అక్కడే ట్విస్ట్: పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్, ఆత్మరక్షణలో జగన్, అందుకే
బీజేపీతో పొత్తు ఉండదని తేలడంతోనే జగన్ మళ్లీ ప్రత్యేక హోదా నినాదం అందుకున్నారనే వాదనలు వినిపించాయి.తాజాగా, మరో ప్రచారం కూడా సాగుతోంది.
అమరావతి: బీజేపీతో పొత్తు ఉండదని తేలడంతోనే వైసిపి అధినేత జగన్ మళ్లీ ప్రత్యేక హోదా నినాదం అందుకున్నారనే వాదనలు వినిపించాయి.
తాజాగా, మరో ప్రచారం కూడా సాగుతోంది. యువభేరీ సభను అనంతపురంలో పెట్టడానికి, మళ్లీ ప్రత్యేక గళం ఎత్తుకోవడానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రభావం ఉందంటున్నారు.

ప్రత్యేక హోదానే ఏకైక అజెండాగా
ప్రత్యేక హోదా నినాదమే వైసిపి ఏకైక ఎజెండా అన్న విధంగా ఏడాది క్రితం వరకు జగన్ ఉండేవారు. నిరాహారదీక్షలు, యువభేరిల హడావుడి కనిపించింది. హోదా అంశంపై సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగేవారు.

దర్యాఫ్తు సంస్థల ఎఫెక్ట్
ఆ తర్వాత ప్రధాని మోడీపై, కేంద్రంపై జగన్ కొద్దిగా విమర్శలు ప్రారంభించారు. కేంద్రం తీరుపై వైసిపి ఎంపీలు రాజీనామా చేస్తారని చెప్పారు. ఈడీ అటాచ్మెంట్ల నేపథ్యంలో ఆయన ఒక్కసారిగా వెనక్కి తగ్గారనే వాదనలు వినిపించాయి. మోడీతో భేటీ అయ్యారు. ఆ తర్వాత హోదా అంశంపై మాట్లాడలేదు. హోదా గురించి మాట్లాడకుండానే రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థికి మద్దతిచ్చారు.

ఆయనకు పాదాభివందనాలు
ఎన్డీయే అభ్యర్థిగా రామ్ నాథ్ కోవింద్ను ఎంపిక చేశారని తెలియగానే వైసిపి రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి వెళ్లి ఆయనను అభినందించి, పాద సమస్కారం చేసి వచ్చారు. అడగకముందే మద్దతు ప్రకటించారు. హైదరాబాద్కు ప్రచారం కోసం వచ్చిన కోవింద్కు జగన్, విజయసాయి పాదాభివందనం చేశారు.

మళ్లీ హఠాత్తుగా హోదా గళం
మోడీని కలిసిన తర్వాత, రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతిచ్చేందుకు జగన్ ప్రత్యేక హోదా అంశాన్ని తీసుకురాలేదు. హోదా ఇస్తే రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతిస్తామని జగన్ చెప్పగలరా అని కాంగ్రెస్ నిలదీసినా మౌనంగానే ఉన్నారు. కానీ ఇప్పుడు మళ్లీ హోదా గళం ఎత్తుకున్నారు.

అక్కడే ట్విస్ట్.. పవన్ కళ్యాణ్ యాత్ర
త్వరలో పవన్ కళ్యాణ్ రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర లేదా వాహనంలో పర్యటించనున్నారు. హోదా విషయంలో ఆయన చాలా క్లారిటీగా ఉన్నారు. బిజెపికి తాను మద్దతు పలికిందే హోదా కోసమని చెప్పారు. ఇప్పుడు తన పర్యటనలోనూ ఆయన పార్టీ బలోపేతంతో పాటు హోదా అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తారు.

ఆత్మరక్షణలో జగన్
దోస్తీకి బిజెపి వెనుకడుగు వేయడం, రంగంలోకి పవన్ కళ్యాణ్ రావడంతో జగన్ ఆత్మరక్షణలో పడ్డారని అంటున్నారు. ఈ కారణంగా ఆయన తిరిగి హోదా అంశాన్ని లేవనెత్తారని భావిస్తున్నారు. హోదా విషయంలో చంద్రబాబును నిలదీయడంతో పాటు మోడీ, బిజెపిపై పవన్ కళ్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన సందర్భాలున్నాయి. కానీ జగన్ మాత్రం కేసుల నేపథ్యంలో బిజెపిని నిలదీయలేకపోతున్నారని అంటున్నారు.

ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
జగన్ పాదయాత్ర నవంబర్ 2వ తేదీన ప్రారంభమవుతుంది. ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరవ్వాల్సి ఉంది. కోర్టు హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలన్న జగన్ విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది. ఈ నేపథ్యంలో ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరయ్యేందుకు ఆయన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకున్నారు.












Click it and Unblock the Notifications