నా చావుకు పవన్ కళ్యాణ్, టిడిపినే: బాబు కటౌట్ ఎక్కి అభిమాని హల్చల్, మొహం చెల్లకే
విజయవాడ: కృష్ణా జిల్లాలోని విజయవాడ స్వరాజ్ మైదానంలో ఓ రైతు వంద అడుగుల ఏపీ సీఎం చంద్రబాబు కటౌట్ ఎక్కి పోలీసులకు కొద్దిసేపు ముచ్చెమటలు పట్టించాడు. తనకు సాయం చేయాలంటూ అతను సూసైడ్ నోట్ రాసి కటౌట్ ఎక్కాడు. అనంతరం పోలీసుల జోక్యంతో కిందకు దిగాడు.
కటౌట్ ఎక్కిన రైతు కర్నూలు జిల్లాలోని అడ్డకల్లుకు చెందిన గోవింద రాజులుగా గుర్తించారు. మరో విషయమేమంటే అతను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమాని అని తెలుస్తోంది. ఆయన చంద్రబాబు కటౌట్ ఎక్కడంతో కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది.
కటౌట్ పైకెక్కిన రైతు గోవిందరాజులు ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. సూసైడ్ నోట్ రాసి పెట్టాడు. వ్యవసాయంలో నష్టం, బాధిస్తున్న క్యాన్సర్ వ్యాధి, ఆర్థిక సమస్యలే కారణమని రాశాడు.
తాను ముఖ్యమంత్రిని కలిసేందుకు కర్నూలు జిల్లా నుంచి వచ్చానని, పోలీసులు అనుమతించడం లేదని అందుకే తీవ్ర మనస్తాపం చెందానని ఆయన చెప్పాడు. వ్యవసాయంలో తనకు దాదాపు మూడు లక్షలకు పైగా అప్పులయ్యాయని, వీటిని ముఖ్యమంత్రికి చెప్పుకోవడానికి వస్తే పోలీసులు అనుమతించలేదన్నాడు.
తనను చంద్రబాబుతో మాట్లాడేందుకు అనుమతిస్తానని హామీ ఇస్తేనే కిందకు దిగుతానని చెప్పాడు. దీంతో పోలీసులు... ఈ రోజు మంత్రివర్గ సమావేశం ఉందని, మధ్యాహ్నం మూడు గంటల తర్వాత ముఖ్యమంత్రి సందర్శకులను కలుస్తారని అప్పుడు కలవొచ్చని సూచించారు. దీంతో అతను కిందకు దిగాడు. అతనిని వాహనంలో ఎక్కించుకొని తీసుకెళ్లారు.
అతను తన సూసైడ్ నోట్లో... తాను పవన్ కల్యాణ్ అభిమానినని, పవన్ చెప్పిన మాటలను విని టీడీపీ తరపున పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి వార్డ్ మెంబర్గా కూడా గెలిచానని, వ్యవసాయంలో వచ్చిన నష్టాలతో పాటు, క్యాన్సర్ వ్యాధి నన్ను బాధిస్తోందని, తనకు ఆర్థిక కష్టాలు పెరిగి పోయాయని, అందుకే ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నానని పేర్కొన్నాడు.
గోవింద రాజు పూర్తి లేఖ పాఠం.... 2014కు ముందు నేను ఏ పార్టీలో చేరలేదు. కనీసం టిడిపికి అభిమానిని కాదు. కానీ ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో ఆయన మాటలు నమ్మి టిడిపి కోసం ప్రచారం చేశాను. దళిత సమాఖ్య అధ్యక్షుడిగా ఉంటూ మా వార్డు వాళ్లతో టిడిపికి ఓటు వేసేలా ప్రచారం చేశాను.
సర్పంచ్ ఎలక్షన్లు, ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా టిడిపిని గెలిపించేందుకు కృషి చేశాను. వార్డు పరిధిలో సిమెంట్ రోడ్లు వేయిస్తామని, పింఛన్లు ఇప్పిస్తామని ప్రజలకు చెప్పి ఓట్లు వేయించాను. కానీ టిడిపి అధికారంలోకి వచ్చాక ఇప్పటికీ ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదు. దీంతో జనాల్లో తలెత్తుకొని తిరగలేకపోతున్నా.
గతంలో చేసిన అప్పులు.. ఇప్పుడు తీర్చాలని అప్పుల వాళ్లు ఒత్తిడి చేస్తున్నారు. దీంతో ఇంటి దగ్గర నాతో కలిసి ఉండాలంటే మొహం చెల్లక నా భార్య, పిల్లలను విడిచి వెళ్లిపోతున్నాను. పవన్ అన్నయ్య మాత్రం నా గుండెల్లో ఉన్నాడు. ఆయన అభిమానిని అని చెప్పుకోవడానికి గర్వపడ్తున్నా. నా కుటుంబానికి టిడిపి అన్ని విధాలా న్యాయం చేయాలి. నా మరణానికి సమాధానం చెప్పాల్సిన ఇద్దరు... ఒకరు పవన్ కళ్యాణ్, మరొకరి టిడిపి పార్టీ.