ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే చూస్తూ ఊరుకోం: చంద్రబాబుపై పవన్ ఆగ్రహం, ఫ్యాన్స్ అత్యుత్సాహం
హైదరాబాద్: అభివృద్ధి పేరుతో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే ఊరుకునేది లేదని ఏపీ ప్రభుత్వాన్ని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. భూసేకరణ చట్టం ప్రకారం నిర్వాసితులకు పరిహారం ఇవ్వాల్సిందేనని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు.
నిర్వాసితులకు పరిహారం అందేవరకు వారి పక్షాన జనసేన నిలబడుతుందని స్పష్టం చేశారు. నగరంలోని హైరోడ్డు విస్తరణ నిర్వాసితుల పక్షాన పోరాడేందుకు మంగళవారం ఆయన చిత్తూరులో పర్యటించారు.

చూస్తూ ఊరుకోను
‘అభివృద్ధి ముసుగులో ప్రజలకు అన్యాయం చేస్తున్నారు. చూస్తూ ఊరుకోను. పట్టాలున్న వారికి పరిహారం అందించకపోవడం దారుణం. సొంత జిల్లా ప్రజలకు న్యాయం చేయలేని ముఖ్యమంత్రి రాష్ట్రానికేం చేస్తారని...' సీఎం చంద్రబాబును పవన్ నిలదీశారు.

బాధ కలిగింది..
నిర్వాసితులంతా టీడీపీ మద్దతు దారులైనప్పటికీ, స్థానిక నాయకులు పట్టించుకోకపోవడంతో తన వద్దకు వచ్చారని, ఈ విషయం చాలా బాధ కలిగించిందని పవన్ తెలిపారు. చిత్తూరులో షుగర్ ఫ్యాక్టరీ, విజయా డైయిరీ మూతేశారని.. ఇలాంటి మరెన్నో సమస్యలపై త్వరలో చేపట్టే జిల్లాల యాత్రలో మాట్లాడుతానన్నారు.

అభిమాని ఒక్కసారిగా.. తూలిపడ్డ పవన్
కాగా, పూతలపట్టు మండలం రంగంపేటక్రాస్ వద్ద ఓ అభిమాని సెక్యూరిటీ సిబ్బందిని లెక్కచేయకుండా కారుపైకి దూసుకుపోయి పవన్ను గట్టిగా పట్టుకున్నాడు. పట్టు తప్పిన ఆయన ఆ అభిమానితో పాటు కారుపై పడ్డాడు. వెంటనే సెక్యూరిటీ సిబ్బంది అతడిని కిందకు తోసేశారు. పరిస్థితిని గమనించిన పవన్ కారు లోపలికి వెళ్లిపోయారు.

శ్రీకాళహస్తిలో పవన్.. గందరగోళ:
మంగళవారం పవన్ కళ్యాణ్ శ్రీకాళహస్తీశ్వరాలయాన్ని సందర్శించారు. ఆలయంలో పాతాళ వినాయకస్వామిని తొలుత దర్శించుకున్నారు. ఆయన్ను చూసేందుకు వచ్చిన యువకుల అత్యుత్సాహం, తోపులాటలు, ఆలయ ఆవరణలో పవన్ జిందాబాద్.. కాబోయే ముఖ్యమంత్రి జిందాబాద్ అంటూ.. కేకలు, నినాదాలు చేస్తూ గందరగోళం సృష్టించారు.

పవన్కూ ఇబ్బంది కలిగించారు..
ఈ క్రమంలో భక్తులను నియంత్రించేందుకు వీలుగా.. ఆలయంలోని మహద్వారం తలుపులను ఒకటి పూర్తిగా, మరొకటి పాక్షికంగా మూసి వేయడంపై ఇతర భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమ్మవారి ఆలయ ప్రవేశ ద్వారం తలుపు ఒక దానిని మూసివేయడంపై అర్చకులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో తీశారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కూడా ప్రశాంతంగా స్వామి, అమ్మవార్లను దర్శించుకోలేకపోయారు. ఆయన దర్శనం పూర్తయ్యే వరకు క్యూలైన్లు నిలిపి వేయడంతో సామాన్య భక్తులకు కొంత ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడింది.












Click it and Unblock the Notifications