సంతోషం: కెసిఆర్పై పవన్ కల్యాణ్ వ్యంగ్యం, జగన్ బలం వేరే....
తమ జనసేన పార్టీకి ఒకటి రెండు శాతమే ఓట్లు వస్తాయని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు చేసిన ప్రకటనపై జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ స్పందించారు.
విజయవాడ: ఉద్దానం కిడ్నీ బాధితుల గురించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో మాట్లాడిన తర్వాత మీడియా సమావేశంలో జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ సోమవారం పలు విషయాల గురించి మాట్లాడారు. రాజకీయాలపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.
తమ జనసేన పార్టీకి ఒకటి రెండు శాతమే ఓట్లు వస్తాయని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు చేసిన ప్రకటనపై కూడా ఆయన స్పందించారు. సంతోషమేనని ఆయన కెసిఆర్ ప్రకటనను ఉద్దేశించి అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో తాను నిర్వహించిన తొలి మీడియా సమావేశం ఇదేనని ఆయన చెప్పారు.
తమ పార్టీకి జీరో ఇవ్వలేదు. జనంలోకి వెళితే ఎవరి బలం ఎంతో తెలుస్తుందని ఆయన కెసిఆర్ ప్రకటనను ఉద్దేశించి అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీతో జనసేన కలిస్తేనే ఆ పార్టీ గెలుస్తుందని భావిస్తే అది తప్పు అని ఆయన అన్నారు.

పరిస్థితులను బట్టి నిర్ణయం..
ఎన్నికల ముందు పరిస్థితులను బట్టి పొత్తులపై నిర్ణయం తీసుకుంటానని పవన్ కల్యాణ్ చెప్పారు. జనంలోకి వెళితేకానీ తన బలమెంతో తెలియదని, పార్టీ బలోపేతం రాత్రికి రాత్రి జరగదని ఆయన అన్నారు. రాగానే పొడిచేస్తానని అనడం లేదని చెప్పారు. పార్టీ నిర్మాణం బాధ్యతతో చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. వైసిపి, జనసేనల్లో ఏ పార్టీ బలం ఆ పార్టీదేనని ఆయన అన్నారు.

ఇంకా రెండు సినిమాలున్నాయి...
ఇంకా రెండు సినిమాలు చేయాల్సినవి ఉన్నాయని, వాటిని వేగంగా పూర్తి చేసేందుకు నిర్మాతలతో మాట్లాడుతానని, ప్రత్యక్ష రాజకీయాలకు మూడో వంతు సమయం కేటాయిస్తానని వవన్ కల్యాణ్ చెప్పారు. గరగపర్రు దళితుల అంశం గురించి ప్రశ్నిస్తే... అల్లూరి, గాంధీ, అంబేడ్కర్ వంటి మహనీయులను ఒక కులానికే పరిమితం చేయడం దురదృష్టమని అన్నారు.

కాంగ్రెసు ఉన్నప్పుడు ఎందుకు...
ముద్రగడ పద్మనాభం కాపు రిజర్వే,షన్లపై నిజాయితీగా పాదయాత్ర చేయాల్సి వస్తే దానికి ప్రభుత్వం అనుమతిని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని పవన్ కల్యాణ్ చెప్పారు. కాపు రిజర్వేషన్ డిమాండ్ దశాబ్దాలుగా ఉన్నప్పడు దాన్ని నిరంతరం ఎక్కడా బ్రేక్ లేకుండా ముందుకు తీసుకువెళ్లాలని, మధ్యలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎందుకు ఉద్యమానికి బ్రేక్ వచ్చిందన్నది నా ప్రశ్న అని ఆయన అన్నారు. బీసీ కులాలకు నష్టాన్ని కలిగిస్తే ఆ నష్టాన్ని ఏ విధంగా పరిష్కరించవచ్చో ప్రజలకు తెలియజేయాలని, దీనిపై దయచేసి ఎవరూ రాజకీయాలు చేయకూడదని అన్నారు.

పవన్ శ్రద్ధకు అభినందన..
ఉద్ధానంలో కిడ్నీ వ్యాధిగ్రస్తుల సమస్యపై పవన్ వ్యక్తం చేసిన ఆందోళనను, చూపుతున్న శ్రద్ధను తాను అభినందిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. ఆయనతో కలిసి హార్వర్డ్ మెడికల్ బృందం, ఇక్కడి ఆరోగ్య శాఖ అధికారుల బృందంతో సమస్య పరిష్కారానికి తీసుకున్న చర్యలు, ఇంకా తీసుకోవాల్సిన అంశాలపై చర్చించామని ట్వీట్ చేశారు.












Click it and Unblock the Notifications