కొత్త మార్గం-పవన్ రూటే సపరేటు: యాత్రలో అస్త్రాలు, చంద్రబాబుకు దెబ్బకు దెబ్బ!
శ్రీకాకుళం/అమరావతి: శ్రీకాకుళం జిల్లా ఉద్ధానం సమస్యపై చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తాను ఇచ్చిన గడువులోగా స్పందించకపోవడంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పినట్లుగానే అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. శనివారం ఒక్కరోజు దీక్షకు పోలీసుల అనుమతికి దరఖాస్తు చేసుకున్నారు. పవన్ రెండు రోజులుగా స్థానికంగా ఉన్న ఓ రిసార్టుకు పరిమితమయ్యారు.
ఆయన రిసార్టుకు పరిమితం కావడం వెనుక రెండు కారణాలు ఉన్నాయని అంటున్నారు. భద్రతా సిబ్బంది గాయపడి కోలుకోకపోవడంతో గురువారం, శుక్రవారం ఆయన యాత్రకు విరామం వచ్చింది. దీంతో పాటు ఉద్ధానం అంశంపై అల్టిమేటం జారీ చేసినందున ప్రభుత్వ స్పందన కోసం కూడా ఆయన వేచి చూసే ధోరణిలో భాగంగా విరామం ప్రకటించి, అక్కడే విడిది చేశారని అంటున్నారు.

ప్రభుత్వ స్పందనను బట్టి ముందుకు
'పవన్ కళ్యాణ్ వ్యక్తిగత భద్రతా సిబ్బంది గాయాల నుంచి పూర్తిగా కోలుకోనందున శుక్రవారం కూడా ఆయన కార్యక్రమాలు రద్దయ్యాయి. శనివారం నుంచి పోరాట యాత్ర కొనసాగుతుంది' అని పార్టీ మీడియా విభాగం ప్రతినిధి హరిప్రసాద్ గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. కానీ తన అల్టిమేటంపై ప్రభుత్వం స్పందించకుంటే.. అనే అంశంపై ముందుకెళ్లేందుకు పవన్ సమాలోచనలు జరిపారని తెలుస్తోంది. ప్రభుత్వం స్పందనను బట్టి ముందుకెళ్తామనుకున్నారు. స్పందన రాలేదు.

పవన్ కళ్యాణ్ అనూహ్య నిర్ణయం
ఇందులో భాగంగా శనివారం ఒక్కరోజు దీక్షకు పవన్ సిద్ధమయ్యారు. ఉద్దానం సమస్యకు పరిష్కార మార్గం, ఆరోగ్య శాఖ మంత్రిని నియమించాలంటూ పవన్ రెండు రోజుల క్రితం గడువు ఇచ్చారు. పవన్ డెడ్ లైన్ను ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు. దీంతో అతను అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. సమస్య పరిష్కారం కోసమై ఒక్కరోజు దీక్షకు సిద్ధమయ్యారు.

కొత్తగా ఆలోచిస్తున్న పవన్ కళ్యాణ్
తనకు పదవులు ముఖ్యం కాదని, ప్రజా సమస్యల పరిష్కారం ముఖ్యమని పదేపదే చెబుతున్న పవన్ కళ్యాణ్ అందరికీ భిన్నంగా రాష్ట్రంలో పర్యటిస్తున్నట్లుగా కనిపిస్తోంది. అందరికి భిన్నంగా, కొత్తగా ముందుకు సాగుతున్నారని అంటున్నారు. సాధారణంగా ఏ నాయకుడు అయినా పాదయాత్ర లేదా బస్సు యాత్ర ఏవిధంగా పర్యటించినా అక్కడి సమస్యలను అవగాహన తెచ్చుకుంటారు. ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇస్తారు.

కొత్త ఆలోచన.. మొండిగా ముందుకెళ్తున్నారా?
పవన్ కళ్యాణ్ మాత్రం భిన్నంగా ముందుకు వెళ్తున్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు. సమస్యలను తెలుసుకునేందుకే తాను యాత్ర చేస్తున్నానని పవన్ చెబుతున్నారు. అయితే, ఉద్ధానం వంటి పెద్ద, చాలాకాలంగా ఉన్న సమస్యలపై పవన్ ప్రభుత్వం నుంచి వెంటనే స్పందన వచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. ఆయా ప్రాంతాల్లో పర్యటించి, సమస్యపై మాట్లాడటంతో పాటు వెంటనే ప్రభుత్వం స్పందించేలా చేయడమే ఆయన ఉద్దేశ్యంగా కనిపిస్తోంది. ఓ విధంగా సమస్యల పరిష్కారంపై మొండి పట్టుదలతో ముందుకెళ్లడమే ఆయన ఉద్దేశ్యంగా కనిపిస్తోందని అంటున్నారు.

ఐనా ప్రభుత్వం స్పందించకుంటే ఒక్కో అస్త్రం బయటకు తీస్తారా?
అందుకే, ఉద్ధానం సమస్య, ఆరోగ్య శాఖ మంత్రి నియామకంపై 48 గంటల సమయం ఇచ్చి, ఒకరోజు దీక్షకు పూనుకున్నారని అంటున్నారు. సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం దిగి వచ్చేలా ప్రయత్నాలు చేయడమే ఆయన ప్రధాన ఉద్దేశ్యమని అంటున్నారు. అయితే, ఆయన ఒక్కరోజు దీక్ష చేసినా ప్రభుత్వం దిగి వస్తుందా లేదా అనేది చూడాలి. ఒకవేళ ప్రభుత్వం దిగిరాకుంటే పవన్ ఒక్కో అస్త్రాన్ని బయటకు తీస్తారా? అనేది చూడాలని అంటున్నారు.

చంద్రబాబుకు దెబ్బకు దెబ్బ
ప్రభుత్వంపై విమర్శలు చేయకముందు పవన్ లేవనెత్తిన సమస్యపై ప్రభుత్వం ఆగమేఘాల మీద స్పందించేది. జగన్ రాజకీయంతో సమస్యలు లేవనెత్తుతున్నారని, కానీ పవన్ అసలైన ప్రతిపక్షంగా వ్యవహరిస్తూ సరైన సమస్యలను లేవెనత్తుతున్నారని మంత్రులు సహా టీడీపీ నేతలు ప్రశంసించారు. రాజకీయం చేయకపోవడం వల్లే వాటిపై స్పందిస్తున్నామని చెప్పారు. కానీ అవినీతిపై విమర్శల అనంతరం మాత్రం పవన్పై ఎదురుదాడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాను లేవనెత్తిన సమస్యకు ప్రభుత్వం స్పందించదని ముందే గుర్తించి 48 గంటల దీక్ష అల్టిమేటం జారీ చేసి ముందుకెళ్తున్నారని అంటున్నారు. అప్పుడు కూడా స్పందించకుంటే ఏమైనా అనూహ్య నిర్ణయం తీసుకుంటారా? నాడు ఒకలా, ఈ రోజు మరొకలా టీడీపీ వ్యవహారశైలి ఉన్నందుకు దీక్ష.. ఆ తర్వాత మరో అస్త్రంతో చంద్రబాబుకు ఊహించని షాకిస్తారా అనేది చూడాలని అంటున్నారు. అలా కాకపోయినా సమస్య పరిష్కారం కోసం తాను తీవ్రంగా ప్రయత్నించిన క్రెడిట్ పవన్కు ఉంటుంది.












Click it and Unblock the Notifications