సిపిఎం: టీలో జగన్తో, సీమాంధ్రలో కిరణ్ రెడ్డితో
హైదరాబాద్: సిపిఎం ప్రాంతాలవారీగా ఎన్నికల సర్దుబాటుకు సిద్ధపడింది. తెలంగాణలోని రెండు లోకసభ స్థానాల పరిధిలో వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసుతో సీట్ల సర్దుబాటు చేసుకుంది. కాగా, సీమాంధ్రలో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నాయకత్వంలోని జై సమైక్యాంధ్ర పార్టీతో పొత్తుకు సిద్ధపడుతోంది.
ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో సిపిఎం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మధ్య స్థానికంగా అవగాహన కుదిరింది. ఈ రెండు నియోజకవర్గాల పరిధిలో కలిసి పనిచేయాలని ఇరు పార్టీలు అంగీకారానికి వచ్చాయి.
ఖమ్మం లోకసభ నియోజకవర్గం పరిధిలో 2 శాసనసభా స్థానాల్లో సిపిఎం, ఐదు స్థానాల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పోటీ చేస్తాయి. మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో మూడు స్థానాల్లో సిపిఎం, నాలుగు స్థానాల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పోటీ చేస్తాయని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత పొంగులేటి శ్రీనివాస రెడ్డి, సిపిఎం నేత సుదర్శన్ చెప్పారు.
కాగా, వైయస్సార్ కాంగ్రెసు పార్టీతో తమకు పొత్తు ఉండదని సిపిఎం ఆంధ్రప్రదేశ్ (సీమాంధ్ర) కార్యదర్శి మధు చెప్పారు. తాము కిరణ్ కుమార్ రెడ్డి నాయకత్వంలోని జై సమైక్యాంధ్రతో పొత్తు పెట్టుకునే విషయంపై ఆలోచన చేస్తున్నామని, ఆ పార్టీతో చర్చలు జరుపుతున్నామని ఆయన అన్నారు.