రాజులే మారారు, దోపీడీ..: ఏపీ, తెలంగాణపై పవన్ ఫైర్, ‘పరకాలకు గుణపాఠమే’
Recommended Video
విశాఖపట్నం: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం తన విశాఖపట్నం పర్యటనలో కేంద్రం ప్రభుత్వంతోపాటు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను లక్ష్యంగా చేసుకుని విమర్శలు ఎక్కుపెట్టారు. తన ప్రసంగంలో వివిధ అంశాలను ప్రస్తావించారు. ప్రభుత్వాల వైఖరితో సామాన్యులు, నిజాయితీపరులే కష్టాలు ఎదుర్కొంటున్నారని అన్నారు.
ప్రజారాజ్యం పార్టీ, రాష్ట్ర విభజన, తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు గురించి, దివంగత సీఎం వైయస్ గురించి కూడా పవన్ తన ప్రసంగంలో ప్రస్తావించడం గమనార్హం. ప్రజా సమస్యలపై గళమెత్తుతానన్న వపన్.. మూడు రోజులపాటు ఉత్తరాంధ్ర, ఒంగోలు పర్యటనకు వచ్చారు.
ఆంధ్రోళ్లు దోచుకున్నారని చెప్పి.. మళ్లీ అదేపని
ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. ‘రాజకీయ వ్యవస్థలో జరుగుతోన్న తప్పులు నాకు తెలుసు. పోలవరంలో అవినీతి జరిగిందని ఇప్పుడు మాట్లాడుతున్నారు. తెలంగాణలో అప్పట్లో నీటి పారుదల ప్రాజెక్టుల్లో ఆంధ్రావాళ్లు దోచుకుంటున్నారని పంపించేశారు. ఇప్పుడు ఆ ప్రాజెక్టుల కాంట్రాక్టులను మళ్లీ ఆంధ్రావాళ్లకే తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది' అని పవన్ కళ్యాణ్ ఆరోపించారు.
యువత అంటే వారు కాదు..
అంతేగాక, ‘రాజులు మారారు కానీ, మళ్లీ దోపిడీ అదే జరుగుతోంది. ఏం మారలా.. ఒక దేశపు సంపద అంటే ఖనిజాలు కాదు, నదులు కాదు.. యువత మాత్రమే. వారే దేశ భవిష్యత్తుకి నాయకులు. అలాంటి యువత కోసం రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు? యువత అంటే నారా లోకేశ్ కాదు.. యువత అంటే ఓ దివంగత ముఖ్యమంత్రి కుమారుడు కాదు. యువతకు అవకాశాలు కల్పించాలంటే ఇటువంటి వారికి అవకాశాలు కల్పించడం కాదు. కొంతమంది యువత కష్టపడి చదువుకున్నా.. స్కాలర్ షిప్ రాక కొంతమంది సమస్యలు ఎదుర్కుంటున్నారు. జనసేన సైనికులు నేను తప్పు చేసినా నిలదీయాలి' అన్నారు.
స్వేచ్ఛ లేదన్న పరకాల
ప్రజార్యాజ్యం పార్టీలో స్వేచ్ఛలేదని అప్పట్లో పరకాల ప్రభాకర్ అన్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రజారాజ్యం పార్టీ కార్యాలయంలోనే పరకాల ప్రభాకర్ సదరు పార్టీని తిట్టాడని, పార్టీలో స్వేచ్ఛలేదని అన్నాడని అన్నారు. అంటే, ఆ పార్టీలో స్వేచ్ఛ ఉన్నట్లా? లేదా? అని ప్రశ్నించారు.
గుణపాఠం చెబుతా.
పరకాల ప్రభాకర్ లాంటి వారికి తగిన సమయంలో గుణపాఠం చెబుతానని పేర్కొన్నారు. కాగా, రాజకీయ ప్రక్రియలో తాను పొరపాట్లు చేయవచ్చని, కానీ తప్పు చేయనని పవన్ చెప్పుకొచ్చారు. ప్రజారాజ్యం పార్టీ ఓటమి తనకు బాధను కలిగించిందని అన్నారు. అందుకు కారణమైన ఏ ఒక్కరినీ తాను మర్చిపోలేనని అన్నారు. నాయకులకు సహనం, విజ్ఞత చాలా అవసరమని చెప్పారు.