తిరుపతిలో భారీగా జనసందోహం
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు నేటితో ముగియనున్నాయి. చివరి రోజు పంచమీ తీర్థానికి వేలాదిగా భక్తులు తరలివస్తోన్నారు. వారికోసం టీటీడీ పటిష్ట ఏర్పాట్లు చేసింది. క్యూలైన్లు, బ్యారీకేడ్లు, పద్మ పుష్కరిణిలోనికి ప్రవేశ, నిష్క్రమణ గేట్లు, సూచిక బోర్డులు తదితర ఇంజినీరింగ్ పనులు పూర్తయ్యాయి. భద్రత కోసం టీటీడీ సెక్యూరిటీ- విజిలెన్స్ విభాగం 600 మంది సిబ్బందిని మోహరింపజేసింది.
స్కౌట్స్ అండ్ గైడ్స్- 200, ఎన్సీసీ క్యాడెట్స్- 200, శ్రీవారి సేవకులు- 900, పోలీస్ సిబ్బంది- 1,600 మందితో భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. భక్తుల కోసం తిరుచానూరులో దాదాపు 150 అన్నప్రసాదం కౌంటర్లు ఏర్పాటు అయ్యాయి. తోళప్ప గార్డన్స్- 50, ఎస్వీ హైస్కూల్- 15, నవజీవన్ ఆసుప్రతి వద్ద గల అయప్పస్వామి ఆలయం- 45, పూడి- 25, గేట్- 4, ఎమర్జెన్సీ- 15 వద్ద గల కౌంటర్లలో అన్నప్రసాదాలను పంపిణీ చేస్తారు. క్యూలైన్లలోఅల్పాహరం, అన్నప్రసాదాలు, మజ్జిగ పంపిణీ చేస్తారు.

అమ్మవారి దర్శన సమయం, అన్నప్రసాదాలు, మరుగుదొడ్లు, పార్కింగ్ తదితర ప్రాంతాలను భక్తులు సులభంగా గుర్తించేందుకు వీలుగా వివిధ ప్రాంతాల్లో సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు. డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది, అంబులెన్స్లు, అవసరమైన మందులను అందుబాటులో ఉంచారు. స్విమ్స్, రుయా ఆసుపత్రులకు చెందిన డాక్టర్లు, ఆయుర్వేద వైద్యులు భక్తులకు సేవలను అందిస్తారు.
పంచమి తీర్థానికి విచ్చేసే భక్తులకు శిల్పారామం, తనపల్లి క్రాస్, మార్కెట్యార్డు, రామానాయుడు కల్యాణ మండపం, పూడి జంక్షన్, తిరుచానూరు దళిత వాడ వద్ద పార్కింగ్ ఏర్పాటు చేశారు. వీఐపీ వాహనాల కోసం తిరుచానూరు పంచాయతీ కార్యాలయం ఎదురుగా పార్కింగ్ ఏర్పాటు చేశారు. శ్రీ పద్మావతీ అమ్మవారి బ్రహ్మోత్సవాలను వీక్షించేందుకు వీలుగా తిరుచానూరు, తిరుపతి పరిసర ప్రాంతాలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న టీటీడీ ఆలయాల్లో ఇప్పటికే 25 ఎల్ ఈ డీ స్క్రీన్ లు ఏర్పాటయ్యాయి.
పంచమీ తీర్థం కార్యక్రమాన్ని ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది. పద్మ పుష్కరిణిలో మధ్యాహ్నం 12.10 గంటలకు కుంభలగ్నంలో చక్రస్నానం కార్యక్రమాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. పంచమీ తీర్థం ప్రభావం రోజంతా ఉంటుందని, భక్తులు సంయమనంతో వ్యవహరించి పుణ్యస్నానాలు ఆచరించాలని టిటిడి విజ్ఞప్తి చేస్తుంది.












Click it and Unblock the Notifications