నన్ను జగన్ను కలుపుతారా, డేటాచోరీపై ఆటలు ఆపండి: కేసీఆర్-బాబులపై పవన్ కీలక వ్యాఖ్యలు
నరసారావుపేట: రెండు రాష్ట్రాల మధ్య జరుగుతున్న డేటా చోరీ రాజకీయంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారం నిప్పులు చెరిగారు. టీడీపీ ఏపీ ప్రజల డేటాను దొంగతనంగా తీసుకుందని టీఆర్ఎస్, వైసీపీ నేతలు ఆరోపిస్తుండగా, వైసీపీని వచ్చే ఎన్నికల్లో గెలిపించడం కోసం హైదరాబాదులోని తమ వారి ఐటీ కార్యాలయాల్లో సోదాలు చేసి ఆ డేటాను వైసీపీకి ఇచ్చేందుకు తెరాస ప్రయత్నిస్తుందని టీడీపీ ఆరోపిస్తోంది. దీంతో ఇరు రాష్ట్రాల అధికార పార్టీ నేతలు, మంత్రులు నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. దీనిపై పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
డేటా తొలగింపు: 'ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి, కీలక సూత్రధారులు బొత్స, పీకే'
కేసీఆర్-చంద్రబాబలు మీ ఆటలు ఆపాలి
నేను ఏం చెయ్యగలనో ఏది సాధ్యమో అదే మ్యానిఫెస్టోలో పెడుతున్నానని, అంతే గాని నవరత్నాలు, వజ్రాలు అని నేను అబద్దాలు చెప్పడం లేదని పవన్ అన్నారు. కాంగ్రెస్ పార్టీకి మరోపేరు వైసీపీ అన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు, కేసీఆర్లకు పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చారు. చంద్రబాబు, కేసీఆర్లకు ఒకటే చెబుతున్నానని, మీ ఇద్దరు ముఖ్యమంత్రులు ఆడే రాజకీయ ఆటలతో ప్రజలు నలిగిపోతున్నారని, దయచేసి మీ ఆటలు ఆపండని హితవు పలికాలు. ఇటీవల ఓటర్ల జాబితా ఏపీ, తెలంగాణల మధ్య రాజకీయ వేడి రాజేసిన విషయం తెలిసిందే.
ఓటుకు నోటు, నాగార్జున సాగర్, డేటా చోరీ
ఎవరో ఎమ్మెల్యేలు, మంత్రులు చేసిన తప్పుకు ఆంధ్ర ప్రజలని కేసీఆర్ తిడుతున్నా సరే మన రాష్ట్ర నాయకులకు పౌరుషం లేదని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ఇద్దరు ముఖ్యమంత్రుల రాజకీయ క్రీడలో ప్రజలు నలిగిపోతున్నారని జనసేనాని అన్నారు. కేసులకు, దాడులకు భయపడేది లేదని చెప్పారు. మొన్న ఓటుకు నోటు, నిన్న నాగార్జునసాగర్ వద్ద రెండు రాష్ట్రాల పోలీసుల గొడవ, నేడు డేటా చోరీ.. ఇలా కేసీఆర్, చంద్రబాబుల రాజకీయ చదరంగంలో ప్రజలు నలిగిపోతున్నారన్నారు. ఇద్దరు బలమైన నాయకులు గేమ్ ఆడుతున్నారని ధ్వజమెత్తారు.
నన్ను, జగన్ను కలుపుతామంటారు
కేసీఆర్ ఉద్యమం సమయంలో చాలా తిట్టారని, ఉద్యమస్ఫూర్తిని అర్థం చేసుకొని భరించామని, విభజన తర్వాత రెండు రాష్ట్రాల మధ్య గొడవలు భరించే పరిస్థితిలో లేమని పవన్ అన్నారు. ఓ వైపు టీడీపీ తమతో కలిసి రావాలని పిలుస్తోందని, మరోవైపు తెరాస.. జగన్ను, పవన్ను కలుపుతామని చెబుతోందని, ఈ పొలిటికల్ గేమ్స్ చూసి విసుగు వచ్చిందన్నారు. వచ్చే ఎన్నికల్లో తాము లెఫ్ట్ పార్టీలతో తప్ప ఎవరితోను కలిసే ప్రసక్తి లేదన్నారు.
ఇది 2009 కాదు
భారతదేశం అంతా తనదే అనుకుంటానని, నా ప్రదేశం నిర్ణయించడానికి మీరెవరని, దేశం కోసం తన ప్రాణం కూడా ఇచ్చేందుకు సిద్ధమని పవన్ కళ్యాణ్ అన్నారు. వైసీపీ నాయకులు తమ ప్రచార రథంపై దాడి చేయించారని, టీడీపీ వారు పోలీసులు చేత తమ జన సైనికులను కొట్టించారని మండిపడ్డారు. ఒక్కటే చెబుతున్నానని, ఇలాంటి తప్పుడు పనులు చేయవద్దని, అలా కాదు మీకు యుద్ధమే కావాలని మీరు అనుకుంటే మేం ఏమిటో.. మా బలం ఏమిటో చూపిస్తామని జగన్, చంద్రబాబుకు హెచ్చరికలు జారీ చేశారు. మీరు చేసే పిచ్చి పనులను చూస్తు ఊరుకునేందుకు ఇది 2009 కాదన్నారు. తద్వారా ప్రజారాజ్యం పార్టీని గుర్తు చేశారు. తాము రాజకీయాల్లోకి నవతరాన్ని తీసుకు వస్తామని చెప్పారు.