పవన్ కల్యాణ్ రైతు సౌభాగ్య దీక్ష:పంటకు గిట్టుబాటు ధర ఇవ్వాల్సిందే, రైతుల అల్టిమేటం
Recommended Video
పండించిన పంటకు గిట్టుబాటు ధర రావడం లేదని రైతులు వాపోయారు. ఏ ప్రభుత్వం, ఏ నేత కూడా తమ గోడు పట్టించుకోవడం లేదన్నారు. గురువారం జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన రౌతు సౌభాగ్య దీక్షలో రైతుల మాట్లాడారు. కాకినాడ జేఎన్టీయూ ప్రాంగణం సమీపంలో పవన్ కల్యాణ్ చేపట్టిన దీక్ష సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. ఆచార్య ఎన్జీ రంగా వర్సిటీ, స్వామినాథన్ కమిటీ నివేదిక ప్రకారం క్వింటాల్ వరి రూ.2500 చెల్లించాలని చెప్తున్న ప్రభుత్వాలు మీనమేషాలు లెక్కిస్తున్నాయని చెప్పారు.
మద్దతు ధర కోసం..
75 కేజీల బస్తాకు కనీసం రూ.2200 ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. వ్యవసాయ సామాగ్రి ధరలు పెరిగిపోయాయని రైతులు చెప్తున్నారు. ఎకరా ట్రాక్టర్ ఖర్చు రూ.2500 అవుతుందని చెప్పారు. కోత మిషన్కు రూ.3 వేలు వ్యయం చేయాల్సి వస్తోందని చెప్పారు. ఇన్ని ఇబ్బందులు పడి పంట పండిస్తే 35 బస్తాలు చేతికొస్తాయని చెప్తున్నారు. కౌలు తీసి, పెట్టుబడి ఖర్చు తీయగా.. రైతు తానేం తినాలో అర్థం కావడం లేదన్నారు. పంట రంగు మారిందని చెప్పి మరో రూ.50 తగ్గిస్తున్నారని రైతులు నిట్టూరుస్తున్నారు. అన్నీ భరించి పంటను విక్రయించి ఇంటికొచ్చినా బ్యాంకు ఖాతాలో నగదు పడటంలోనూ జాప్యం ఏర్పడుతుందని చెప్పారు.
రైతుల కోసం
రైతు కష్టాలు చూసి చలించిపోయినా పవన్ కల్యాణ్ రైతుల కోసం దీక్షకు దిగారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు ముత్తా శశిధర్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని 45 లక్షల మంది రైతుల కోసం పోరాడుతున్నారని చెప్పారు. రైతులకు సత్వరమే నగదు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
వెన్నులో వణుకు
ప్రజల కష్టాలను తెలుసుకునేందుకు పవన్ కల్యాణ్ అలుపెరగని పోరాటం చేస్తున్నారని మరో నేత వేగుళ్ల లీలాకృష్ణ అన్నారు. పవన్ కల్యాణ్ ఇసుకపై పోరాటం చేస్తానని చెప్పేసరికి ప్రభుత్వం భయపడిపోయిందన్నారు. విశాఖలో నిల్వ చేసిన ఇసుకను కూడా వదిలేశారని తెలిపారు. ఇప్పుడు ఉల్లి గురించి మాట్లాడటంతో బ్లాక్ చేసిన ఉల్లి కూడా వదిలేస్తారని తెలిపారు. టమాట రైతుల సమస్యలపై పోరాడితే ప్రభుత్వం స్పందించిందని చెప్పారు. మంత్రి కొడాలి నాని సీఎం జగన్కు ఏజెంట్, బ్రోకర్లా పనిచేస్తున్నారని జనసేన నేతలు విమర్శించారు.
మారని పరిస్థితి
దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు అవుతున్న వ్యవసాయదారుని పరిస్థితి మారలేదని అమలపురానికి చెందిన అడ్డాల గోపాలకృష్ణ అన్నారు. ఆహార ధాన్యాల విషయంలో స్వయం సమృద్ధి సాధించాం, మిగులు గింజలు విదేశాలకు పంపిస్తున్నాం, కానీ రైతు పరిస్థితి మాత్రం మారడం లేదన్నారు. ఆరునెలలు కష్టపడి పంట పండిస్తే ఎకరాకు రూ.5 వేల నష్టం వస్తుందని చెప్తున్నారు.
మాటలే
రైతులకు అదీ చేస్తాం, ఇదీ చేస్తాం అని ఊదరగొట్టే నేతలు.. ఎన్నికలు ముగిసినా తర్వాత పట్టించుకోవడం లేదని మరో నేత అన్నారు. రైతుల బాగోగులను పట్టించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రైతులు రోడ్లమీదికొస్తే ఏ ప్రభుత్వాలు ఏం చేయలేని పరిస్థితి అని హెచ్చరించారు.