సస్పెన్స్: 11న పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రకటన?
హైదరాబాద్: పవర్ స్టార్, కేంద్ర మంత్రి చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ రాజకీయ రంగ ప్రవేశంపై విస్తృతంగా ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఆయన పార్టీని ప్రకటిస్తే రాజకీయాల్లో పెను మార్పులు వచ్చే అవకాశాలు సంభవిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ కొత్త పార్టీ పెడుతాడా, మరో పార్టీకి తన బలాన్ని సమకూరుస్తారా అనేది తెలియడం లేదు.
లోకసత్తా అధినేత జయప్రకాష్ నారాయణ పవన్ కళ్యాణ్ను తన పార్టీలోకి ఆహ్వానించారు. 2014 ఎన్నికల్లో కొత్త పార్టీలు పుట్టుకు వస్తున్న నేపథ్యంలో మరొక పార్టీ పుట్టుకు వస్తుందా? లేక ఉన్న పార్టీలకు ఒక శక్తి తోడవ్వబోతుందా అన్న దానిమీద ఈనెల 11న సస్పెన్స్ వీడే అవకాశం కనిపిస్తోందనే వార్తలు వస్తున్నాయి. పవన్ కల్యాణ్ ఇప్పటికే రాజకీయాల్లో మునిగి తేలుతున్నట్లు చెబుతున్నారు.
తన రాజకీయ రంగ ప్రవేశానికి సంబంధించి ఆయన ఓ పత్రికా అధినేత, మరికొంత మంది నేతలతో మంతనాలు జరుపుతున్నట్లు చెబుతున్నారు. ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించిన నేతలతో మంగళవారం ఉదయం పవన్ కల్యాణ్ చర్చలు జరిపినట్లు చెబుతున్నారు.
రామచంద్రాపురం ఎమ్మెల్యే త్రిమూర్తులు, పిఠాపురం శాసనసభ్యురాలు వంగా గీత ఈ విషయాన్ని ధృవీకరించారు. వీరిద్దరి సలహాతోనే పవన్ కల్యాణ్ ముందుకు వెళుతున్నట్లు సమాచారం. త్వరలో పవన్ ఓ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయవచ్చనని వార్తలు వస్తున్నాయి. కొత్త పార్టీ పెట్టాలా, ఏదైనా రాజకీయ పార్టీని ఎంచుకోవాలా అనే విషయంపై పవన్ కళ్యాణ్ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.