దొంగచాటు విభజన: పార్థసారథి, వీడేది లేదన్న కాసు
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి రాష్ట్రాన్ని విభజిస్తోందని రాష్ట్ర మంత్రి పార్థసారథి ఆరోపించారు. ఆయన బుధవారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ ఎంతో చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ అప్రజాస్వామిక నిర్ణయం తీసుకుందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని 6 కోట్ల మంది ప్రజల మనోభావాలను కాంగ్రెస్ గౌరవించలేదని ఆరోపించారు.
తమ డిమాండ్లపై ఎటువంటి హామీ ఇవ్వకుండా దొంగచాటుగా, 23 నిమిషాల్లో చర్చను ముగించి, రాష్ట్రాన్ని విభజించడం అమానుషమని కాంగ్రెస్ పార్టీని విమర్శించారు. గత 50 సంవత్సరాలలో ఇలాంటి చెత్త బిల్లును చూడలేదన్న భారతీయ జనతా పార్టీ కూడా మద్దతు ఇవ్వడం ద్వారా ప్రజాస్వామ్యంలో రాజకీయపక్షాలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
గతంలో ముఖ్యమంత్రి కిరణ్ కిరణ్ కుమార్ రెడ్డి పదవికి రాజీనామా చేయాలని భావించినప్పటికీ సీమాంధ్ర నేతల ఒత్తిడి మేరకే ఆగారని తెలిపారు. కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీపై తనకు సమాచారం లేదని పార్థసారథి తెలిపారు. ముఖ్యమంత్రిపై మంత్రులు కొండ్రు మురళీ, డొక్కా మాణిక్యవరప్రసాద్ విమర్శలు చేయడం సరికాదని మంత్రి పార్థసారథి అన్నారు.
కాంగ్రెస్లోనే ఉంటా: కాసు
కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని రాష్ట్ర మంత్రి కాసు వెంటక కృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. తాను ఇప్పటికే మంత్రి పదవికి రాజీనామా చేసి గవర్నర్ నరసింహన్కు రాజీనామా లేఖను పంపించానని తెలిపారు.