మంగళగిరిలో లోకేష్కు షాక్: చినబాబుకు ఓటేసేది లేదని తెగేసి చెప్పిన ప్రధాన సామాజిక వర్గం
మంగళగిరి: ఆంధ్రప్రదేశ్లో ఓ వైపు ఎండలు నిప్పుల కొలిమిని తలపిస్తుంటే మరోవైపు రాజకీయ వేడి క్రమంగా పెరుగుతోంది. దీంతో అక్కడ ఏ ముగ్గురు గుమికూడినా ఏ పార్టీ అధికారంలోకి వస్తుందా అనేదానిపైనే మాట్లాడుకోవటం కనిపిస్తోంది. ఇక ఈ సారి చాలామంది దృష్టి గుంటూరు జిల్లా మంగళగిరిపైనే పడింది. ఎందుకంటే ఇక్కడ పోటీ చేస్తోంది ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు నారాలోకేష్. లోకేష్ ప్రత్యర్థిగా బరిలో ఉన్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే రామకృష్ణా రెడ్డి. మరి ఈ నియోజకవర్గంలో ఓ ప్రధాన సామాజిక వర్గం మాత్రం లోకేష్కు ఎట్టి పరిస్థితుల్లో ఓటేసేది లేదంటూ బహిరంగంగానే చెబుతున్నారు..? ఇంతకీ ఆ సామాజిక వర్గం ఏమిటి.. వారికొచ్చిన కష్టం ఏమిటి..? సాక్షాత్తు సీఎం కుమారుడే బరిలో ఉంటున్నప్పటికీ ఆయనకు ఓటు ఎందుకు వేయమని ముక్త కంఠంతో చెబుతున్నారు..?

పలు సమీకరణాల తర్వాత మంగళగిరి బరిలో లోకేష్
ఎన్నికలకు ముందు నారాలోకేష్ ఎక్కడి నుంచి పోటీ చేయిస్తే బాగుంటుందా అని తెలుగుదేశం అధినాయకత్వం పలు సర్వేలు నిర్వహించింది. గెలిచే చోటనే లోకేష్ను బరిలోకి దింపాలని భావించింది. ఇందులో భాగంగానే గాజువాక, విశాఖతో పాటు పలు పేర్లను పరిశీలించినప్పటికీ చివరకు మంగళగిరి నుంచి లోకేష్ను పోటీచేయించాలని డిసైడైంది. ఇక నామినేషన్ల పర్వం ముగిసింది. లోకేష్ నామినేషన్ వేశాక వాటి పరిశీలన సమయంలో కాస్త గందరగోళం నెలకొన్నప్పటికీ ఆ తర్వాత సజావుగా ముగిసింది. ఇక మంగళగిరిలో లోకేష్కు పరిస్థితులు అంత అనుకూలంగా కనిపించడం లేదు. ఇందుకు కారణం మంగళగిరిలోని ఓ ప్రధాన సామాజిక వర్గం లోకేష్కు ఓటు వేయమని బహిరంగంగానే భీష్మించుకు కూర్చుంది.

మంగళగిరిలో మెజార్టీ ఓటర్లు పద్మశాలీయులే
అన్నీ ప్రణాళిక బద్దంగానే జరిగితే లోకేష్ గెలుపు ఖాయం... ఆ తర్వాత ఏపీకి ముఖ్యమంత్రి అవడం ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే చంద్రబాబు జాతీయ రాజకీయాలపై దృష్టి సారించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.2017లో లోకేష్ మంత్రి అయ్యారు. గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ మరియు ఐటీ పోర్ట్ఫోలియోలను ఆయనకు చంద్రబాబు నాయుడు అప్పగించారు. ఇక ఏపీ పాలిటిక్స్ చూస్తే చాలా మటుకు అభ్యర్థుల గెలుపోటములు కొన్ని సామాజిక సమీకరణాలపైనే ఆధారపడి ఉంటాయి. ఇక లోకేష్ ఈ సారి పోటీచేయనున్న మంగళగిరి నియోజకవర్గం సమీకరణాలు ఒక్కసారి పరిశీలిస్తే... అక్కడ పద్మశాలీ సామాజికవర్గానికి చెందిన మెజార్టీ ఓట్లు ఉన్నాయి.అయితే ఇందులో అత్యధిక ఓటర్లు లోకేష్కు ఓటు వేసేది లేదని తేల్చి చెబుతున్నారు. ఇందుకు కారణాలు కూడా వారే క్లారిటీ ఇస్తున్నారు. లోకేష్ కమ్మసామాజిక వర్గానికి చెందినవారని అదే కారణాన్ని ప్రాథమికంగా చూపిస్తున్నారు అక్కడి పద్మశాలీయులు.
మంగళగిరి నియోజకవర్గానికి 1989 నుంచి 2009 వరకు పద్మశాలీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే ఎమ్మెల్యేగా విజయం సాధిస్తూ వచ్చారు. మూడుసార్లు కాంగ్రెస్ పద్మశాలీ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని పోటీకి దింపి విజయం సాధించింది. అందులో ఒకసారి మహిళా అభ్యర్థి విజయం సాధించారు.ఇక 2014లో టీడీనీ గంజి చిరంజీవి అనే పద్మశాలీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని బరిలో నిలుపగా వైసీపీ నుంచి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఆల్ల రామకృష్ణారెడ్డిపై 12 ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. ఇక ఉమ్మడి రాష్ట్రం నుంచి చాలామంది మంగళగిరి పట్టణానికి వలస వచ్చి అక్కడే స్థిరపడ్డారు. ఇందుకు కారణం అక్కడ టెక్స్టైల్ వ్యాపారం బాగా జరుగుతుండటమే . పార్టీలతో సంబంధం లేకుండా వారి సామాజిక వర్గం నుంచి ఎవరైతే పోటీలో నిలుస్తారో వారికే తాము ఓటు వేయడం కొన్నేళ్లుగా వస్తోంది. మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం పద్మశాలీల కోసమే రిజర్వ్ అయినట్లుగా వారు భావిస్తారు. మంగళగిరిలో పద్మశాలీ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు దాదాపు 55వేలు ఉన్నట్లు తెలుస్తోంది. అందులో అధికంగా మంగళగిరి పట్టణంలోనే నివాసం ఉంటున్నారు.

లోకేష్ అక్కడ గెలిస్తే పద్మశాలీయులు ఎందుకు భయపడుతున్నారు..?
ఒక వేళ లోకేష్ను ఎన్నుకుంటే అక్కడి అసైన్డ్ భూములుకు ఎసరు పెట్టే అవకాశం ఉందని పద్మశాలీ సామాజిక వర్గం వారు భయపడుతున్నట్లు సమచారం. రత్నయ్య చెరువుకు సమీపంలో ఉన్న అసైన్డ్ భూముల్లో నివాసముంటున్న వీరిని ఖాళీ చేయించి భూములను స్వాధీనం చేసుకుంటారేమో అన్న భయం వీరిని వెంటాడుతోంది.అంతేకాదు కొన్ని అసైన్డ్ భూములను కార్పొరేట్స్కు ప్రభుత్వం రిజిస్టర్ చేసి ఇచ్చిందని అక్కడ వారు భవనాలు కూడా నిర్మించుకున్నారని అక్కడి స్థానికులు చెబుతున్నారు. తాము తమ అసైన్డ్ భూములను రిజిస్టర్ చేసి ఇవ్వమని ప్రభుత్వాన్ని కోరగా... ప్రభుత్వం తిరస్కరించినట్లు ఆవేదన వ్యక్తం చేశారు.

అర్హులైన వారికి పెన్షన్లు ఇవ్వలేదు..సబ్సీడీ కూడా లేదు
పద్మశాలీ సామాజిక వర్గానికి చెందిన వారు చాలామంది పెన్షన్లకు అర్హులైనప్పటికీ వారిలో 3వేల మందికి మాత్రమే ప్రభుత్వం పెన్షన్ ఇస్తోందంటూ వారు చెప్పారు. అర్హులైన వారికి పెన్షన్ ఇవ్వండంటూ దరఖాస్తు పెట్టుకుంటే అధికారులు తమ అర్జీలను విస్మరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు నేతన్నలకు 10శాతం సబ్బీడీ కూడా దక్కడం లేదని అదే కోఆపరేటివ్ సొసైటీలో సభ్యులుగా ఉన్నవారికి, పవర్లూమ్ ఆపరేటర్స్కు మాత్రం సబ్సీడీ ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు చాలామంది హృద్రోగ వ్యాధులతో బాధపడుతున్నారని అయితే ఆరోగ్యశ్రీ పథకం వారికి వర్తించడం లేదని వాపోయారు.అంతేకాదు గత కొన్నేళ్లుగా మంగళగిరిలో టెక్స్టైల్ పార్క్ నిర్మిస్తామంటూ టీడీపీ చెప్పుకొచ్చిందని ఆ హామీని నెరవేర్చలేకపోయిందని ఇకపై కూడా టీడీపీ నిర్మించదని వారికి ప్రగాఢ నమ్మకం ఉన్నట్లు అక్కడి నేతన్నలు చెబుతున్నారు.
మొత్తానికి లోకేష్ వస్తే భయమో... లేక టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడమో చేత పద్మశాలీయులు పసుపు పార్టీపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. మరి లోకేష్ నేతన్నల మద్దతు లేకుండా తన గెలుపును ఎలా సాధ్యం చేసుకుంటారో... ఇందుకు ఎలాంటి వ్యూహాలు రచిస్తున్నారో తెలియాలంటే మరికొద్ది కాలం ఆగక తప్పదు.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications