తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా పాస్టర్ ప్రవీణ్ మరణం..?
ప్రముఖ పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం తెలుగు రాష్ట్రాల్లో వివాదాస్పదంగా మారింది. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ లో నివసిస్తుండగా.. క్రైస్తవ సభల కోసం పలు ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు. ఈ క్రమంలోనే రాజమండ్రి వద్ద కార్యక్రమాలకు వచ్చి అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్టు తెలుస్తోంది. బుల్లెట్ పై విజయవాడ నుంచి రాజమండ్రి వెళ్లి.. అక్కడ నుంచి రాజానగరం వెళ్తున్నట్టు సమాచారం. ఆ పరిస్థితుల్లోనే ఆయన రోడ్డు పక్కన చనిపోయి పడి ఉండడం గమనించిన స్థానికులు కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అయితే ఆయన మృతదేహాన్ని చూసిన వారు మాత్రం ఆయన్ని ఎవరో చంపి పడివేసి ఉంటారని ఆరోపిస్తున్నారు. పెదాలపై గాయాలున్నాయని, రాడ్డుతో కొట్టినట్టు గాయాలు కనపడుతున్నాయని అంటున్నారు. దాంతో ప్రవీణ్ పగడాల మృతదేహాన్ని రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అక్కడ క్రైస్తవ సోదరులు ధర్నా చేపట్టారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

గతంలో పాస్టర్ ప్రవీణ్ పగడాలను చాలామంది బెదిరించారని.. ఆయనపై దాడి చేస్తామని కూడా హెచ్చరించారని చెబుతున్నారు. ఇటీవల ప్రవీణ్ పగడాల సైతం తనపై దాడి జరిగే అవకాశం ఉందని బాహాటంగానే వ్యాఖ్యానించినట్టు గుర్తు చేస్తున్నారు. పోలీసులు ఆయనకు రక్షణ కల్పించలేకపోయారని ధ్వజమెత్తుతున్నారు. ప్రవీణ్ పగడాల మృతిపై పలువురు క్రైస్తవ మత ప్రచారకులు సైతం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
కొంతకాలంగా యూట్యూబ్ ఛానల్స్, సోషల్ మీడియాలో తమ వర్గం గొప్పది అంటే తమ వర్గం గొప్పది అంటూ ఆయా వర్గాలకు చెందిన వారు ఇంటర్వ్యూ లలో ఘాటుగా వ్యాఖ్యానించుకోవడం చూస్తూనే ఉంటున్నాం. ఇంటర్వ్యూలను దాటుకొని ఇప్పుడు ఏకంగా సోషల్ మీడియాలో పరస్పరం ఛాలెంజ్ లు చేసుకుంటూ.. ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. పలు చోట్ల అయితే ఏకంగా దాడులు చేసుకుంటున్న ఘటనలు సామాన్య ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్న వేళ.. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి చెందిన ఘటన ఏ పరిస్థితులకు దారి తీస్తుందో అని ఆందోళన వ్యక్తం అవుతోంది.












Click it and Unblock the Notifications