మోడీ సభ: జగన్, కెసిఆర్లపై రెచ్చిన పవన్, బాబు
హైదరాబాద్: బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ, తెలుగదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం రాత్రి నుంచి గురువారం రాత్రి వరకు సీమాంధ్రను చుట్టేశారు. తిరుపతిలో బుధవారంనాడు ప్రారంభమైన వారి సుడిగాలి పర్యటన గురువారం రాత్రి విశాఖపట్నం సభతో ముగిసింది. వారు ముగ్గురు కలిసి ఆరు బహిరంగ సభల్లో పాల్గొన్నారు. వారితో పాటు బిజెపి సీనియర్ నేత ఎం. వెంకయ్య నాయుడు కూడా ఉన్నారు. మోడీ హిందీ ప్రసంగాలను ఆయన తెలుగులోకి అనువాదం చేస్తూ వచ్చారు.
నరేంద్ర మోడీ సీమాంధ్ర పర్యటనలో పెద్దగా రాష్ట్ర విభజన అంశాన్ని ప్రస్తావించలేదు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి గురించి గానీ తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు గురించి గానీ మాట్లాడలేదు. కొత్తగా ఏర్పడే సీమాంధ్ర రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేస్తాననే విషయంపైనే ఆయన ఎక్కువగా దృష్టి పెట్టారు. స్థానిక వనరులను, స్థానిక సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఆ సమస్యల పరిష్కారానికి తాను ఏం చేస్తానను, ఎలా చేస్తాననే విషయాల గురించి ఆయన ఎక్కువగా మాట్లాడారు. చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయాలని మాత్రం ఆయన సీమాంధ్ర ప్రజలను కోరారు. చంద్రబాబును, పవన్ కళ్యాణ్ను ప్రశంసించారు. వారిని ప్రత్యేకంగా గుర్తించారు.

సీమాంధ్రలో కూడా పవన్ కళ్యాణ్, చంద్రబాబు కెసిఆర్ను ఏకిపారేశారు. మోడీని తిడితే కెసిఆర్ తాట తీస్తానని పవన్ కళ్యాణ్ పదే పదే అన్నారు. కెసిఆర్ అలాగే వ్యవహరిస్తే తన సైకిల్ స్పీడ్ పెంచి, సైకిల్తో తొక్కిస్తానని చంద్రబాబు అన్నారు. సీమాంధ్ర ప్రజలపై కెసిఆర్ ద్వేషం పెంచుతున్నారని, సీమాంధ్ర ప్రజలను బూతులు తిడుతున్నారని పవన్ కళ్యాణ్ అన్నారు. జగన్ను ఏమీ అనని కెసిఆర్ తననూ పవన్ కళ్యాణ్నూ మోడీని తిడుతున్నారని చంద్రబాబు అన్నారు.
వైయస్ జగన్మోహన్ రెడ్డిపై పవన్ కళ్యాణ్ అన్ని సభల్లోనూ తీవ్రంగా రెచ్చిపోయారు. వైసిపి హఠావో, సీమాంధ్ర బచావో అనే నినాదాన్ని ఇచ్చారు. వైయస్ పదవీ కాంక్ష వల్లనే రాష్ట్ర విభజన జరిగిందని ఆయన విమర్శించారు. జగన్, కెసిఆర్ అన్నదమ్ములని ఆయన అన్నారు. తాను మాత్రమే తెరాసకు ఎదురు వెళ్లానని, జగన్కు కెసిఆర్ను ఎదుర్కునే దమ్మూ ధైర్యం లేదని ఆయన అన్నారు. సీమాంధ్ర పౌరుషం చచ్చిపోయిందా అని పవన్ కళ్యాణ్ జగన్ను ప్రతి చోటా ప్రశ్నించారు. సీమాంధ్ర ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడలేని జగన్కు ముఖ్యమంత్రి అయ్యే హక్కు లేదని ఆయన అన్నారు.
సీమాంధ్రలో వైయస్ జగన్ తెలుగుదేశం పార్టీకి గట్టి పోటీ ఇచ్చే పరిస్థితి ఉండడంతో పవన్ కళ్యాణ్, చంద్రబాబు జగన్ను టార్గెట్ చేసుకున్నట్లు కనిపిస్తోంది. వైయస్ రాజశేఖర రెడ్డి వల్లనే రాష్ట్ర విభజన జరిగిందని, వైయస్ పాలనలో సీమాంధ్ర ప్రజలపై తెలంగాణలో ద్వేషం పెరిగిందని పవన్ కళ్యాణ్ అన్నారు. జగన్ అవినీతిని చంద్రబాబుతో పాటు ఆయన కూడా ఎత్తి చూపారు. మొత్తం మీద, జగన్ను చంద్రబాబు, పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తే, మోడీ మాత్రం అభివృద్ధి మంత్రం జపించారు. స్వర్ణాంధ్ర కావాలో, స్కామాంధ్ర కావాలో తేల్చుకోవాలని మోడీ అన్నారు. రాష్ట్రాన్ని దోచుకున్నవారిని గెలిపించవద్దని ఆయన కోరారు. పరోక్షంగా జగన్కు మద్దతి ఇవ్వవద్దని ఆయన సూచించారు.












Click it and Unblock the Notifications