బాబుకు తొలి షాక్: కన్నీళ్ల రాజధాని వద్దని పవన్ హెచ్చరిక, అవతలకి పో... ఆగ్రహం
ఉండవల్లి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గట్టి షాకిచ్చారు. గురువారం ఉండవల్లి రైతులతో మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వం పైన తీవ్రంగా స్పందించారు. తద్వారా చంద్రబాబుకు తొలి షాక్, అదీ గట్టిగానే ఇచ్చారు.
ఉండవల్లి గ్రామస్తుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడారు. మంత్రులు పత్తిపాటి పుల్లారావు, నారాయణలు ఉండవల్లి గ్రామస్తులకు ఇచ్చిన నోటీసులు ఆపాలని హెచ్చరించారు. అవసరమైతే నేను వచ్చి మాట్లాడుతానని చెప్పారు.
కన్నీళ్ల రాజధాని వద్దు
పంట పొలాలు అత్యవసర పరిస్థితిలో అయితే తప్ప, అదీ అయిదు శాతానికి మించి తాకవద్దని చెప్పారని గుర్తు చేశారు. రాజధానికి ఎన్ని ఎకరాలు కావాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాజధాని కోసం 33 వేల ఎకరాలు అవసరమా అని ప్రశ్నించారు.
తనకు కూడా గొప్ప రాజధాని కావాలని ఉందని చెప్పారు. అయితే, ప్రజల కన్నీళ్లతో వచ్చే రాజధాని అవసరం లేదన్నారు. ప్రజలు సంతోషంతో ఇచ్చే రాజధాని కావాలన్నారు. ఉండవల్లి గ్రామస్తుల సమస్యలను తాను ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రులు, రాజధాని కమిటీతో మాట్లాడుతానని చెప్పారు.

విజయవాడలో ఉంటా, ఇప్పటి నుండి నా సమస్య
రైతుల సమస్యల పైన మాట్లాడేందుకు తాను ఎన్ని రోజులైనా విజయవాడలో ఉండేందుకు సిద్ధమని చెప్పారు. మంత్రులు రైతుల సమస్యలను తెలుసుకోవాలన్నారు. తాను ఇప్పుడు పత్రికలో స్టేట్ మెంట్ కోసం రాలేదని, అయిదేళ్ల తర్వాత కూడా రాదల్చుకోలేదన్నారు. తాను ఇప్పటి నుండే రైతుల సమస్యలను తన సమస్యగా భావిస్తున్నానని చెప్పారు.
తాను రాజకీయాల్లోకి వచ్చింది ప్రజల కోసమే తప్ప.. పత్రికల్లో స్టేట్ మెంట్ల కోసం కాదన్నారు. ఈ క్షణం నుండే పోరాడుతానని చెప్పారు. ఉండవల్లి ప్రజలు రోడ్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, భూములు మాత్రం ఇవ్వడానికి సిద్ధంగా లేరన్నారు. అందుకు కారణం ఏమిటో తెలుసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు.
నేను చెప్పే వరకు భూమిలివ్వవద్దు
ప్రభుత్వంతో మాట్లాడతానని, నేను చెప్పే వరకు మీరు (ఉండవల్లి గ్రామస్తులు) మీ పొలాలు స్వాధీనం చేయవద్దని సూచించారు. రెవెన్యూ అధికారులు కూడా సహకరించాలన్నారు.
మీరు టీడీపీకి ఓటేశారా, వైసీపీకి ఓటేశారా అనవసరం
మీరు తన మాట విని తెలుగుదేశం పార్టీకి ఓటేశారా లేక వైసీపికి ఓటేశారా అనే విషయం తనకు అనవసరమన్నారు. దాంతో తనకు సమస్య లేదన్నారు. చాలామంది స్వచ్ఛంగా రాజధానికి భూమి ఇచ్చినప్పుడు, మిగతా వారు ఎందుకు ఇవ్వడం లేదో ప్రభుత్వం తెలుసుకోవాలన్నారు. ఈ విషయమై జనసేన పార్టీ తరఫున ప్రభుత్వం, మిగతా పార్టీలతో మాట్లాడుతామని చెప్పారు.
డెడ్ లైన్తో లాక్కోవద్దు
ఉండవల్లి గ్రామస్తులు రోడ్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, పచ్చని పంటపొలాలు మాత్రం ఇవ్వడానికి సిద్ధంగా లేరన్నారు. వారి నుండి భూములు డెడ్ లైన్ పేరుతో లాక్కోవద్దని ప్రభుత్వానికి సూచించారు. వారి సమస్యలు తెలుసుకోవాలన్నారు. టీడీపీ మంత్రులు, రాజధాని కమిటీతో మాట్లాడుతానని చెప్పారు. అన్యాయం ఎక్కడ జరిగినా తాను ప్రశ్నిస్తానని చెప్పారు. రాజధానికి భూమి ఇవ్వక పోవడంపై సమగ్ర చర్చ జరగాలన్నారు. ఒకింత ఆవేశంతో మాట్లాడిన పవన్.. జైహింద్ అంటూ తన ప్రసంగం ముగించారు.
అవతలకి పో.. పవన్ ఆగ్రహం
రాజధాని ప్రాంత రైతుల సమస్యలు తెలుసుకునేందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ ఉండవల్లి గ్రామస్తులతో మాట్లాడుతుండగా కొందరు వచ్చారు. వారు ఎందుకు వచ్చారో తెలియనప్పటికీ వారిపై ఆయన తీవ్ర ఆగ్రహం ప్రదర్శించారు. అవతలకి పో అంటూ మండిపడ్డారు. తాను ఇప్పుడు రైతుల కోసం వచ్చానని, మీకోసం రాలేదన్నారు. వారి కన్నీరు మీరు తుడుస్తారా అంటూ వారిని నిలదీశారు. కాగా, వారు పవన్ అభిమానులుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications