కుల, మతాల నుంచి యూత్ వరకు..: పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు
ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచిన హార్వార్డ్ విశ్వవిద్యాలయంలో ప్రసంగించేందుకు అమెరికాలో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బిజీబిజీగా గడుపుతున్నారు.
విజయవాడ: ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచిన హార్వార్డ్ విశ్వవిద్యాలయంలో ప్రసంగించేందుకు అమెరికాలో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బిజీబిజీగా గడుపుతున్నారు.
ఆయన పలుచోట్ల ప్రసంగించారు. ఇందులో భాగంగా ఆయన ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నారు.
పవన్ కళ్యాణ్ ఇంటర్వ్యూ ఒకటి జనసేన పార్టీ ట్విట్టర్లో పెట్టింది. ఈ సందర్భంగా పవన్ పలు విషయాలు మాట్లాడారు. హార్వార్డ్ వర్సిటీలో మాట్లాడే అవకాశం తనకు వస్తుందని తాను అనుకోలేదని చెప్పారు.
https://t.co/4QxQsTqZMF Check out the exclusive video in which Pawan Kalyan answers to several questions at the Harvard University.
— Jana Sena (@thejanasena) February 13, 2017
న్యూక్లియర్ ప్లాంట్
అమెరికాలో పవన్ కళ్యాణ్ న్యూక్లియర్ ప్లాంట్ను సందర్శించారు. దీనిపై ప్రశ్నించగా.. శ్రీకాకుళం జిల్లాలో ఏర్పాటు చేస్తున్న ప్లాంటు పైన చాలా ఫిర్యాదులు వచ్చాయని, దీని పైన మాట్లాడాలని తనకు చాలామంది చెప్పారని పవన్ చెప్పారు. ఏ సబ్జెక్ట్ పైన అయినా మాట్లాడాలంటే తాను అవగాహన చేసుకొని మాట్లాడుతానని చెప్పారు. అవగాహన లేకుండా మాట్లాడనని చెప్పారు. కాబట్టి న్యూక్లియర్ ప్లాంట్ను విజిట్ చేశానని చెప్పారు.
జనసేన వెంట ఉంటామన్న ఎన్నారైలు..
చాలామంది ఎన్నారైలు జనసేన వెంట నడిచేందుకు సిద్ధమయ్యారనే అంశంపై పవన్ కళ్యాణ్ స్పందించారు. తాను వారికి ఓ ఎన్నారై ప్లాట్ ఫాం క్రియేట్ చేస్తానని, భారత్ వెళ్లాక ఈ పని చేస్తానని, ఎవరెవరికి దేని పైన ఎంత అవగాహన ఉందో, ఎలా పని చేయగలరో పరిశీలిస్తానని చెప్పారు.
కుల, మతాలను అరికట్టలేం
భారత దేశంలో ఉన్న కుల, మతాలను అరికట్టలేమని చెప్పారు. అది మానసిక ప్రవృత్తి అన్నారు. అయితే ఇవి పరిమిత స్థాయిలో ఉండాలని, అభివృద్ధికి ఆటంకం కలిగించేలా ఉండవద్దన్నారు. దానిని పూర్తిగా నిర్మూలించలేమని చెప్పారు.
రాజకీయ పార్టీలపై..
రాజకీయ పార్టీలు ఏవైనా మొదట వచ్చినప్పుడు ఉన్నత ఆశయాలతోనే వస్తాయని పవన్ కళ్యాణ్ చెప్పారు. అయితే, ఆ తర్వాత మాత్రం పక్కదారి పడుతుందన్నారు. అధికారం కోసం ఆ తర్వాత వాళ్లు పోటీ పడతారన్నారు. పార్టీలు పవర్ కోసం కాదని జనసేన తరఫున సాధ్యమైనంత వరకు నేను ప్రయత్నాలు చేస్తానని చెప్పారు.
మీరు రండీ అనేకంటే..
యువత చదువుకు ఆటంకం కలిగించకుండా, వారి అభివృద్ధికి మనం పని చేయాలని, అలాగే వారిని రాజకీయాల్లో ఇన్వాల్వ్ చేయాలన్నారు. యువత ముందుకు రావాలంటే మనం వ్యక్తిగతంగా నడిచి చూపెట్టాలన్నారు. మీరు రండి అనడం కంటే.. మనం మంచి దారిలో నడిచి చూపిస్తే.. అప్పుడు వారికి నచ్చి రావొచ్చునని చెప్పారు.
నోట్ల రద్దుపై..
నోట్ల రద్దు వల్ల చాలామంది సామాన్యులు ఇబ్బంది పడ్డారని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఓ డెంటిస్ట్ తన పేషెంటును నొప్పి ఎక్కడ ఉందో అడిగి చికిత్స చేయాలి కానీ, తనకు నచ్చిన చోట చేయవద్దన్నారు. నోట్ల రద్దు విషయంలోను అంతే అన్నారు. కసరత్తు చేయకుండా నోట్ల రద్దు చేస్తే ఎలాగని ప్రధాని మోడీని పరోక్షంగా నిలదీశారు.
సమస్యలపై.. సంతోషమే..
పలు సమస్యల పైన తాను స్పందిస్తున్నానని, దానికి ప్రభుత్వాలు కూడా ఎంతోకొంత స్పందిస్తున్నాయని పవన్ కళ్యాణ్ అన్నారు. తాము సమస్యలను లేవనెత్తుతున్నామని, వాటికి ప్రభుత్వాలు స్పందించడం సంతోషమే అన్నారు. సంపూర్ణంగా అంటే సమయం పడుతుందన్నారు.
జనసేనాని తరఫున..
భారత దేశంలోని తన ఊళ్లకు, ప్రజలకు ఎంతోకొంత చేయాలని ఎన్నారైలు తపన పడుతున్నారని, అందుకు తాము సంతోషపడుతున్నామని, అయితే వారి కృషికి జనసేన, ఇతర పార్టీలు ఎంతోకొంత ఫళితం వచ్చేలా రైట్ డైరెక్షన్ ఇవ్వాలని కోరుకుంటున్నానని చెప్పారు.
ఒక్కటే అన్న భావన లేదు
నిజానికి భారత దేశ ప్రజల్లో మేమంతా ఒక్కటి అన్న భావన లేదని పవన్ కళ్యాణ్ మరో సందర్భంలో అన్నారు. కులం, మతం, భాష ప్రాంతాల వారిగా విడిపోయారని చెప్పారు. ఉత్తరాది నేతలకు దక్షిణ భారత దేశం గురించి తెలియదని చెప్పారు. ఓట్ల కోసం నేతలు ప్రజల్లో విభజన భావాలు రేపుతున్నారన్నారు. అందుకే ప్రజల్లో తాము భారతీయులం అన్న భావన రావడం లేదన్నారు.
మన దేశంలో నాగాలాండులో ఏం జరుగుతుందో చాలామందికి తెలియదన్నారు. అదే అమెరికాలో ఏం జరుగుతుందో చాలామందికి తెలుసునని చెప్పారు.
మహిళా భద్రతపై..
భారత దేశంలో మహిళా భద్రత ప్రధాన సమస్య అని పవన్ అన్నారు. రాత్రిపూట కాదు, పట్టపగలే మహిళలు బయటకు రాలేని పరిస్థితి అన్నారు. మహిళల రక్షణ కోసం పటిష్టమైన చట్టాలు రూపొందించాలన్నారు. మహిళలు ఎన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నారో చిన్నప్పటి నుంచి చూస్తున్నానని చెప్పారు. ఏదైనా ఘటన ఢిల్లీలో జరిగితేనే ప్రభుత్వంలో కదలిక వస్తుందన్నారు.
అందుకే ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష
ఉమ్మడి ఏపీలో ఇచ్చిన హామీలు అమలు చేయక పోవడం వల్లే ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష ప్రారంభమయిందని పవన్ తెలంగాణ ఉద్యమాన్ని ఉద్దేశించి చెప్పారు. అప్పటి పాలకులు చేసిన పొరపాట్లకు ఈ జనరేషన్ శిక్ష అనుభవిస్తోందని చెప్పారు. మనం పడిన ఇబ్బందులు భవిష్యత్తు తరాలు పడకూడదన్నదనే తన ఉద్దేశ్యమని చెప్పారు.
అందుకే రాజకీయాల్లోకి వచ్చా
దేశానికి, ప్రజలకు సేవ చేసేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చానని పవన్ కళ్యాణ్ చెప్పారు. లక్షలాది ప్రజలు జల్లికట్టు కోసం ఉద్యమించారని చెప్పారు. విభజన సమయంలో అటువంటి పరిస్థితే తెలంగాణ, ఏపీల్లో కనిపించిందన్నారు.
కసరత్తు లేకుంటే..
నోట్ల రద్దు వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని పవన్ చెప్పారు. ముందస్తు కసరత్తు చేయకుంటే ఇలాగే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. సామాన్యుడికి దక్కాల్సిన ఫలాలను చాలామంది పెద్ద మనుషులు తమ జేబుల్లో వేసుకున్నారని చెప్పారు. బళ్లారిలోని ఐరన్ ఓర్ తవ్వకాలే అందుకు నిదర్శనమని చెప్పారు.