యూపీఏ పథకంపై పవన్ ప్రశంసలు-రాష్ట్రాన్ని ఆదుకుంది తన శాఖేనంటూ..!
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ మేడే సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు. మేడే సందర్భంగా మంగళగిరిలోని ఓ ప్రైవేటు కన్వెన్షన్ సెంటర్ లో ఉపాధి కార్మికులతో పవన్ ఆత్మీయ భేటీ ఏర్పాటు చేశారు. ఇందులో యూపీఏ హయాంలో అమల్లోకి వచ్చిన జాతీయ ఉపాధి హామీ పథకంపై పవన్ ప్రశంసల జల్లు కురిపించారు. అదే సమయంలో ఈ పథకం ద్వారా రాష్ట్రానికి జరుగుతున్న మేలును కూడా వివరించారు.
కేంద్ర ప్రభుత్వ జాతీయ ఉపాధి హామీ పథకం నరేగా వల్ల రాష్ట్రానికి ఎంతో మేలు జరుగుతుందని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఉపాధి హామీ పథకం రాష్ట్రానికీ, దేశానికి గొప్ప వరం అని పవన్ పేర్కొన్నారు. రాష్ట్రాభివృద్ధికి ఇది వెన్నెముకగా మారిందని వెల్లడించారు. ఈ పథకం వల్ల రాష్ట్రంలో 75 లక్షల మంది శ్రామికులు సొంత ఊర్లలోనే ఉపాధి పొందుతున్నట్లు తెలిపారు. గత ఆర్ధిక సంవత్సరంలో తన పంచాయతీరాజ్ శాఖ ఉపాధి హామీ పథకం కింద 10 వేల కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు పవన్ వెల్లడించారు.

పల్లె పండుగలో భాగంగా రాష్ట్రంలో 21 వేల గోకులాలు నిర్మించామని, దీని వల్ల ప్రతీ రైతుకు 4200 అదనపు అదాయం లభిస్తుందని పవన్ తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం మద్య నిషేధం అంటూ అధికారంలోకి వచ్చి వ్యాపారం చేసిందని ఆరోపించారు. 3500 కోట్ల లిక్కర్ స్కాంకు పాల్పడిందన్నారు. వైసీపీ హయాంలో రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని, ఇలాంటి పరిస్ధితుల్లో తన శాఖ పంచాయతీరాజ్ నిధులే రాష్ట్రానికి ఆక్సిజన్ అయ్యాయన్నారు.

రాష్ట్రంలో ఉపాధి హామీ కార్మికులకు ప్రధాన మంత్రి జీవిత భీమా కల్పిస్తున్నట్లు పవన్ తెలిపారు. ప్రమాదాలు జరిగినప్పుడు కార్మికులకు 2 లక్షల బీమా మొత్తం లభిస్తుందన్నారు.అలాగే పని ప్రదేశంలో ప్రమాదాలు జరిగినప్పుడు ఇస్తున్న పరిహారాన్ని సైతం 50 వేల నుంచి 2 లక్షలకు పెంచుతున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించారు.












Click it and Unblock the Notifications