పిఠాపురానికి నిధుల వరద.. రూపురేఖలు మారుస్తున్న ఏపీ డిప్యూటీసీఎం పవన్ కళ్యాణ్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాట ప్రకారం పిఠాపురం నియోజకవర్గం మార్చే పనిలో ఉన్నారు. పిఠాపురం నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయటం పైన దృష్టి సారించిన పవన్ కళ్యాణ్ కేంద్ర, రాష్ట్ర నిధులతో పిఠాపురానికి కొత్త రూపు సంతరించుకునేలా చేస్తున్నారు.
అమృత్ భారత్ పథకంలో భాగంగా రైల్వేస్టేషన్ ఆధునికీకరణ
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గంలో మౌలిక సదుపాయాలు, విద్య, వైద్యం, ఆధ్యాత్మికం, పారిశ్రామిక రంగాల్లో భారీ అభివృద్ధి పనులు జోరుగా కొనసాగుతున్నాయి. పిఠాపురంలో అమృత్ భారత్ పథకంలో భాగంగా రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులు జరుగుతున్నాయి. మొత్తం 37.25 కోట్ల రూపాయలతో పనులు చేస్తున్నారు.

వంద పడకల ఏరియా ఆసుపత్రి, 234 కోట్ల రూపాయలతో 400 రోడ్ల పనులు
అత్యాధునిక వసతులతో పిఠాపురం బస్టాండ్ ను అభివృద్ధి చేస్తున్నారు. పిఠాపురం మున్సిపాలిటీని సెలక్షన్ గ్రేడ్ స్థాయికి, గొల్లప్రోలు నగర పంచాయతీని గ్రేడ్-3 మున్సిపాలిటీ స్థాయికి మార్చారు. పిఠాపురంలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను వంద పడకల ఏరియా ఆసుపత్రి గా మార్చి, 34 కోట్ల రూపాయలతో అధునాతన వసతులను కల్పిస్తున్నారు. మొత్తం పిఠాపురం నియోజకవర్గం లో 400 రోడ్ల పనులు 234 కోట్ల రూపాయలతో చేస్తున్నారు.
376 కోట్ల రూపాయలతో నీటి సరఫరా
జల జీవన్ మిషన్ కింద 376 కోట్ల రూపాయలతో నీటి సరఫరాను పిఠాపురం నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలకు అందించే ప్రయత్నం చేస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కులు, ఫ్లాటెడ్ ఫ్యాక్టరీలు, గ్రీన్ అల్యూమినియం స్మెల్టర్ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేస్తున్నారు. ఒక్క కాకినాడ జిల్లాలో పవన్ కళ్యాణ్ 800 కోట్ల అంచనా వ్యయంతో రహదారి పనులు చేయించడానికి అవకాశం కల్పించారు.
487 మందికి ఉద్యోగ మేళాల ద్వారా ఉపాధి
ఇప్పటివరకు 487 మందికి ఉద్యోగ మేళాల ద్వారా ఉపాధి కల్పించారు. స్కిల్ హబ్ ను ఏర్పాటు చేసి యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తున్నారు. కోటి రూపాయలతో ఇండోర్ స్టేడియాన్ని ఆధునీకరిస్తున్నారు. ఉప్పాడ లో ప్రతిష్టాత్మక స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ ను ఏర్పాటు చేస్తున్నారు.
34 వేల 853 కోట్ల రూపాయల పారిశ్రామిక పెట్టుబడులు
నియోజకవర్గాన్ని పారిశ్రామిక హబ్ గా మార్చాలని సంకల్పంతో ఉన్న పవన్ కళ్యాణ్ 18 నెలల కాలంలో దాదాపు 34 వేల 853 కోట్ల రూపాయల పెట్టుబడులను పిఠాపురం నియోజకవర్గానికి తీసుకువచ్చారు. వీటితో 5000 మందికి ఉపాధి లభించనుంది. 20 కోట్ల రూపాయల నిధులతో నియోజకవర్గంలోని 19 ప్రధాన దేవాలయాలను పవన్ కళ్యాణ్ అభివృద్ధి చేస్తున్నారు. మొత్తంగా పిఠాపురం నియోజకవర్గ రూపురేఖలు మార్చి అన్ని రంగాలలోనూ పిఠాపురాన్ని ముందు వరుసలో నిలబెట్టనున్నారు.













Click it and Unblock the Notifications