చీడపురుగు! మదమెక్కిన మాటలు..: ద్వారంపూడిని ఏకిపారేసిన పవన్ కళ్యాణ్
కాకినాడ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, నేతలపై పవన్ కళ్యాణ్ విమర్శలు గుప్పించారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వారి భాష ఎలావుందో ప్రజలకు తెలుసని అన్నారు. మంగళవారం కాకినాడలో పర్యటించిన పవన్ కళ్యాణ్ ఆదివారం జరిగిన దాడిలో గాయపడిన జనసేన నేతలు, కార్యర్తలను పరామర్శించారు.

ఇదే ఆఖరు కావాలి.. లేదంటే..
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ప్రజాప్రతినిధులు, మంత్రులు బాధ్యతాయుతంగా మాట్లాడాలని అన్నారు. తాము అయ్యా అంటూ మాట్లాడుంటే.. ఓరేయ్ తురేయ్ అంటూ వైసీపీ నేతలు, మంత్రులు స్థాయి దాటి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. జనసేన నేతలపై దాడులు జరిగిన సమయంలో పోలీసులు బాధ్యతా రహితంగా వ్యవహరించారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. దాడి చేసిన వారిపై జిల్లా ఎస్పీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి దాడి ఘటనలు జరగకూడదని ఇదే ఆఖరుది కావాలని అన్నారు. లేదంటే దాడులకు పోలీసులు, ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పారు.

ద్వారంపూడివి మదమెక్కిన మాటలు..
వైసీపీనేత ద్వారంపూడి మదమెక్కిన మాటలు మాట్లాడుతున్నారని పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. ఆ మదాన్ని ప్రజలే అణచివేస్తారని అన్నారు. పండగ సమయంలో లేని గొడవలు సృష్టించారని మండిపడ్డారు. తెలుగు ప్రజలు సుఖశాంతులతో ఉండాలని తాము కోరుకుంటున్నామని అన్నారు. అందుకే బాధ్యతాయుతమైన రాజకీయ చేస్తున్నామని చెప్పారు. ఒకే చోట రాజధాని ఉండాలని, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని కోరుకుంటున్నామని చెప్పారు.

ఆవేదనకు గురిచేసింది..
అమరావతి సమస్యను, రైతుల సమస్యలను తాను ఢిల్లీకి వెళ్లి వివరిస్తుంటే ఇక్కడ ఇలాంటి ఘటనలు జరగడం బాధ, ఆవేదనకు గురిచేసిందన్నారు పవన్. దాడికి బాధ్యులైన ఇద్దరు అధికారులపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు, ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దాడులు చేసిన వీడియోలున్నాయని, రిపోర్టు తయారు చేసి గవర్నర్ వద్దకు తీసుకెళ్తామని పవన్ కళ్యాణ్ చెప్పారు.

ద్వారంపూడిలాంటి చీడపురుగులను..
ఇకనుంచైనా 151 మంది ఎమ్మెల్యేలతో సుస్థిర ప్రభుత్వాన్ని ఇవ్వండని అన్నారు. పాలేగాళ్ల ఫ్యాక్షన్ సంస్కృతిని తీసుకొస్తామంటే ప్రజలు సహించరని అన్నారు. దాడులు చేసిన వారిపై ఎస్పీ చర్యలు తీసుకోవాలని, కేసులు పెట్టాలని చెప్పారు.ద్వారంపూడిలాండి చీడపురుగులను వెలియాలని ప్రజలకు పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications