ముద్రగడ దీక్ష: పవన్ కల్యాణ్ రాజకీయాలకు పెద్ద దెబ్బ
విజయవాడ: కాపు ఉద్యమ నేత ముద్రగడ దీక్ష జనసేన అధినేత పవన్ కల్యాణ్కు పరీక్ష పెడుతోంది. ఒక కులానికి చెందినవాడిని, తాను అందరివాడినని అనిపించుకోవడానికి ప్రయత్నిస్తూ కాపు సమస్యలపై అంటీ ముట్టున్నట్లు ఆయన వ్యవహరిస్తున్నారు. ముద్రగడ దీక్షపై పీటముడి పడిన నేపథ్యంలో చిరంజీవి, దాసరి నారాయణ రావు, పల్లంరాజు వంటి కాపు నేతలు పార్టీలకు అతీతంగా ఏకమవుతున్నారు.
ఈ స్థితిలో పవన్ కల్యాణ్ స్పందన కోసం కాపులు వేచి చూస్తున్నారు. ఆయన ప్రతిస్పందించాలని తెలంగాణ కాపు నేత వి. హనుమంతరావువంటి నాయకులు కూడా అడుగుతున్నారు. కానీ, ఆయన బయటకు రావడం లేదు. ఆయనకు సినిమా షూటింగ్లు కూడా లేవని తెలుస్తోంది. గతంలో ఓసారి మీడియా ముందుకు వచ్చి, చంద్రబాబు హామీ ఇచ్చారు కాబట్టి కాపు రిజర్వేషన్ల సమస్యను పరిష్కరించాలని ఆయన అన్నారు.
భవిష్యత్తులో పవన్ కల్యాణ్ తన పార్టీని ప్రజల ముందు పరీక్ష, పెట్టాలని అనుకున్నప్పుడు ప్రస్తుత పరిస్థితి ఆయనకు పెద్ద ఆటంకంగా మారే ప్రమాదం ఉంది. అది ఒక్క కులానికి సంబంధించిన అంశంగా మాత్రమే లేదు, రాజకీయాంశంగా మారింది. రాజకీయంగా అటో ఇటో తేల్చుకోవాల్సిన పరిస్థితిని ముద్రగడ తన దీక్ష ద్వారా కల్పించారు.

ఎస్సీల వర్గీకరణపై, తెలంగాణ అంశంపై చిరంజీవి తన ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు స్పష్టమైన వైఖరి ప్రదర్శించకపోవడం వల్ల ఆయన రాజకీయాలు ముందుకు సాగలేదనే విషయాన్ని గుర్తిస్తే ఇప్పుడు కాపుల సమస్యపై పవన్ కల్యాణ్ తప్పకుండా స్పందించాల్సిన అవసరం ఉంటుంది.
పవన్ కల్యాణ్ ఇలాగే మౌనం వహిస్తే ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి అనుకూలంగా ఉన్నారనే సంకేతాలు మరింత బలంగా వెళ్లడం ఖాయం. ఇప్పటికే పవన్ కల్యాణ్ జోరు కాస్తా తగ్గినట్లు అర్థమవుతోంది. పవన్ కల్యాణ్ తనకు వీలైన సమయంలో వచ్చి తనకు నచ్చిన విషయాలు మాట్లాడి వెళ్తారని, సమస్యల పరిష్కారానికి రంగంలోకి దిగరనే అభిప్రాయం బలంగా నాటుకుపోతున్న పరిస్థితి ఉంది.
ఇప్పుడు పవన్ కల్యాణ్ ముందుకు రాకపోతే 2019 ఎన్నికల్లో జనసేన పార్టీతో పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వచ్చినా తగిన ఫలితం ఉండదనే అభిప్రాయాన్ని రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. సమస్య ఉన్నప్పుడే రాజకీయ నాయకుడు సరైన నిర్ణయం తీసుకుని, తగిన విధంగా వ్యవహరించాల్సి ఉంటుంది. సమస్యలను దాటేయడం వల్ల రాజకీయాల్లో రాణించలేరనే విషయాన్ని పవన్ కల్యాణ్ గుర్తించాల్సి ఉంటుంది.
కాపుల సమస్యపై మాట్లాడితే మిగతా వర్గాలకు దూరమవుతాననే ఆందోళన పవన్ కల్యాణ్కు ఇప్పుడు ఉండాల్సిన అవసరం లేదు. నిర్దిష్టమైన సమస్యలపై నిర్దిష్టంగానే స్పందించి, ముందుకు సాగాల్సి ఉంటుంది. లోకసత్తా వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణ లాగా విశ్వసజనీనమైన, అమూర్తమైన విషయాల గురించి మాట్లాడితే రాజకీయాల్లో రాణించడం కష్టమే. పవన్ కల్యాణ్ ఏం చేస్తారనే విషయంపైనే ఇప్పుడు ఆసక్తి ఉంది.












Click it and Unblock the Notifications