జగన్ను ఇమిటేట్ చేసిన పవన్- రేపటి నుంచి చూస్తారుగా
భీమవరం: జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన వారాహి బస్సు యాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలో కొనసాగుతోంది. జ్వరం వల్ల ఈ యాత్రకు తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చిన ఆయన.. ఈ సాయంత్రం భీమవరం నియోజకవర్గం నాయకులు, కార్యకర్తలతో సమావేశం అయ్యారు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.
పార్వతిపురం మన్యం జిల్లా కురుపాంలో అమ్మఒడి నిధుల విడుదల సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన విమర్శలపై ఎదురుదాడికి దిగారు పవన్ కల్యాణ్. జగన్కు వారాహికి, వరాహికి తేడా తెలియదని ఎద్దేవా చేశారు. అక్షరాలను సరిగ్గా నేర్చుకోకపోతే ఇలాంటి పరిస్థితే తలెత్తుతుందని చురకలు అంటించారు.

తాను ఊగిపోతూ మాట్లాడుతుంటానని వైఎస్ జగన్ బాధపడుతున్నాడని, రేపటి నుంచి తన హావభావాలను మార్చుకుంటానని పవన్ చెప్పుకొచ్చారు. తాను కూడా జగన్లా మాట్లాడతానంటూ ఇమిటేట్ చేసి చూపించారు. ముఖ్యమంత్రి గారికి ఇది ఓకేనా.. అంటూ ప్రశ్నించారు. గతంలో తాను చెప్పులు చూపించడానికి అనేక కారణాలు ఉన్నాయని సమర్థించుకున్నారు.
తాము భయపడే కొద్దీ వైసీపీ నాయకులు భయపెట్టేస్తూనే ఉంటారని పవన్ అన్నారు. ఖద్దరు వేసుకున్నంత మాత్రాన పొలిటీషియన్ కాలేడని, తనలాగా సాదా సీదా దుస్తులతోనూ రాజకీయాలు చేయొచ్చని వైసీపీ నాయకులను ఉద్దేశించి చెప్పారు. వేసుకున్న దుస్తులు రాజకీయాలను నిర్దేశించలేవని వ్యాఖ్యానించారు.
ఉమ్మడి గోదావరి జిల్లాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ వైఎస్ఆర్సీపీ జెండా ఎగరకూడదంటూ పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఇలా తాను కోరుకోవడానికి గల కారణాలను ఈ నెల 30వ తేదీ నాటి సభలో వివరిస్తానని పేర్కొన్నారు. ప్రశాంతమైన గోదావరి జిల్లాల్లో అశాంతికి వైసీపీ నాయకులు కారణమౌతున్నారని అన్నారు.
ఇకపై మనం బాగుండాలంటే వైసీపీ పోవాలి.. జనం బాగుండాలంటే జగన్ పోవాలి అనే నినాదంతో పని చేద్దామని పవన్ కల్యాణ్ సూచించారు. వైసీపీ ఓటమి కోసం తన వద్ద మాస్టర్ప్లాన్ ఉందని, దాన్ని 30వ తేదీ నాటి సభలో వెల్లడిస్తానని అన్నారు. 2024లో వచ్చే ఎన్నికలే వైసీపీకి చివరి ఎన్నికలు కావాలని తాను బలంగా కోరుకుంటోన్నాని చెప్పారు.












Click it and Unblock the Notifications