బస్సు యాత్రకు సిద్దంగా ఉండాలని నేతలకు పిలుపు
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో మరో యాత్రకు తెర లేవబోతోంది. 2019 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండడంతో రాజకీయ పార్టీలు ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇప్పటికే వైయస్ఆర్ సీపి అదినేత జగన్మోహన్ రెడ్డి గత ఐదు నెలలుగా తన పాదయాత్ర కొనసాగిస్తుండగా, జనసేన అద్యక్షుడు పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర ద్వారా రాష్ట్రాన్ని చుట్టేయాలని ప్లాన్ చేస్తున్నారు.
అందుకోసం ఇదే మే నెలలో శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుండి బస్సు యాత్ర ప్రారంబించి ప్రజల కష్టసుఖాలను తెలుసుకోవాలనుకుంటున్నారు జనసేనాని. పాదయాత్ర రూట్ మ్యాప్, పబ్లిక్ మీటింగ్స్, బస, భోజన సదుపాయాల అంశాలను ఇటీవలే పార్టీలో కీలక బాధ్యతలు చేపట్టిన దేవ్ పర్యవేక్షిస్తున్నట్టు తెలుస్తోంది.
రాజకీయ ప్రసంగాలను, ప్రజా సమప్యల పరిష్కార విధానాలను కూడా సీనియర్ల నుండి సలహాలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. మొత్తం 3 విడతలుగా బస్సు యాత్ర నిర్వహించి 13 జిల్లాలను కవర్ చేయాలని జనసేనాని భావిస్తున్నట్టు తెలుస్తోంది. తొలి విడతగా 5జిల్లాలు తర్వాత రెండు దఫాలుగా మిగిలిన 8జిల్లాల్లో పర్యటించాలని పవన్ ప్రణాళిక రచిస్తున్నారు. జిల్లా పర్యటన బాధ్యతలను ఆయా జిల్లా ఇంచార్జులకు అప్పగించినట్టు సమాచారం.
ఒక జిల్లాలో పాదయాత్ర కొనసాగుతున్నప్పుడు పక్క జిల్లాల నాయకులు., ఇంచార్జులు ప్రజా సమస్యలు, ఆయా గ్రామాల మౌళిక సౌకర్యాల గురించి వివరాలు సేకరించి పవన్ కు ముందుగానే సమాచారం అందించాల్సిందిగా ఆదేశాలు జారీచేసారు. దీంతో ప్రజా సమస్యలపై ప్రసంగించేందుకు పవన్ కు ఉపయుక్తంగా ఉంటుందని భావిస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ పథకాలు క్షేత్ర స్థాయిలో అమలు అవుతున్నాయా.. లేదా అనే అంశం పై పవన్ ఫోకస్ పెట్టబోతున్నట్టు తెలుస్తోంది. అంతే కాకుండా అయా గ్రామాల్లో శాంతిభద్రల పరిస్థితులు ఎలా ఉన్నాయో కూడా పవన్ ఆరా తీయబోతున్నారు.
అసలు మొత్తం ప్రభుత్వ పని తీరు పట్ల ప్రజలు ఎలాంటి అభిప్రాయంతో ఉన్నారో క్షేత్ర స్థాయిలో తెలుసుకోవాలని పవన్ భావిస్తున్నారు. ఎండలు తీవ్ర స్థాయిలో ఉన్నందున ప్రజలకు అసౌకర్యం కలిగించకుడా ఉండేందుకు సాధ్యమైనంత వరకు ఉదయం, సాయంత్రం మాత్రమే బహిరంగ సభలకు జనసేన పార్టీ ప్లాన్ చేస్తోంది. మొత్తానికి 2019 లో ఒంటరిగా పోటీ చేయాలని భావిస్తున్న జనసేన పార్టీ బస్సుయాత్ర అధికార, ప్రతిపక్ష పార్టీల గుండెల్లో గుబులు పుట్టిస్తుందో లేదో చూడాలి.