పవన్ కళ్యాణ్ కు ప్రధాని మోదీ ఆహ్వానం - వెళ్లలేనంటూ జనసేనాని..!!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ప్రధాని మోదీ నుంచి ఆహ్వానం అందింది. ఢిల్లీలో ఈ సాయంత్రం ఏర్పాటు చేసిన అధికారిక విందుకు హాజరు కావాలని ఆహ్వానం పంపారు. ఈ విషయాన్ని స్వయంగా పవన్ కళ్యాణ్ నిర్దారించారు. రాష్ట్రపతిగా పదవీ విరమణ చేయనున్న రామ్నాథ్ కొవింద్ వీడ్కోలు సభ ఈ సాయంత్రం ఢిల్లీలోని ఆశోకా హోటల్ లో జరగనుంది. ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా దేశ వ్యాప్తంగా అనేక మంది ప్రముఖులకు ఆహ్వానాలు పంపారు. రాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో పలు పార్టీల అధ్యక్షులు..సుప్రీం న్యాయమూర్తులు.. కేంద్ర మంత్రులు..పలువురు సీఎంలు సైతం ఇందుకు హాజరు కానున్నారు. అయితే, తనకు ఆహ్వానం అందిన విషయాన్ని వెల్లడించిన పవన్..తప్పనిసరిగా హాజరుకావాల్సిన ఈ చరిత్రాత్మక సభకు ఆరోగ్య కారణాల దృష్ట్యా వెళ్లలేకపోతున్నానని చెప్పారు.

హాజరు కాలేకపోతున్నానంటూ
అందుకు చింతిస్తున్నట్లు పేర్కొన్నారు. రామ్నాథ్ కొవింద్ తన అయిదేళ్ల పదవీకాలంలో ఎటువంటి పొరపొచ్చాలకు తావు లేకుండా రాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వర్తించటం ఆయనలోని రాజనీతిజ్ఞతకు నిదర్శనమని జనసేన అధినేత పవన్ కొనియాడారు. ఆయన తన సేవలను నిర్విరామంగా నిర్వర్తించాలని,ఆ భగవంతుడు ఆయనకు సంపూర్ణ ఆరోగ్య ఆనందాలను ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. తనను సభకు ఆహ్వానించిన ప్రధాని మోదీ, అమిత్ షాకు పవన్ కృతజ్ఞతలు తెలిపారు. 2019 ఎన్నికల తరువాత ఏపీలో బీజేపీ - జనసేన మధ్య పొత్తు ఖరారు అయినప్పటి నుంచి ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ ప్రధానితో సమావేశం కాలేదు.

ప్రధాని సభకు దూరంగా పవన్
విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ను కలిసారు. పలు సందర్బాల్లో బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతోనే సమావేశాలు నిర్వహించారు. ఇక, ఇప్పుడు ఏపీలో పొత్తుల వ్యవహారం..టీడీపీ - జనసేన పొత్తు అంశం పైన అనేక రకాలుగా చర్చలు సాగుతున్న వేళ.. పవన్ రాజకీయ నిర్ణయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. బీజేపీ మాత్రం తాము జనసేనతోనే 2024 ఎన్నికలకు వెళ్తామని చెబుతోంది. ప్రధాని కొద్ది రోజుల క్రితం భీమవరంలో అల్లూరి సీతారామ రాజు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ సమయంలో జనసేన అధినేతకు ఆహ్వానం అందినా.. ఆయన ఆ సభకు దూరంగానే ఉన్నారు. చిరంజీవి హాజరు కావటం.. పవన్ రాకపోవటం పైన అనేక రకాలుగా చర్చలు జరిగాయి.

వైరల్ ఫీవర్ కారణంగా వెళ్లలేకపోతున్నానంటూ
తాను హాజరు కాకపోవటం వెనుక కారణాలను ఆ తరువాత పవన్ వెల్లడించారు. ఇక, ఇప్పుడు కేంద్రం నుంచి పవన్ కు ఆహ్వానం అందంటం..పవన్ అనారోగ్య కారణాలతో హాజరు కావటం లేదని వెల్లడించటంతో ఇప్పుడు మరోసారి రాజకీయంగానూ కొత్త చర్చలకు కారణమవుతోంది. తాజాగా జరిగిన రాష్ట్రపతి ఎన్డీఏ అభ్యర్ధిగా ఉన్న ద్రౌపది ముర్ముకు ఏపీలో వైసీపీ - టీడీపీ మద్దతు ప్రకటించాయి. ముర్ము ఈ నెల 25న నూతన రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుత రాష్ట్రపతి కోవింద్ 24న పదవీ విరమణ చేయనున్నారు. దీంతో..ఆయన అయిదేళ్ల కాలం రాష్ట్రపతిగా చేసిన సేవలకు గుర్తిస్తూ..కేంద్రం ఘనంగా వీడ్కోలు పలకాలని నిర్ణయించింది.












Click it and Unblock the Notifications