'ఆ వార్తల్లో నిజం లేదు': హైదరాబాద్లోని ఏపీ సచివాలయం 27నాటికి ఖాళీ!
హైదరాబాద్: ఏపీ ప్రభుత్వానికి కేటాయించిన హైదరాబాద్ సచివాలయంలోని బ్లాకులను ఈ నెల 27 నాటికి తెలంగాణ ప్రభుత్వానికి అప్పగిస్తున్నట్లు మీడియాలో వచ్చిన వార్తలను ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ గురువారం ఒక ప్రకటనలో ఖండించారు.
వివరాల్లోకి వెళితే ఈ నెల 27లోగా ఆంధ్రప్రదేశ్కు చెందిన సచివాలయ ఉద్యోగులందరినీ అమరావతి ప్రాంతంలోని వెలగపూడిలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయానికి తరలించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు సర్క్యులర్ కూడా జారీ చేసింది.
అయితే గురువారం హైదరాబాద్లోని ఏపీ సచివాలయాన్ని ఖాళీ చేసి తెలంగాణ ప్రభుత్వానికి స్వాధీనం చేసేందుకు ఏపి ప్రభుత్వం అంగీకరించినట్లు వార్తలు వచ్చాయి. ఒక్క ఎల్ బ్లాక్ మినహా నార్త్ హెచ్, సౌత్ హెచ్, జె, కె బ్లాకులను ఈ నెల 27న అప్పగిస్తామని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ టక్కర్.. తెలంగాణ సీఎస్ రాజీవ్శర్మకు లేఖ రాసినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.
దీనిపై స్పందించిన ఆయన ఎల్ బ్లాక్ మినహా అన్ని భవనాలను అప్పగిస్తున్నట్టు వస్తున్న వార్తలను ఖండించారు. తాము అలాంటి లేఖను తెలంగాణకు రాయలేదని, ఏపీ సీఎస్ ఎస్పీ టక్కర్ లేఖ రాశారని వస్తున్న వార్తలు నిరాధారమని కొట్టి పారేశారు.
ఇదిలా ఉంటే అమరావతిలో కనీస మౌలిక సదుపాయాలు, ఇతర వసతులు సరిగా లేవని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్కడ తాత్కాలిక రాజధానిలో పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పించడంతోపాటు స్థానికతను తేల్చాలని పట్టుబడుతున్నారు.
ఈ క్రమంలో సచివాలయంలోని బ్లాకులను జూలై లోగా తెలంగాణ ప్రభుత్వానికి స్వాధీనం చేస్తే, ఉద్యోగులు విజయవాడకు రావడం అనివార్యమవుతుందన్న వ్యూహంతోనే, ఏపి ప్రభుత్వం తన భవనాలను తెలంగాణకు ఇచ్చేందుకు అంగీకరించిందని వార్తలు వచ్చాయి.
ఇదిలా ఉంటే ఏపీ ప్రభుత్వం సచివాలయాన్ని ఖాళీ చేస్తే, అక్కడ వాణిజ్య అవసరాల కోసం బహుళ అంతస్ధులు నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం గతంలో నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆ మేరకు అరబ్ ఎమిరేట్స్కు చెందిన కంపెనీతో ఒప్పందం కూడా కుదుర్చుకున్నట్లు ప్రచారం జరిగింది. అయితే పరకాల ఖండనతో ఈ వార్తల్లో నిజం లేదని తేలిపోయింది.
అమరావతికి ఫైళ్ల తరలింపులో ఆర్టీసీ ఆఫర్
ఏపీయస్ఆర్టీసీ... నవ్యాంధ్ర రాజధాని అమరావతికి ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ఆయా శాఖల పైళ్లు, ఫర్నిచర్ సైతం తరలించేందుకు సిద్ధమవుతోంది. జూన్ 1 నుంచి గూడ్స్ రవాణా ప్రారంభించిన ఆర్టీసీ హైదరాబాద్లోని ప్రభుత్వ కార్యాలయాల తరలింపునకు ఓ ఆఫర్ ఇస్తోంది.
'మీ ఫైళ్లు, ఫర్నిచర్ మాకు అప్పగిస్తే సరసమైన ధరలోనే విజయవడా, అమరావతి, గుంటూరు ప్రాంతాలకు తరలిస్తాం' అని చెప్తోంది. ప్రైవేట్ గూడ్స్ అయితే ఎక్కువ ధర అని, లారీల్లో అయితే రక్షణ తక్కువ అని చెబుతున్నారు. హైదరాబాద్ నుంచి అమరావతికి తరలించేందుకు ఒక బస్సులో పట్టేంత లగేజికి కనీసం రూ. 16వేలకు తక్కువ లేదని, ఆర్టీసీలో అయితే 300 కిలోమీటర్ల వరకూ ఒకరోజుకు బస్సు అద్దె రూ. 10 వేలు మాత్రమేనని వివరిస్తున్నారు.