జగన్ కు కొత్త అర్ధం చెప్పిన పంచుమర్తి అనురాధ .. ప్రజా సంక్షేమంపై పంచుమర్తి ప్రశ్నల వెల్లువ
ఏపీ లోని అధికార వైసీపీపై, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పై తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, మహిళా నాయకురాలు పంచుమర్తి అనురాధ నిప్పులు చెరిగారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజా సంక్షేమం గురించి వైసిపి మాట్లాడితే జనం నవ్వుతున్నారని అనురాధ ఎద్దేవా చేశారు.
ఏపీలో జగన్ పాలనలో ప్రజా సంక్షేమం అన్నది లేదని విమర్శల వర్షం కురిపించారు .
జగన్ అంటే లక్షలాది మంది బాధితులు, వేలమంది నేరచరితులు అని జగన్ అనే పదానికి సరికొత్త అర్థం చెప్పారు పంచుమర్తి అనురాధ. రైతు భరోసా పేరుతో రైతులను మోసం చేయడమేనా ప్రజా సంక్షేమం అని ప్రశ్నించారు. అమ్మ ఒడి పేరుతో అమ్మలందరినీ మోసం చేయడమేనా అని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు పంచుమర్తి అనురాధ. బడుగు బలహీన వర్గాల నిధులు పక్కదారి పట్టించటమేనా ప్రజా సంక్షేమం అంటే అని ప్రశ్నించిన అనురాధ, నిరుపేద వర్గాలకు, వికలాంగులకు వృద్ధులకు ఇచ్చే మూడు వేల రూపాయల పెన్షన్ కూడా ఇవ్వకుండా మోసం చేయడమే ప్రజా సంక్షేమం అంటే అంటూ వైసీపీ పాలన పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
బడుగు బలహీన వర్గాలకు ఉపాధినిచ్చే పథకాలను నిలిపివేయటమే ప్రజా సంక్షేమం అంటే అంటూ అసహనం వ్యక్తం చేసిన పంచుమర్తి అనురాధ పేద వారికి ఐదు రూపాయలకే భోజనం పెట్టే అన్న క్యాంటీన్ లను మూసివేయడంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నిరుద్యోగ భృతిని ఆపేశారని నిప్పులు చెరిగారు. రుణమాఫీ తీసేయటమేనా ప్రజా సంక్షేమం అంటే అని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వానికి ప్రజా సంక్షేమం అంటే తెలియదని, వైసిపి ప్రభుత్వ హయాంలో ప్రజా క్షామం కొనసాగుతుందని పంచుమర్తి అనురాధ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.