అసంతృప్తి నేతలకు పదవుల ఎర, ఎవరెవరికి బాబు ఏమేం ఇవ్వబోతున్నారంటే...
ఏపీ మంత్రి వర్గ విస్తరణ నేపథ్యంలో పెల్లుబుకిన అసంతృప్తిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదవుల ఆశ చూపి చల్లార్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.
అమరావతి: ఏపీ ప్రభుత్వం చేపట్టిన మంత్రి వర్గ విస్తరణ నేపథ్యంలో కొంతమంది నేతల నుంచి అసంతృప్తి తారాజువ్వలా ఎగసిన నేపథ్యంలో వారిని మచ్చిక చేసుకునే చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.
అసంతృప్తి నేతలకు పదవుల ఆశ చూపి వారిని బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా పది మంది వరకు టీడీపీ ఎమ్మల్యేలు 'మాకెందుకు ఇవ్వరు మంత్రి పదవులు..' అంటూ రచ్చ రచ్చ చేసిన సంగతి తెలిసిందే.

ఎగసిపడ్డ అసంతృప్తి...
టీడీపీలో సీనియర్ నేత అయిన గోర్లంట్ల బుచ్చయ్య చౌదరి లాంటి వాళ్లయితే ‘అసలు పార్టీ ఏమైపోతోంది?' అంటూ ఆందోళన వెలిబుచ్చారు. తీవ్ర అసంతృప్తికి గురైన కొంతమంది టీడీపీ నేతలు ఇటు ముఖ్యమంత్రికి, అటు స్పీకర్ కు తమ రాజీనామా లేఖలను పంపించారు.

కొత్త పార్టీ స్థాపనకూ సై...
మరికొందరు రెబల్స్ గా మారిపోయి ‘కొత్త పార్టీ పెట్టేస్తాం..' అని ప్రకటన చేసేంత వరకు వెళ్లిపోయారు. మరి దావానలంగా మారి దూసుకొస్తున్న అసంతృప్తిని చల్లార్చేందుకు, పరిస్థితిని చక్కదిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు?

చంద్రబాబు హెచ్చరిక...
ఇప్పటికే ఆయన పార్టీలోని అసంతృప్తి నేతలకు ఒక బహిరంగ హెచ్చరిక చేశారు. ‘గీత దాటితే వేటు తప్పదు.. జాగ్రత్త' అంటూ పత్రికా ప్రకటన ద్వారా ఆయా నేతలను కట్టడి చేసే ప్రయత్నం చేశారు. అయితే పైకి హెచ్చరికలు జారీ చేసినా, లోలోపల అసంతృప్తి నేతలను సంతృప్తి పరిచే చర్యలు కూడా చంద్రబాబు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.

బోండా ఉమకు బుజ్జగింపు...
మంత్రి వర్గ విస్తరణ నేపథ్యంలో తనకు మంత్రి పదవి దక్కలేదనే అలకతో బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేసిన వారిలో ఒకరైన బోండా ఉమను తన వద్దకు పిలిపించుకున్న చంద్రబాబు ఆయనతో మాట్లాడి బుజ్జగించగా.. అనంతరం బోండా ఉమ మీడియా ముందుకొచ్చి బాబుతో సమావేశం తరువాత తాను సమాధాన పడినట్లుగా ప్రకటించారు.

‘బొజ్జల‘కు సలహాదారు పదవి...
ఇక రాజీనామాను వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదంటూ మొండిపట్టు మీదున్న మరో సీనియర్ నేత బొజ్జల గోపాలకృష్ణారెడ్డిని కూడా కూల్ చేసే ప్రయత్నం చేశారట ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆయనకు క్యాబినెట్ ర్యాంకుతో సమానమైన సలహాదారు పదవిని కట్టబెడతానంటూ బుజ్జగించినట్లు సమాచారం. దీంతో బొజ్జల కూడా కాస్త చల్లబడినట్లు తెలుస్తోంది.

‘పల్లె’కు చీఫ్ విప్ పదవి...
ఇక మంత్రి వర్గ విస్తరణలో భాగంగా పదవి కోల్పోయిన మరో నేత పల్లె రఘునాథరెడ్డికి కూడా మరో పదవిని ఎరగా వేసినట్లు సమాచారం. మొన్నటి వరకు ప్రభుత్వ చీఫ్ విప్ పదవిలో కాలువ శ్రీనివాసులు ఉండేవారు. విస్తరణలో ఆయనకు మంత్రి పదవి దక్కడంతో ఆ పదవి కాస్తా ఖాళీ అయింది. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చీఫ్ విప్ పదవిని పల్లెకు ఇస్తానని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

చల్లారుతున్న అసంతృప్తి...
అలాగే మంత్రి పదవిపై ఎన్నో ఆశలు పెట్టుకుని అది దక్కక తీవ్ర అసంతృప్తికి గురైన పార్టీ ఫిరాయింపునకు పాల్పడబోయిన మరో నేతను కూడా చంద్రబాబు బుజ్జగించే ప్రయత్నం చేశారట. ఆయనకు కూడా ప్రభుత్వ విప్ పదవిని ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. మొత్తానికి టీడీపీలో తారాజువ్వలా ఎగసిపడిన అసంతృప్తిని ముఖ్యమంత్రి చంద్రబాబు తనదైన చాణక్యంతో చల్లార్చేందుకు శతధా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications