మీరు పొగిడారు కానీ, అసలు విషయం ఇదీ!: బాబుపై గవర్నర్కు పవన్ ఫిర్యాదు!!
అమరావతి: శ్రీకాకుళం జిల్లాను అతలాకుతలం చేసిన టిట్లీ తుఫాను, తదనంతర సహాయక చర్యల పైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారం రాజ్ భవన్ మెట్లు ఎక్కనున్నారు. ఈ మేరకు ఆయన సాయంత్రం గవర్నర్ను కలిసి విజ్ఞప్తి, ఫిర్యాదు చేయనున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు ఆయనకు రాజ్ భవన్ గవర్నర్తో అపాయింటుమెంట్ ఇచ్చింది.
టిట్లీ తుఫాను బీభత్సం, ప్రజలకష్టాలను ఆయన గవర్నర్కు చెప్పనున్నారు. తుఫాను వెళ్లిపోయి పదిపదిహేను రోజులు అవుతున్నప్పటికీ విద్యుత్ పునరుద్ధరణ జరగలేదని, సహాయక చర్యలు అంతంతమాత్రంగానే ఉన్నాయని, సహాయక చర్యలు వేగంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరనున్నారు. తద్వారా చంద్రబాబు ప్రభుత్వంపై ఫిర్యాదు చేయనున్నారు.
మీరు అన్నారు గానీ.. బాబుపై గవర్నర్కు పవన్ ఫిర్యాదు
టిట్లీ తుఫాను సహాయక చర్యలపై ఇటీవల గవర్నర్ నరసింహన్ ప్రశించారు. ప్రభుత్వం చర్యలు బాగున్నాయని కితాబిచ్చారు. ఈ నేపథ్యంలో టిట్లీ తుఫాను బాధితుల తరఫున పవన్ తాజా పరిస్థితులను గవర్నర్కు నివేదించనున్నారు. సహాయకచర్యలు ఆశించిన మేర లేవని చెప్పనున్నారు. టిట్లీ తుఫానుతో ప్రజలు అల్లాడుతుంటే దానితో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు రాజకీయం చేస్తున్నారని జనసేనాని ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న విషయం తెలిసిందే.
దత్తత తీసుకుంటా, థ్యాంక్స్ బాబాయి: పవన్ చెప్పిన మరుసటి రోజే చెర్రీ ప్రకటన, ఉపాసన ట్వీట్
ప్రజలు ఏమనుకుంటున్నారో చెబుతున్నా
టిట్లీ తుఫాను విపత్తును సైతం చంద్రబాబు ప్రచార ఆర్భాటంగా మార్చేసారని పవన్ మండిపడ్డారు. క్షేత్రస్థాయిలో వాస్తవాలు తెలుసుకోవాలని సూచించారు. ఉద్ధానం ప్రాంతాన్ని తుఫాను నేలమట్టం చేస్తే అక్కడ జరిగిన నష్టాన్ని బయటి ప్రపంచానికి తెలియకుండా ప్రభుత్వం సహాయక చర్యలంటూ బాధిత ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. తుఫాను తీవ్రతను పట్టించుకోకుండా ప్రజలను అప్రమత్తం చేయడంలో విఫలమయ్యారన్నారు. జరిగిన నష్టం గవర్నర్కు కూడా తెలియదన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలు ఏమనుకుంటున్నారో దానిని ప్రభుత్వానికి చెబుతున్నానని అన్నారు.
అందుకే ఎవరూ సహాయం చేయడం లేదు
రాష్ట్రంపై కేంద్రం వివక్ష చూపుతోందని, ఉత్తరాంధ్ర జిల్లాలను ఆదుకోవాల్సిన అవసరం ఉందనికూడా పవన్ అన్నారు. టిట్లీ తుఫాను కారణంగా జరిగిన నష్టంపై ప్రధానికి జనసేన పార్టీ లేఖ రాస్తుందని చెప్పారు. మంగళవారం నుంచి జనసేన ప్రత్యేక బృందాలు క్షేత్రస్థాయిలో సహాయక చర్యలు చేపడతాయన్నారు. సినీ పరిశ్రమ అంటే డబ్బున్నోళ్లు కాదని, అందరి వద్ద డబ్బు లేదని, అయినా జరిగిన నష్టం గురించి తెలియకపోవడంతోనే ఎవరూ సహాయం చేయడానికి ముందుకురావడం లేదన్నారు.
సత్కారాలు ఏమిటి?
ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రచారం కోసం పాకులాడుతున్నారని, వివరాలు చెప్పడం లేదని పవన్ అన్నారు. ప్రజలు కష్టాల్లో ఉంటే విజయోత్సవ ర్యాలీలు, సత్కారాలా అని నిప్పులు చెరిగారు. మత్స్యకారులకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలన్నారు. టిట్లీ తుఫాను బాధితులకు సాయం విషయంలోను బేధాభిప్రాయాలు చూపిస్తున్నారని ఆరోపించారు.