సెస్ అయ్యారు. ఈ క్రమంలో ఈ సంక్షేమం కంటే ఇంకా ఎక్కువ చేస్తామని చెప్పినా.. నమ్మలేని పరిస్థితులు జగన్ క్రియేట్ చేస్తున్నారు. ఇవన్నీ తనకు ఖచ్చితంగా ప్రజల ఓట్లతో మరోసారి అధికారం తెచ్చిపెడుతుందనే ధీమాతో ముఖ్యమంత్రి ఉన్నట్లు కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications