'పవన్'కు వ్యతిరేకంగా రోడ్డుపై నినాదాలు: ఫిల్మ్ చాంబర్ వద్ద డిస్ట్రిబ్యూటర్ అరెస్టు..
ఈరోజు సంపత్ కుమార్ ఫిల్మ్ ఛాంబర్ వద్ద నిరాహార దీక్ష చేస్తున్న సమయంలో కొంతమంది పవన్ కళ్యాణ్ మనుషులు వచ్చారు. నిరాహారదీక్ష చేస్తున్న ఆయన్ను బలవంతంగా అక్కడినుంచి బయటకు పంపించేశారు.
హైదరాబాద్: గతేడాది విడుదలైన పవన్ కళ్యాణ్ 'సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో.. కృష్ణా జిల్లాలో దాని పంపిణీ హక్కులు పొందిన సంపత్ కుమార్ అనే డిస్ట్రిబ్యూటర్ నష్టాల పాలయ్యాడు. ఈ చిత్రంతో తాను రూ.2కోట్లు నష్టపోయినట్లుగా ఆయన చెబుతున్నారు.
సర్దార్ చిత్రం తనకు నష్టాలను మిగల్చడంతో పవన్ తర్వాతి సినిమా 'కాటమరాయుడు'ను తక్కువ ధరకే ఇస్తామని చెప్పి.. తీరా ఇప్పుడు ఇవ్వకుండా మోసం చేశారని సంపత్ కుమార్ ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో తనకు న్యాయం చేయాల్సిందిగా ఇప్పటికే పలుమార్లు మీడియాకు మొరపెట్టుకున్నాడు. తన డిమాండ్ కు ఎటువంటి స్పందన లేకపోవడంతో గత వారం రోజుల నుంచి ఆయన ఫిల్మ్ చాంబర్ లో నిరాహార దీక్ష చేస్తున్నారు.
ఇదే క్రమంలో ఈరోజు సంపత్ కుమార్ వద్దకు కొంతమంది పవన్ కళ్యాణ్ మనుషులు వచ్చారు. నిరాహారదీక్ష చేస్తున్న ఆయన్ను బలవంతంగా అక్కడినుంచి బయటకు పంపించేశారు. దీంతో ఏం చేయాలో అర్థం కాని సంపత్ కుమార్.. రోడ్డు పైనే బైఠాయించి పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
అనంతరం పోలీసులు అక్కడికి చేరుకుని అతన్ని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. సంపత్ కుమార్ విషయంలో ఇంతవరకు పవన్ కళ్యాణ్ గానీ కాటమరాయుడు నిర్మాత శరత్ మరార్ గానీ ఎటువంటి వివరణ ఇవ్వకపోవడం గమనార్హం.