జగన్కు పాల్వాయి హెచ్చరిక: కిరణ్ను తప్పించి టి
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడితే ఒక్క రోజు కూడా తమ ప్రాంతంలో ఉండలేరని కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి బుధవారం హెచ్చరించారు. తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం చెప్పకుండా జగన్ ఇక్కడ పర్యటించాలనుకుంటే గతంలో ఏం జరిగిందో ఇప్పుడు అదే జరుగుతుందని చెప్పారు.
తెలంగాణ వచ్చాక హైదరాబాదు జిల్లా శాంతిభద్రతలను కేంద్ర హోంశాఖ పరిధిలో ఉంచాలని తాను కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేకు చెప్పానన్నారు. హైదరాబాదుపై ఎలాంటి సందిగ్ధత లేదని, ఎలాంటి మెలికలు లేవని ఆయనకు వివరించినట్లు చెప్పారు. అబద్దాలతో సీమాంధ్ర నేతలు తెలంగాణ ప్రజలను మోసగిస్తున్నారని ఆరోపించారు. ఆంధ్రాలో పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతున్నా ప్రభుత్వం అణచివేయలేకపోతోందని ఆరోపించారు.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని తప్పించి రాష్ట్రపతి పాలన విధించి విభజన ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. జగన్ సీమాంధ్రలో పర్యటించి తెలుగుదేశం పార్ట అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు నామరూపాలు లేకుండా చేయాలన్నారు. జగన్ తెలంగాణలో పర్యటిస్తే మాత్రం మొదట తామే అడ్డుకుంటామన్నారు. తెలంగాణ ఏర్పాటు ఖాయమని పాల్వాయి అన్నారు.
హరీష్ రావు మండిపాటు
కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు కుమ్మక్కై తెలంగాణను నాన్చుతున్నాయని తెరాస శాసన సభ్యుడు హరీష్ రావు మండిపడ్డారు. జగన్ కాన్వాయ్కు అనుమతి ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. సీమాంధ్ర నేతకు ఓ న్యాయం తెలంగాణ నేతలకు మరో న్యాయమా అన్నారు.
గడ్డుకాలమే: రాయపాటి
సీమాంధ్రలో కాంగ్రెసు పార్టీకి గడ్డు కాలమేనని ఎంపి రాయపాటి సాంబశివ రావు అన్నారు. తెలంగాణ ఇచ్చినా తెరాస కాంగ్రెసు పార్టీలో విలీనం కాదన్నారు. జగన్ వల్ల సీమాంధ్రలో తమ పార్టీకి మరింత నష్టమని చెప్పారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం తప్ప కాంగ్రెసుకు మరోదారి లేదన్నారు. సమైక్యంగా ఉంచకుంటే తాము కఠిన నిర్ణయాలు తీసుకుంటామని హెచ్చరించారు.