సీఎం జగన్ వర్సెస్ పవన్ ..ఫిక్స్ అవుతుందెవరు: అందరి ఆమోదం తీసుకోవాలి: రాజధానిపై కొత్త మెలిక..!
జనసేన అధినేత పవన్ రాజధాని వ్యవహారంలో ఆచి తూచి స్పందిస్తున్నారు. ముందుగా ప్రభుత్వం రాజధాని పైన స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కమిటీల పేరుతో ప్రభుత్వ పెద్దల దాగుడు మూతలు ఆపాలని సూచించారు. ఇప్పుడు ఏర్పాటు చేయబోయే రాజధానికి ప్రతిపక్షం సహా అందరి ఆమోదం తీసుకోవాలని స్పష్టం చేసారు. అదే సమయంలో భూములు త్యాగం చేసి రోడ్డునపడ్డ రైతులకు అండగా నిలుస్తానని తేల్చి చెప్పారు. దీంతో..ఇప్పుడు ప్రతిపక్షాలు అమరావతితో రాజధాని కొనసాగించాలని కోరుతుంటే..పవన్ మాత్రం రాజధాని మార్పు పైన స్పష్టత కోరుతున్నారు. అదే సమయంలో అమరావతి రైతులకు అన్యాయం చేస్తే..సహించనని చెప్పటం ద్వారాతాను ఏ ప్రాంతానికి వ్యతిరేకం కాదనే సంకేతాలిస్తున్నారు.

పవన్ కళ్యాణ్ కొత్త మెలిక..
రాజధాని విషయంలో పవన్ కళ్యాణ్ కొత్త మెలిక పెట్టారు. ఇతర పక్షాల లాగా అమరావతి నుండి రాజధాని తరలింపుకు వ్యతిరేకమనే వాదన మాత్రం చేయటం లేదు. పాలన మొత్తం ఒకే చోట ఉండాలని సూచన చేస్తున్నారు. ఇదే సమయంలో పాలన కేంద్రీకరణ.. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని జనసేన కోరుకుంటుందని తేల్చి చెప్పారు. రాజధానిని ఎక్కడ పెడతారో స్పష్టంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. నాడు జగన్ సహా అందరూ అమరావతికి మద్దతిచ్చారని..ఇప్పుడు ఏర్పాటు చేయబోయే రాజధానికి ప్రతిపక్షం సహా అందరి ఆమోదం తీసుకోవాలంటూ కొత్త మొలిక పెట్టారు. దీంతో పాటే అమరావతి రైతులకు ఎలా న్యాయం చేస్తారో చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. కమిటీల పేరుతో ప్రభుత్వ పెద్దల దాగుడు మూతలు ఆపాలని పవన్ సూచించారు.

వైసీపీ నేతల విమర్శలకు సమాధానంగా..
పవన్ కళ్యాణ్ అమరావతి ప్రాంతంలో పర్యటన పైన వైసీపీ నేతలు విమర్శలు గుప్పించారు. దీనికి పవన్ ట్విట్టర్ ద్వారా సమాధానం ఇచ్చారు. అందులో..అమరావతి రోడ్లపై పవన్కల్యాణ్ ఎందుకు తిరుగుతున్నారని అంటున్న వారికి ఒక్కటే చెబుతున్నా. భూములు ఇవ్వబోమనే రైతులపై భూసేకరణ చట్టం ప్రయోగించవద్దని.. అలా చేస్తే ఉద్యమిస్తానని నాడు రైతుల పక్షాన పోరాడా. ఇపుడు భూములు త్యాగం చేసి రోడ్డునపడ్డ రైతులకు అండగా నిలుస్తున్నా. ప్రభుత్వం మారితే భూములిచ్చిన రైతుల పరిస్థితేమిటని నాడు భయపడ్డా. ప్రస్తుతం అదే నిజమవుతోంది. అధర్మం ఎక్కడో, జనసేన పోరాటం అక్కడ..ఉంటుందని చెబుతూ ప్రభుత్వం మారితే పరిస్థితేమిటని 2015 ఆగస్టు 23న పెనుమాక సభలో తాను చేసిన ప్రసంగాన్ని ఆయన ట్విట్టర్లోనూ ఉంచారు.

రాజధాని ప్రకటించాకే కార్యాచరణ
మూడు రాజధానుల ప్రకటనతో రాజకీయంగా టీడీపీ..జనసేనను ఇరకాటంలోకి వెళ్తాయని వైసీపీ నేతలు అంచనా వేసారు. అయితే, టీడీపీ ఎటువంటి సంశయం లేకుండా అమరావతికి జై కొట్టింది. ఇక, పవన్ కళ్యాణ్ అమరావతిలో రైతులకు మద్దతు ప్రకటించారు. అదే సమయంలో రాజధాని పైన స్పష్టత ఇచ్చిన తరువాత కార్యాచరణ ప్రకటిస్తానని స్పష్టం చేసారు. దీని ద్వారా ముందుగా ప్రభుత్వం ఏ నిర్ణయం అధికారికంగా ప్రకటించముందే..తాను స్పందించి ఒక ప్రాంత ప్రజలకు వ్యతిరేకం కాకూడదనేది పవన్ ఆలోచనగా తెలుస్తోంది. అయితే, అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తే మాత్రం జనసేన ఏ రకంగా తమ విధానం చెబుతుందనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారింది.












Click it and Unblock the Notifications