ఒరాకిల్లో నల్గొండ విద్యార్థి బాబాకు రూ.79.18 లక్షల ఉద్యోగం
హైదరాబాద్/నల్గొండ: రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబంలో పుట్టిన నల్గొండ జిల్లా విద్యార్థి షేక్ నజీర్ బాబా ప్రముఖ సాఫ్టువేర్ సంస్థ ఒరాకిల్లో ఇంజినీర్గా ఏడాదికి రూ.79.18 లక్షల వేతనంతో ఎంపికయ్యాడు. నిరుపేద కుటుంబంలో దినసరి కూలీగా పని చేస్తూ తండ్రి నెలకు రూ.5వేలు సంపాదిస్తున్నాడు. తల్లి కుట్టు మిషన్ ఆసరాగా కొద్దిపాటి సంపాదన వస్తోంది.
వారి కుమారుడు పట్టుదలతో ఉన్నత విద్యనభ్యసించి ఒరాకిల్లో ఇంజనీర్గా లక్షల వేతనంతో ఎంపికై ప్రతిభకు పేదరికం అడ్డుకాదని నిరూపించాడు. అర్వపల్లి మండలం కోడూరు గ్రామానికి చెందిన నిరుపేద షేక్ జమాలుద్దీన్కు ముగ్గురు సంతానం. ఇద్దరు కుమార్తెలు ఉండగా కుమారుడు నజీర్ బాబా చదువుకోసం పదేళ్ల క్రితం స్వగ్రామం నుండి సూర్యాపేటకు వలస వచ్చాడు. జమాలుద్దీన్ స్థానిక గ్రానైట్ పరిశ్రమలో కూలీగా పని చేస్తూ నెలకు రూ.5వేలు సంపాదిస్తున్నాడు.
ఆయన భార్య రహీమాభేగం టైలరింగ్ పనిచేస్తూ కుటుంబానికి ఆసరాగా నిలుస్తుంది. వీరి కుమారుడైన నజీర్ బాబా చిన్నతనం నుండే చదువులో ప్రతిభ చూపుతున్నాడు. అతని ప్రతిభను గుర్తించిన నవోదయ పాఠశాల వారు 10వ తరగతి వరకు ఉచితంగా విద్యనందించారు. 10వ తరగతిలో 587మార్కులు సాధించి రాష్టస్థ్రాయిలో టాపర్గా నిలిచాడు.
ఆ తర్వాత నవోదయ పాఠశాల కరస్పాండెంట్ మారం లింగారెడ్డి సహకారంతో హైదరాబాద్లోని శ్రీ చైతన్య కళాశాలలో ఉచితంగా ఇంటర్ చదివి 969మార్కులు సాధించాడు. 2011లో ఐఐటి ప్రవేశ పరీక్షలో 239వ ర్యాంక్ సాధించి కాన్పూర్ ఐఐటిలో సీటు సాధించాడు.
అక్కడ కంప్యూటర్ సైన్స్ ఫైనలియర్ చదువుతుండగా ఒరాకిల్ సంస్థ నిర్వహించిన క్యాంపస్ ఇంటర్వ్యూలో రూ.79.18లక్షలు ఏడాదికి వేతనంగా అమెరికాలోని రెడ్ఉడ్ సిటీలో అప్లికేషన్స్ ఇంజనీర్గా ఎంపికయ్యాడు. కాగా, తమ కష్టానికి ప్రతిఫలం దక్కిందని తల్లిదండ్రులు చెబుతున్నారు. నజీర్ బాబా తల్లిదండ్రులు జమాలుద్దీన్, రహీమాభేగంల ఆనందానికి అవధులేకుండా ఉంది. తమ కష్టాలు తీరాయంటూ వారు కన్నీళ్ల పర్యంతమయ్యారు.