రెండో వైపు వాదన: హైదరాబాదులో చంద్రబాబు ఇంటి నిర్మాణం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కొత్త నివాసానికి గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ అనుమతులు నిరాకరించడం చర్చనీయాంశంగా మారిందంటూ ఆంధ్రజ్యోతి దినపత్రిక బాబు ఇంటికి సోమేష్ గొళ్లెం అనే శీర్షిక కింద ఓ వార్తాకథనాన్ని ప్రచురించింది. జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ కేవలం స్వామి భక్తి చాటుకునేందుకే చంద్రబాబు ఇంటి నిర్మాణానికి అనుమతి నిరాకరించారని టీడీపీ వర్గాలు విమర్శిస్తున్నాయి. సాంకేతిక లోపాలు, నిబంధనల మేరకే ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని జీహెచ్ఎంసీ వర్గాలు చెబుతున్నాయి.
ఆంధ్రజ్యోతి దినపత్రిక వాదన ఈ రకంగా ఉంది - హైదరాబాదులోని జూబ్లీహిల్స్ కోఆపరేటీవ్ హౌస్ బిల్డింగ్ సొసైటీలో చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్లకు ప్లాట్లు (నంబర్ 1309, 1310) ఉన్నాయి. పాత ఇంటి స్థానంలో కొత్తగా ఇల్లు నిర్మించుకోవాలని చంద్రబాబు భావించారు. దీనికి అనుమతి ఇవ్వాలని గతనెల 18వ తేదీన జీహెచ్ఎంసీకి దరఖాస్తు చేసుకున్నారు.
మొత్తం 2073 చదరపు గజాల స్థలంలో గ్రౌండ్తో కూడి రెండంతస్తుల భవన నిర్మాణానికి అనుమతి కోరారు. జీ+2 వరకు నిర్మాణం 10 మీటర్ల లోపు ఉంటుంది. అయితే, మూడో ఫ్లోర్లో పూర్తిస్థాయిలో నిర్మాణం కాకుండా పాక్షికంగా శ్లాబ్, కిటికీలు ఏర్పాటు చేస్తామని ప్లాన్లో పొందుపర్చినట్లు సమాచారం. దీంతో మొత్తం భవనం ఎత్తు 13 మీటర్లకు పెరుగుతుంది. దానికితోడు, నిబంధనల ప్రకారం సెట్ బ్యాకులు కూడా నిర్దిష్ట స్థాయి కంటే ఎక్కువే వదిలారు. బిల్డింగ్ ప్లాన్ను పరిశీలించిన జీహెచ్ఎంసీ అధికారులు ఈనెల 16న చంద్రబాబు ఇంటి నిర్మాణానికి అనుమతి నిరాకరిస్తూ ఫైలు తిప్పి పంపించారు.
కావాలనే, కక్షపూరితంగానే చంద్రబాబు ఇంటి నిర్మాణానికి జీహెచ్ఎంసీ అనుమతి నిరాకరించిందని తెలుగుదేశం పార్టీ మీడియా కమిటీ చైర్మన్ ఎల్వీఎస్ఆర్కే ప్రసాద్ గురువారం ఒక ప్రకటనలో ఆరోపించారు. మే 25న అసిస్టెంట్ సిటీ ప్లానర్ సైట్ను పరిశీలించారని, ప్లాన్ కరెక్ట్గా ఉందో లేదో చూశారని, నిర్మాణాన్ని అప్రూవ్ చేశారని ఆయన వివరించారు.
అనంతరం డిప్యూటీ సిటీ ప్లానర్ కూడా అన్నీ పరిశీలించారని, చీఫ్ సిటీ ప్లానర్ సైట్ను పరిశీలించి ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదని, అయితే జీహెఎంసీ కావాలనే తిరస్కరించిందని ఆయన తెలిపారు.