ఇప్పటంలో ఇళ్ల కూల్చివేతలు-పవన్ సభకు చోటిచ్చినందుకే ! సర్కారూ అలాగే కూలుతుందని హెచ్చరిక
ఏపీలో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాల్ని కూడగడతానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించిన సభకు చోటిచ్చిన గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామంలో ఇవాళ అధికారులు కూల్చివేతల పర్వం మొదలుపెట్టారు. గ్రామంలో స్ధానికులు కోరుకోకపోయినా రోడ్డు విస్తరణ పేరుతో ఇళ్ల కూల్చివేతలకు దిగారు. దీంతో వారు అడ్డగించేందుకు ప్రయత్నించారు. చివరికి పలువురిని అరెస్టుచేసి మరీ తమ పని కానిచ్చేశారు. దీనిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రంగా మండిపడ్డారు.
ఇప్పటంలో పవన్ బహిరంగసభ
గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పరిధిలోకి వచ్చే ఇప్పటం గ్రామంలో పవన్ కళ్యాణ్ గతంలో జనసేన ఆవిర్భావ సభ నిర్వహించారు. ఈ సభకు తమ గ్రామంలో స్ధలం ఇచ్చేలా అక్కడి వారిని జనసేన నేతలు ఒప్పించారు. దీనికి ప్రతిఫలంగా ఆ సభలోనే పవన్ కళ్యాణ్ ఆ గ్రామ అభివృద్ధికి రూ.50 లక్షల సాయం ప్రకటించారు. అప్పట్లో ఇదో సంచలనంగా మారింది. పవన్ కోరుకుంటే మరో చోట ఉచితంగానే సభ పెట్టుకునే అవకాశం ఉన్నా ఇప్పటం గ్రామంలో స్ధానికుల కోరిక మేరకు అక్కడే సభ నిర్వహించడమే కాకుండా నిధుల సాయం చేశారు. అయితే ఆ డబ్బుల్ని తమ ఖాతాలో జమ చేయాలంటూ సీఆర్డీయే అధికారులు వింత డిమాండ్ పెట్టారు. దీనిపై జనసేన తీవ్ర అభ్యంతరం తెలిపింది. ఇప్పటం గ్రామస్దులు కూడా ఒప్పుకోలేదు. దీనిపై అధికారులు ఆగ్రహంగా ఉన్నారు.
కూల్చివేతలకు దిగిన అధికారులు
తాడేపల్లి మండలంలోని ఇప్పటం గ్రామంలో ఇవాళ అకస్మాత్తుగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీనికి కారణం అధికారులు ఈ గ్రామంలో రోడ్డు విస్తరణ పనులు చేపట్టడమే. గ్రామంలో రోడ్డును విస్తరించి 120 అడుగుల రోడ్డు చేస్తున్నామంటూ.. దీనికి అడ్డొచ్చిన ఇళ్లను జేసీబీలకు కూల్చివేయడం ప్రారంభించారు. దీంతో స్ధానికులు అడ్డుకున్నారు. తమ నివాస స్ధలాలు పోతున్నాయని, తమకు 120 అడుగుల రోడ్డు వద్దని వారించారు. అయినా అధికారులు పట్టించుకోలేదు. దీంతో వారు జేసీబీలకు అడ్డుతగిలారు. అక్కడ ఉద్రిక్త పరిస్ధితులు తలెత్తడంతో పోలీసులు 10 మందిని అదుపులోకి తీసుకున్నారు.
కూల్చివేతలపై పవన్ తీవ్ర ఆగ్రహం
ఇప్పటంలో ఇళ్ల కూల్చివేతపై పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కూల్చివేతల ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుందని హెచ్చరించారు. వాళ్లకు ఓటేయనివారు శత్రువులన్నట్లుగా ప్రభుత్వ తీరు ఉందన్నారు.మనవారు కానివారిని 'తొక్కి నార తీయండి' అనేలా ఏపీలో పాలన ఉందని పవన్ విమర్శించారు. వాళ్లకు ఓటేసిన 49.95 శాతం మందే పాలకులం అన్నట్లుగా ఉందన్నారు. ఇప్పటంలో రహదారి విస్తరణ పేరుతో జరుగుతోంది అరాచకమేనని పవన్ ఆరోపించారు. ఇప్పటికే 70 అడుగుల రోడ్దు ఉంటే ఇంకా విస్తరణేంటి? అన్నారు. రహదారి విస్తరణ వంకతో ఇళ్లు తొలగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కూల్చివేత నోటీసులపై గ్రామస్థులు ఇప్పటికే కోర్టుకు వెళ్లారని, ఆగమేఘాల మీద ఇళ్ల కూల్చివేత చేపట్టారన్నారు.
ఇప్పటంలో ఇళ్ల కూల్చివేతలు-పవన్ సభకు చోటిచ్చినందుకే..!! pic.twitter.com/LLsHbBs7FR
— oneindiatelugu (@oneindiatelugu) November 4, 2022